మా కష్టాలు మాకుంటాయ్‌: అల్లు అర్జున్‌

ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చి, నటులైన వారిని గౌరవిస్తానని కథానాయకుడు అల్లు అర్జున్‌ అన్నారు. కానీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి సినీ కుటుంబం నుంచి వచ్చిన తాము కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఆయన నటించిన....

Published : 10 Jan 2020 17:24 IST

అలాంటి నటుల్ని గౌరవిస్తా కానీ..!

హైదరాబాద్‌: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చి, నటులైన వారిని గౌరవిస్తానని కథానాయకుడు అల్లు అర్జున్‌ అన్నారు. కానీ, పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి సినీ కుటుంబం నుంచి వచ్చిన తాము కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఆయన నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా జనవరి 12న విడుదల కాబోతోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటి వరకూ వచ్చిన ఈ సినిమా పాటలు, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్‌ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో బంధు ప్రీతి అంశం గురించి ప్రస్తావించారు. తన కుటుంబం బంధుప్రీతికి బ్రాండ్‌ అంబాసిడర్ అని జోక్‌ చేశారు.

‘జోక్స్‌ పక్కనపెడితే.. వారసులు కూడా సినీ రంగంలోకి రావడం అనేది ఇష్టం, సెంటిమెంట్స్‌పై ఆధారపడి ఉంటుంది. మునుపటి తరాన్ని ఎంతగా అభిమానించారో.. తర్వాతి తరాన్ని కూడా అంతగానే ఇష్టపడాలి అనుకుంటారు. దీన్నే కొందరు బంధుప్రీతి అంటారు. నా తండ్రి నిర్మాత కాబట్టి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం నాకు చాలా సులభమైంది. తొలినాళ్లలో అది నాకు సహాయం చేసింది. దాన్ని నేను ఖండించడం లేదు. స్వయంగా ఎదిగిన నటులకు నేను చాలా గౌరవం ఇస్తా, నిజంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంటా. కానీ మా కష్టాలు మాకుంటాయనడం కూడా నిజమే’ అని బన్నీ పేర్కొన్నారు.

అనంతరం తన సినిమాల ఎంపిక గురించి ప్రస్తావిస్తూ.. ‘మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకుంటున్నా. అందుకే గ్యాప్‌ వస్తోంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘అల వైకుంఠపురములో..’ సినిమాలకు మధ్య 18 నెలలు గ్యాప్‌ వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాల్నే తీయాలి అనుకున్నా.. ఈ క్రమంలో ఎక్కువ విరామం వచ్చింది. దీన్ని ఊహించలేదు. మరింత ఉత్తమంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలనే ఆలోచన ఈ విరామంలోనే వచ్చింది’ అని బన్నీ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని