Liger: అన్ని కోట్ల ఓటీటీ ఆఫర్‌ రిజెక్ట్‌ చేసిన దమ్ము ఎవరిది?.. లైగర్‌ టీమ్‌తో ఛార్మి ఇంటర్వ్యూ

‘‘లైగర్‌’ (Liger)తో ఇండియాను షేక్‌ చేస్తానని చెప్పాను. కానీ, అదొక తప్పు స్టేట్‌మెంట్‌. మనం ఇండియాను షేక్‌ చేయాలి. ఆగస్టు 25న సాలిడ్‌ సినిమాను దింపుతున్నాం’’ అన్నారు విజయ్‌

Updated : 19 Aug 2022 17:20 IST

‘‘లైగర్‌’ (Liger)తో నేను ఇండియాను షేక్‌ చేస్తానని చెప్పా. కానీ, అదొక తప్పు స్టేట్‌మెంట్‌. మనందరం (ప్రేక్షకులు) ఇండియాను షేక్‌ చేయాలి. ఆగస్టు 25న సాలిడ్‌ సినిమాను దింపుతున్నాం’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్‌మార్షల్‌ ఆర్ట్స్‌ మూవీ ‘లైగర్‌’. అనన్య పాండే కథానాయిక. ఛార్మి నిర్మించారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హీరో విజయ్‌, దర్శకుడు పూరిని ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలు మీకోసం..

‘లైగర్‌’ ట్రైలర్‌ చూస్తే, కథ ఏంటో అర్థం కావటం లేదు. మీ సినిమా నుంచి ఇంకో ట్రైలర్‌ వస్తుందా?

పూరి జగన్నాథ్‌: ‘లైగర్‌’ ట్రైలర్‌ కొత్తగా ఎడిట్‌ చేశాం. ఇది ఫుల్లీ లోడెడ్‌ కమర్షియల్‌ మూవీ. ఆ మూమెంట్లే ట్రైలర్‌లో కట్ చేశాం. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ఎక్కువ డైలాగ్‌లు ఆశించారు. ఇందులో హీరో పాత్రకు నత్తి. అలాంటి సందర్భంలో ఎక్కువ డైలాగ్‌లు పెడితే బాగుండదు. నేను ప్రయత్నించా. కానీ, అంత ఆసక్తిగా లేదు. కథ తెలియకపోయినా, ట్రైలర్‌ చూస్తే కథ అర్థమైపోతుంది. తల్లీ-కొడుకులు టీ అమ్ముకుంటూ, రిక్షా తొక్కుతూ బతుకుతారు. ఒక కరీంనగర్‌ కుర్రాడు, వాళ్ల అమ్మ కలిసి ముంబయి వెళ్లి ఏం చేశారు? తన కొడుకును ఛాంపియన్‌గా చూడటానికి ఆమె ఏం చేసింది? తల్లి కల కోసం ఆ యువకుడు ఎంత కష్టపడ్డాడు? ఏం రేంజ్‌కు వెళ్లాడు? అన్నది సినిమాలో చూడొచ్చు..!

సినిమాలో మైక్‌టైసన్‌ ఉంటే చాలా క్రూరంగా ఉంటారని అనుకుంటాం. కానీ, ట్రైలర్‌లో చాలా సరదాగా చూపించారు? ఆయన పాత్ర ద్వారా ఏం ఆశించవచ్చు?

పూరి జగన్నాథ్‌: ట్రైలర్‌లో ఏం చూపించామో దాన్ని నమ్మి సినిమాకు రండి. ఏవేవో అంచనాలు మాత్రం పెట్టుకోవద్దు. టైసన్‌కు మాత్రం కొత్త లుక్‌మాత్రం ఇచ్చాం. క్లైమాక్స్‌లో వచ్చే సిట్యువేషన్‌ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రాలేదు. ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’ క్లైమాక్స్‌ బాగా నచ్చింది. హీరో-విలన్‌ కూర్చొని మాట్లాడుకోవడం కొత్తగా ఉంది. ఇందులోనూ హీరోకు, మైక్‌ టైసన్‌కు వచ్చే సిట్యువేషన్‌ కొత్తగా ఉంటుంది. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది.

విజయ్‌ దేవరకొండ: ప్రేక్షకులకు ప్రతి సినిమాపై కొన్ని అంచనాలు ఉంటాయి. థియేటర్‌లో ఆ అనుభూతిని మనం చెడగొట్టలేం. అందుకే సినిమాను అక్కడ చూడాలి. కథ చెప్పటం ట్రైలర్‌ పని కాదు. సినిమా చూడాలన్న ఆసక్తి మీలో రేకెత్తిస్తే, ట్రైలర్‌ పని పూర్తయినట్లే. ట్రైలర్‌లన్నీ ఒక ఫార్మాట్‌లో నడుస్తున్నాయి. దాన్ని ‘లైగర్‌’ బ్రేక్‌ చేసింది.

మీ హీరోలకు ఒక ప్రత్యేక యాటిట్యూడ్‌ పెడతారు. ‘లైగర్‌’ హీరో కూడా షార్ట్‌తో ప్రత్యేకంగా ఉన్నాడు.. అది ఎలా సాధ్యమైంది?

పూరి జగన్నాథ్‌: కథ చెప్పిన తర్వాత తనే క్యారెక్టర్‌ కోసం వర్కవుట్‌ చేశాడు. జుట్టు పెంచాడు. హీరోలెవరూ లోయర్‌ చూపించరు. కానీ, అలా చూపించటానికి విజయ్‌కు గట్స్‌ ఉన్నాయి. ఆ క్రెడిట్‌ అంతా తనదే. నా ఫ్రెండ్‌ ఇదే వీడియో చూసి, ‘ఏంటన్నా.. విజయ్‌ ఆ గట్స్‌..  లోయర్‌ చూపించాడు’ అన్నాడు. ‘మావాడు సినిమా కోసం చడ్డీ తీసేయమన్నా తీసేస్తాడు’ అన్నాను.

విజయ్‌ ఏదైనా చేస్తాడని మీకు అనిపిస్తోందా?

పూరి జగన్నాథ్‌: కచ్చితంగా ఏదైనా చేస్తాడు. ఈ ఏజ్‌లో ఇలాంటివి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తా?అని విజయ్‌ నాతో అన్నాడు.

విజయ్‌ దేవరకొండ: నేను నటుడిని అవుదామనుకున్నప్పుడే ఏదైనా చేయడానికి సిద్ధపడ్డా. ఒకసారి కమిట్‌ అయితే, చేసేయడమే. పూరిగారు కథ చెప్పినప్పుడు పొడవాటి జుట్టు, కండలతో ‘లైగర్‌’ హీరో నా ముందు కదలాడాడు. ఎంఎంఏ నేను బాగానే ఫాలో అవుతా. సినిమా చర్చల సమయంలో ‘హీరోకు కొంచెం బాడీ ఉంటే సరిపోతుంది’ అని చెప్పారు. ‘లేదు నాకు సమయం ఇవ్వండి. హీరో ఉంటే బీస్ట్‌లా ఉండాలి’ అన్నాను. అయినా ఈ కథకు డీసెంట్‌ బాడీతో చేస్తే మజా రాదు.

అనన్య గురించి చెప్పండి..

పూరి జగన్నాథ్‌: అనన్యలో చాలా మార్పులు చూశా. ప్రతి మూడు నెలలకూ మారిపోతోంది.

‘లైగర్‌2’ కూడా ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది!

విజయ్‌ దేవరకొండ: దాని గురించి మాట్లాడుకున్నాం. పాత్రలు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి.

పూరి జగన్నాథ్‌: ‘లైగర్‌2’ చేయమని తొలిసారి అడిగిన వ్యక్తి కరణ్‌జోహార్.

జనాలు థియేటర్‌కు రావటం లేదని ఫిర్యాదు ఉంది. సినిమాపై మీకున్న నమ్మకం చూస్తే, చాలా ఎక్కువగా ఉంది. ఓటీటీ ఆఫర్‌ వచ్చినప్పుడు రూ.200 కోట్లు చాలా తక్కువని మీరు ట్వీట్ పెట్టారు! బాక్సాఫీస్‌ నుంచి ఎంత వస్తుందని ఆశిస్తున్నారు?

విజయ్‌ దేవరకొండ: నేనైతే రూ.200 కోట్ల నుంచి మొదలు పెడుతున్నా. అక్కడి నుంచి వచ్చే నంబర్‌ నేనసలు చూడను. సినిమాలు దొరకడం కష్టంగా ఉన్నప్పుడు ‘నీ ధర్మం నువ్వు చెయ్‌.. ప్రకృతి చూసుకుంటుంది’ అని ఒకరు నాతో చెప్పారు. దాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. నేను దేన్నీ వదలను. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. కంటెంట్‌ చాలా బలంగా ఉంది. నా శక్తికి మించి ఈ సినిమా కోసం చేశా. బడ్జెట్‌ విషయంలోనూ ఎవరూ కాంప్రమైజ్‌ కాలేదు. అది చూసి, నేను చాలా ఉత్సాహంగా నటించా.

‘లైగర్‌’పై భారీ అంచనాలున్నాయి. పొరపాటున జనాలు రాకపోతే, సినిమా బాగోలేదని టాక్‌ వస్తే?

విజయ్‌ దేవరకొండ: లాక్‌డౌన్‌ సమయంలో పోస్టర్‌ షూట్‌ చేస్తున్నాం. ఆ సమయంలో కొవిడ్‌ ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియదు. ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో నేను ఒకటే కోరుకున్నా. ‘నా లైగర్‌ రిలీజ్‌ సమయానికి కొవిడ్‌ లేకుండా, జనాలు ఆస్పత్రి పాలవకుండా, థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ ఇస్తే, థియేటర్లను మేం నింపుతాం దేవుడా..!’ అని అనుకున్నా. ఇప్పుడు అదే జరగబోతోంది.

భావోద్వేగానికి గురైన ఛార్మి..!

‘‘2019 ఆగస్టు నెలలోనే నేనూ పూరిగారు మిమ్మల్ని కలిసి కథ చెప్పాం. ఆ తర్వాత కొవిడ్‌ వచ్చింది. వరుస లాక్‌డౌన్‌లు వచ్చాయి. ఈ కష్టసమయంలోనూ ఆర్థికంగా చాలా ఛాలెంజెస్‌ వచ్చాయి. ఓటీటీకి అమ్మడానికి భారీ ఆఫర్‌ వచ్చింది. జేబులో ఒక్క రూపాయి లేదు. అంత భారీ ఆఫర్‌ రిజెక్ట్‌ చేయడానికి దమ్ము కావాలి. ఆ దమ్మున్న వ్యక్తి పూరిగారు. ఇది థియేటర్‌ ఫిల్మ్‌. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాం. దృఢ సంకల్పం ఉన్న పూరిలాంటి వ్యక్తి కూడా ఈ జర్నీలో కొన్నిసార్లు నిరాశకు గురయ్యారు. కానీ, రెండే రెండు విషయాలు ఇక్కడ వరకూ తీసుకొచ్చాయి. ఒకటి విజయ్‌ దేవరకొండ. ప్రతి పరిస్థితుల్లో విజయ్‌ ఎంత బలంగా నిలబడ్డాడో జనాలకు తెలియదు. నువ్వే (విజయ్‌) మమ్మల్ని ముందుకు నడిపిన వ్యక్తివి. రెండోది కంటెంట్‌. ఈ సినిమా కథ. థ్యాంక్యూ విజయ్‌’’ అంటూ ఛార్మి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని