Manjummel Boys: లూసిఫర్‌ రికార్డును బద్దలుకొట్టిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ చిత్ర పరిశ్రమలో మరో రికార్డు నమోదైంది. ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మరో మూవీ వచ్చి చేరింది.

Published : 10 Mar 2024 00:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ చిత్ర పరిశ్రమలో మరో రికార్డు నమోదైంది. ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మరో మూవీ వచ్చి చేరింది. చిదంబరం దర్శకత్వంలో శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపత్‌, లాల్‌ జూనియర్‌, దీపక్‌ కీలక పాత్రల్లో నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ (Manjummel Boys). ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.100కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తాజాగా మోహన్‌లాల్‌ ‘లూసిఫర్‌’ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 16 రోజుల్లో రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2018లో వచ్చిన ‘లూసిఫర్’ ఆల్‌టైమ్‌ కలెక్షన్లు రూ.127 కోట్లు కాగా, ‘మంజుమ్మెల్‌ బాయ్‌’ ఆ రికార్డు అధిగమించింది. ఈ హవా కొనసాగితే మోహన్‌లాల్‌ మరో మూవీ ‘పులి మురుగన్‌’ (రూ.152 కోట్లు) వసూళ్లను కూడా దాటడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ‘2018’ ఉంది. అది కూడా సర్వైవల్‌ డ్రామా కావడం గమనార్హం.

కథేంటంటే: కొచ్చిలోని ఓ స్నేహితుల బృందం కొడైకెనాల్‌ ట్రిప్‌నకు వెళ్తుంది. అక్కడి విశేషాలను తెలుసుకునే క్రమంలో ‘గుణ గుహ’ గురించి తెలుస్తుంది. కమల్‌హాసన్‌ ‘గుణ’ మూవీ అక్కడే తీశారని తెలియడంతో స్నేహితులందరూ అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ ఓ గుహలోకి వెళ్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇంకా లోపలికి వెళ్తారు. ఓ పాయింట్‌ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడి రాళ్లపై ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ అని రాస్తారు. ఈ క్రమంలో సుభాష్‌ అనే ఓ స్నేహితుడు గుహలో ఉన్న ఓ  రంధ్రంలో పడిపోతాడు. సుభాష్‌ ఏదో సరదాకు అలా చేశాడని అందరూ తొలుత అనుకుంటారు. కానీ, ఎన్నిసార్లు పిలిచిన మాట రాకపోయే సరికి భయపడి బయటకు వచ్చేస్తారు. మరి ఆ గుహలో పడిపోయిన సుభాష్‌ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి? అన్నది కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు