బన్ని- కొరటాల కాంబో: స్పందించిన నిర్మాత

అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నట్టు గతంలో ప్రకటించారు. ‘ఏఏ 21’ వర్కింగ్‌ టైటిల్‌తో యువసుధ ఆర్ట్స్‌ పతాకంపై మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్నారు.

Updated : 14 Apr 2021 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నట్టు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఏఏ 21’ వర్కింగ్‌ టైటిల్‌తో యువసుధ ఆర్ట్స్‌ పతాకంపై మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్నారు. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా మరో సినిమా ప్రకటించారు కొరటాల శివ, సుధాకర్‌. ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ఏడాది జూన్‌ ద్వితీయార్ధంలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. దాంతో బన్ని-కొరటాల కాంబినేషన్‌పై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అనివార్య కారణాలతో ‘ఏఏ 21’ నిలిచిపోయినట్టు, అందుకే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారంటూ ప్రచారం సాగింది. ఈ వార్తలపై తాజాగా స్పందించింది చిత్ర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్‌.

‘కొరటాల శివ- అల్లు అర్జున్‌ చిత్రం నిర్మాణ దశలో ఉంది. 2022 ఏప్రిల్‌ తర్వాత పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాల్ని గీతా ఆర్ట్స్‌-2 సంస్థతో కలిసి చర్చిస్తాం. అప్‌డేట్లను యువసుధ ఆర్ట్స్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తాం’ అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు బన్ని. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. చిరంజీవి కథానాయకుడిగా ‘ఆచార్య’ తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని