Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్‌’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!

‘పెద్ద సినిమా’ అంటే హిందీ సినిమానే. అక్కడి నటీనటులే ఇండియన్‌ సినిమా స్టార్లు. ఖాన్‌ త్రయం, కపూర్ ఫ్యామిలీ,

Published : 26 Jun 2022 01:50 IST

హిట్లు లేక హిందీ సినిమా ఆపసోపాలు

మన దేశంలో ‘పెద్ద సినిమా’ అంటే హిందీ సినిమానే. అక్కడి నటీనటులే ఇండియన్‌ సినిమా స్టార్లు. ఖాన్‌ త్రయం, కపూర్ ఫ్యామిలీ, యాక్షన్‌ హీరోలు అక్షయ్‌, అజయ్‌... వీళ్లే అగ్రతారలు. అయితే ఇదంతా గతం. గత పదేళ్లలో భారతీయ చిత్రపరిశ్రమలో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు దక్షిణాది చిత్రాలు/ కథల హవా ఇండియన్‌ సినిమాను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్నాయి. అదే సమయంలో బాలీవుడ్‌ వసూళ్ల వేటలో వెనుకబడింది. దీనికి కారణమేంటి?

బాలీవుడ్‌కు ఏమైంది?

గత కొంతకాలంగా హిందీ చిత్రాలేవీ ఆశించిన విజయాన్ని అందుకోలేక బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడుతున్నాయి. మూస ధోరణిలో సాగే కథలు, శ్రుతి మించిన యాక్షన్‌, శృంగారం లాంటివి ఉంటే సినిమా ఆడేస్తుందన్న భ్రమల నుంచి దర్శక నిర్మాతలే కాదు, కథానాయకులు సైతం బయటకు రాలేకపోయారు. దీనికి అగ్ర కథానాయకులు కూడా మినహాయింపేమీ కాదు. ఒకప్పుడు అభిమాన హీరో ఎలాంటి సినిమా తీసినా చూసే ప్రేక్షకుడే ఆ తర్వాత చిత్రాలను నిక్కచ్చిగా తిరస్కరించటం మొదలు పెట్టాడు. అదే సమయంలో సరికొత్త కథలు, నేపథ్యాలతో దక్షిణాది నుంచి వస్తున్న పాన్‌ ఇండియా చిత్రాలపై హిందీ ప్రేక్షకులకు నెమ్మదిగా ఆసక్తి ఏర్పడింది. ఓటీటీల రాకతో అది తారస్థాయికి చేరింది.

దెబ్బ మీద దెబ్బ పడుతున్నా మారని తీరు!

వరుస పరాజయాలు పలకరిస్తున్నా బాలీవుడ్‌ హీరోలు మూసధోరణి కథలను వదిలిపెట్టకపోగా, భారీ బడ్జెట్‌లు పెట్టి మరీ తీయడం మొదలు పెట్టారు. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన  ‘సమ్రాట్ పృథ్వీరాజ్‌’ అనే చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రమే అందుకు ఉదాహరణ. అక్షయ్‌ కుమార్‌, సంజయ్‌దత్‌, మానుషి చిల్లార్‌, సోనూ సూద్‌, అశుతోష్‌ రాణా లాంటి భారీ తారాగణంతో సీనియర్‌ డైరెక్టర్‌ చంద్రప్రకాశ్‌ ద్వివేది తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.80 కోట్ల వసూళ్లు రాబట్టి, బాలీవుడ్‌ ఖాతాలో మరో డిజాస్టర్‌గా నిలిచింది. 

ఇదే కాదు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్‌ చేసిన ‘ధాకడ్‌’ పరిస్థితీ ఇంకా దారుణం. సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ. 4 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. అలాగే ఈ ఏడాది విడుదలైన ‘రన్‌ వే 34’, ‘హీరో పంటి 2’, ‘బచ్చన్‌ పాండే’, ‘అటాక్’ వంటి పెద్ద చిత్రాలు సైతం కనీస కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. అధిక బడ్జెట్‌తో, భారీ హంగులతో విడుదలైనా ఈ చిత్రాలలో ఏదీ కనీసం రూ.100 కోట్ల మార్కును దాటలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో దక్షిణాది చిత్రాలు ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌ 2’ చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి.

మారాల్సిందేంటి?

‘ఇండియన్‌ సినిమాలన్నీ ఒకే అంశం చుట్టూ తిరుగుతాయి’ - ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ఒకప్పుడు చెప్పిన మాట ఇది. బాలీవుడ్‌ సినిమాల ధోరణికి ఇదిప్పుడు సరిగ్గా సరిపోతుంది. (అప్పుడు కూడా ఆయన బాలీవుడ్‌ సినిమాలను దృష్టిలో పెట్టుకునే అన్నారు) ఒక పక్క దక్షిణాది సినిమాలు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు తీస్తుంటే ఇంకా మూస కథలనే నమ్ముకుంటున్నారు బాలీవుడ్‌ డైరెక్టర్లు. భారీ హిట్‌లు కావాలంటే హిరాణి, తివారీ, భన్సాలీ, భండార్కర్‌ల వైపు చూసే రోజులు పోయాయని గుర్తించలేకపోతున్నారు. ప్రేక్షకుడికి కావాల్సిదేంటో తెలియక కొత్త దర్శకులు తికమకపడి దక్షిణాది సినిమాల వైపు చూస్తున్నారు.

ఇక హీరోలు సైతం ప్రేక్షకులను అర్థం చేసుకోవటంలో విఫలమవుతున్నారు. ఇతర చిత్ర పరిశ్రమలో యువ హీరోలు కొత్త కథలతో సంచలనాలు సృష్టిస్తుంటే బాలీవుడ్‌ సినిమా హిట్‌ కొట్టడానికి యాభై ఏళ్లు పైబడిన హీరోలపైనే ఆధారపడుతోంది. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడి కుర్ర హీరోలు ఎంత వెనకబడ్డారో. మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అంటూ దక్షిణాది చిత్రాలను ఒకప్పుడు చులకనగా చూసిన బాలీవుడ్‌... ఆ ఫార్ములాకు అలవాటు పడిన హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక నానా తంటాలు పడుతోంది.

‘‘బాలీవుడ్‌ యువ హీరోలు భారతీయ ప్రేక్షకులను మెప్పించడం కష్టం. ఎందుకంటే వాళ్లకి ప్రేక్షకుల భావనలు ఎలా ఉంటాయనేదే తెలియదు. దక్షిణాది కథానాయకులు ప్రేక్షకుల మధ్యనే పెరుగుతారు. సహజంగానే వారికి భావంతో కూడిన నటన అబ్బుతుంది’’ - కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో కథానాయిక కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలివీ. పరిశీలించి చూస్తే ఆమె మాటల్లోనూ నిజం లేకపోలేదు. రొటీన్‌ కథల ఎంపిక, కృత్రిమ అభినయంతో కొందరు బాలీవుడ్‌ యువనటుల నటనా కౌశలం హిందీ ప్రేక్షకులకు వెగటు పుట్టిస్తోంది. సౌత్ హీరోలకు హిందీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన అభిమానం లభించడానికి కారణం కూడా ఇదే. ప్రేక్షకులకు తామేంటో నిరూపించుకొవాల్సిన బాధ్యత బాలీవుడ్‌ యువ హీరోలకు ఉంది. రణ్‌బీర్ కపూర్‌, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌, ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌కుమార్‌ రావ్‌, అలియా భట్, శ్రద్ధా కపూర్‌ లాంటి కొద్దిమందే చెప్పుకోదగిన విధంగా రాణిస్తున్నారు.

ఇమేజ్‌ ఛట్రంలో ఇరుక్కుపోయిన బాలీవుడ్‌ హీరోలు ఇకనైనా దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది సినీ విమర్శకుల మాట. ఒక భాషలో విజయవంతమైన కథను, సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని సినిమా తీస్తున్నప్పుడు ప్రేక్షకుల అభిరుచి అనుగుణంగా మార్పులు చేసుకోకపోతే, తెరపై నవ్వులపాలు కావటం ఖాయం. ‘‘సహజత్వం అందుకోలేమనే భయంతోనే ‘కేజీయఫ్‌’ లాంటి సినిమా మేము తీసుంటే ప్రేక్షకులు చంపేసేవార’’ని ఈ మధ్య కరణ్‌ జోహార్‌ అన్నారు. సన్నివేశాలు సహజంగా రావటానికి కథానాయకులు అవసరమైతే ఒక మెట్టు దిగాలి. అక్షయ్‌ కుమార్‌ లాంటి పెద్ద నటుడే సినిమా కోసం సహజంగా మీసం పెంచడానికి నిరాకరిస్తే, ఇక సినిమాలో సహజత్వం ఎలా వస్తుంది? ‘కేజీయఫ్‌’ కోసం యశ్‌, ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్‌, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం చరణ్‌, తారక్‌లు కష్టపడబట్టే ఆ పాత్రలు అంత సహజంగా వచ్చాయి. తమిళంలో కమల్‌, విక్రమ్‌ సహజత్వంలో పీహెచ్‌డీలు చేశారు.

వీటికి మినహాయింపు..

బాలీవుడ్‌ పూర్తి ఫ్లాప్‌లతోనే సతమతమవుతోందా? అంటే కచ్చితంగా కాదు. వైవిధ్యమైన కథలతో వచ్చిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఎటువంటి అంచనాలు లేని ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ అనూహ్య విజయం సాధించి, రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇంకా ‘గంగూభాయ్ కాఠియావాడి’ కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది. సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ బయోపిక్‌ రూ.200 కోట్ల కలెక్షన్లతో పాటు, భన్సాలీ మార్కు సినిమాగా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అలియా భట్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కార్తిక్‌ ఆర్యన్‌ నుంచి వచ్చిన ‘భూల్‌ భులయ్యా 2’ కూడా అక్కడి ప్రేక్షకుల్ని మెప్పించింది. 

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ పూర్వ వైభవాన్ని అందుకోవాలంటే దక్షిణాది సినిమాల చిత్రీకరణ నుంచి, దర్శకులు, హీరోల నుంచి ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. అప్పుడే ప్రస్తుతం నడుస్తున్న పోటీలో హిందీ సినిమా నిలబడగలదన్నది సినిమా విశ్లేషకుల మాట. చారాణా సినిమా అయినా బారాణా సినిమా అయినా.. కథ, కథనం, సహజత్వం, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఉంటేనే విజయం సాధిస్తుంది. దక్షిణాది సినిమాలు పసిగట్టిన ఈ సూత్రాన్ని హిందీ సినిమా కూడా అలవర్చుకోవాలి. మళ్లీ తమ ఇండస్ట్రీకి పునర్‌ వైభవాన్ని తీసుకురావాలి. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని