Harish Shankar: అందుకే ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ అప్‌డేట్లు ఇవ్వను: హరీశ్‌శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

పవన్‌ కల్యాణ్‌తో తాను తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా గురించి దర్శకుడు హరీశ్‌శంకర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 30 Jan 2023 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే దర్శకుల్లో హరీశ్‌శంకర్‌ ముందుంటారు (Harish Shankar). తన చిత్రాలకు సంబంధించిన విశేషాలతోపాటు ఇతర విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. అలాంటి ఆయన.. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో తాను తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’  (Ustaad Bhagat Singh) గురించి ఇకపై అప్‌డేట్లు ఇవ్వబోనని తెలిపారు. ఆ ప్రాజెక్టు విషయమై కొందరు సోషల్‌ మీడియాలో అతిగా మాట్లాడారు అనేదాన్ని కారణంగా చెప్పారు. తాను డైరెక్ట్‌ చేస్తున్న మూవీ ‘తేరీ’ (తమిళ్‌) రీమేకా, కాదా? అనే విషయాన్ని చెప్పాలనుకున్నానని, పలువురు గీత దాటడంతో ఆగిపోయానని వివరించారు. అభిమానులు తన సోదరుల్లాంటి వారన్న హరీశ్.. ఇతర దర్శకుల్లాకాకుండా ప్రతి విషయాన్ని పంచుకోవాలనుకున్నానని చెప్పారు. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. ‘తేరీ’ రీమేకో కాదో తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందేనన్నారు. అనుకున్న విధంగా షూటింగ్‌ సాగితే 2024 సంక్రాంతికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఈ వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

హరీశ్‌- పవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్‌సింగ్‌’ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తమ కాంబోలో ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే చిత్రం రాబోతుందంటూ హరీశ్‌శంకర్‌ గతంలో ఓ ప్రకటన ఇచ్చారు. దాంతో, అభిమానులు ఖుషీ అయ్యారు. ఆ ప్రాజెక్టు పేరును ఇటీవల ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’గా మార్చి, పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఓ వైపు పేరు మారడం, మరోవైపు సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ ఆలస్యం అవుతుండటంతో నెట్టింట ఊహాగానాలు వ్యాపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని