Mem Famous: మహేశ్‌బాబు ట్వీట్‌నీ తప్పుబడుతుంటే బాధగా ఉంది: మేమ్‌ ఫేమస్‌ టీమ్‌

‘మేమ్‌ ఫేమస్‌’ (Mem Famous) టీమ్‌ తాజాగా ఓ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. తమ చిత్రానికి వస్తోన్న నెగెటివిటీపై స్పందించింది.

Published : 29 May 2023 19:28 IST

హైదరాబాద్‌: సుమంత్‌ ప్రభాస్‌ (Sumanth Prabhas) స్వీయ దర్శకత్వంలో ఛాయ్‌ బిస్కెట్‌ టీమ్‌ నిర్మించిన సరికొత్త చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’ (Mem Famous). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే తమ చిత్రానికి వస్తోన్న నెగెటివిటీపై చిత్రబృందం తాజాగా స్పందించింది. ‘మేమ్‌ ఫేమస్‌ పంచాయితీ’ పేరుతో హైదరాబాద్‌లో ఓ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి తమ చిత్రానికి వస్తోన్న నెగెటివిటీపై మాట్లాడింది.

‘‘యువతను దృష్టిలో ఉంచుకునే కొత్తవాళ్లతో మేము ఈ సినిమా చేశాం. యువతలో స్ఫూర్తి నింపే కంటెంట్‌ మా సినిమాలో ఉంది. ‘స్టూడెంట్‌ డిస్కౌంట్‌’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. రిలీజ్‌కు ముందే మేము దీన్ని ప్లాన్‌ చేశాం. ఇప్పుడేమైనా చేయాలంటే.. ‘సినిమా ఆడటం లేదు కాబట్టే ఇలాంటివి చేస్తున్నారు’ అంటూ కొంతమంది నెగెటివిటీని వ్యాప్తి చేస్తారేమో అనిపిస్తుంది. మేము ఎంతోకాలం నుంచి ఇలాంటి విమర్శలను చూస్తున్నాం. మేము వాటిని పెద్దగా పట్టించుకోం. కాకపోతే ఈ సినిమాలో పనిచేసిన టీమ్‌ ఇబ్బందిపడుతున్నారు. మేము ఎంతో కష్టపడి దీన్ని తెరకెక్కించాం. ఒకవేళ సినిమా నిజంగానే బాగోలేకపోతే మేము ఇక్కడిదాకా రాం. ఇంట్లోనే కూర్చొని తప్పుచేశామని బాధపడేవాళ్లం. అయితే, కొంతమంది సినిమా చూడకుండానే సోషల్‌మీడియాలో నెగెటివ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. అసభ్యపదజాలం ఉపయోగించి ట్వీట్స్ చేస్తున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే విమర్శలను మేము తీసుకుంటాం. సినిమా చూసిన తర్వాత నిజాయతీగా విమర్శలు చేయండి. తప్పుల నుంచి మేము కూడా నేర్చుకుంటాం. అలాగే, మా సినిమా చూసి నచ్చిందంటూ మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. కొంతమంది వ్యక్తులు దాన్నీ తప్పుబట్టి.. ‘‘సినిమా చూసే ట్వీట్‌ చేశారా?’’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ట్వీట్‌ చేస్తే దాన్నీ తప్పుబడుతున్నందుకు బాధగా ఉంది’’ అని చిత్ర నిర్మాత శరత్‌చంద్ర వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని