Rangabali: సత్య స్పూఫ్‌ ఇంటర్వ్యూ వల్ల బాధపడి ఉంటే క్షమించండి: నాగశౌర్య

Rangabali: నాగశౌర్య, యుక్తి తరేజా కీలక పాత్రల్లో పవన్‌ తెరకెక్కించిన ‘రంగబలి’ సక్సెస్‌మీట్‌ శనివారం జరిగింది.

Updated : 08 Jul 2023 16:10 IST

హైదరాబాద్‌: తాజాగా విడుదలైన తమ చిత్రం ‘రంగబలి’ని (Rangabali) ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు సినిమా చూసి ‘బాగుంది’ అని మెచ్చుకుంటున్నారని కథానాయకుడు నాగశౌర్య అన్నారు. శనివారం ‘రంగబలి’ సక్సెస్‌మీట్‌ జరిగింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నాగశౌర్య, దర్శకుడు పవన్‌ బాసంశెట్టి, కథానాయిక యుక్తితరేజా తదితరులు విలేకరులతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

‘మీడియాపై సెటైర్‌ వేయాలని ఎందుకు అనిపించింది?’ అని అడగ్గా, నాగశౌర్య (Naga Shaurya) సమాధానం ఇస్తూ, ‘‘మీడియా మేమూ ఒకటే ఫ్యామిలీ. అదే మీడియా వాళ్లు, చంద్రబాబునాయుడు, కేసీఆర్‌ డూప్‌లను పెట్టి వీడియోలు చేస్తారు. మా సినిమా ప్రమోషన్స్‌ కోసం అందరికీ తెలిసిన వ్యక్తులను ఎంపిక చేసుకున్నాం. ఒక హీరోను వాళ్లు తమదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందా? అని సరదాగా చేశాం. ఇందులో ఎవరినీ ఎగతాళి చేయలేదు. అలాగే ముందుగా అనుకుని మాత్రం చేయలేదు. మా వీడియో వల్ల ఎవరైనా బాధపడితే ‘క్షమించండి’. ఫలానా వారి మనోభావాలు దెబ్బతీయాలని మాత్రం ఆ వీడియో చేయలేదు. ‘ఒకరిద్దరు బాధపడ్డారు’ అని వేరే వాళ్లు ప్రచారం చేయడం వల్ల ఆ న్యూస్‌ ట్రెండ్‌ అయింది’’ అని నాగశౌర్య సమాధానం ఇచ్చారు. అలాగే ద్వితీయార్ధం సీరియస్‌గా ఉందన్న కామెంట్స్‌పై మాట్లాడుతూ.. ‘‘ఫస్టాఫ్‌లో కామెడీ డోస్‌ ఎక్కువ అయిపోయింది. కంటెంట్‌తో వెళ్తేనేమో మరీ సాగదీశారని అంటారు. కేవలం నవ్వుల కోసమే అయితే, మా దగ్గర చాలా సీన్స్‌ ఉన్నాయి. జనాలను చెడగొట్టకుండా ఏదో ఒక మంచి కథతో రావాలన్నది మా ఉద్దేశం. ఇప్పటివరకూ చాలా మంది హీరోలు ఇలాగే వచ్చారు. కేవలం అడాల్ట్‌ కంటెంట్‌, వెకిలి కామెడీ కావాలంటే మా దగ్గర చాలా స్క్రిప్ట్‌లు ఉన్నాయి’’ అని నాగశౌర్య చెప్పుకొచ్చారు.

‘సినిమా కథ కన్నా కూడా ప్రచారం కోసం స్పూఫ్‌లపై దృష్టి ఎక్కువగా పెట్టారు. అలా కాకుండా సెకండాఫ్‌పై ఇంకా దృష్టి పెట్టి ఉంటే, మంచి విజయం సాధించేది కదా’ అని అడగ్గా, దర్శకుడు పవన్‌ సమాధానం ఇస్తూ ‘‘గోదావరి జిల్లాల వాళ్లకు వెటకారం పుట్టుకతో వచ్చింది. స్క్రిప్ట్‌ పరంగా ఎలాంటి సమస్యా లేదు. దానిపై నేను వందశాతం నమ్మకంతో ఉన్నా. ఫస్టాఫ్‌లో ఫన్‌ ఎక్కువగా ఉందంటే దానికి హీరో నాగశౌర్య, సత్యల పాత్రలు కారణం. ద్వితీయార్ధంలోనూ ఆ పాత్రలు ఉన్నాయి. అయితే, కథ అనేది ఒకటి చెప్పాలి. ఒక దర్శకుడిగా దానికి కట్టుబడి ఉన్నా. ఫస్టాఫ్‌ చూసి, సెకండాఫ్‌ కూడా అలాగే ఉంటుందని అందరూ అనుకున్నారు. బిర్యానీ తినేవాడిని పప్పన్నం తినమంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. నెమ్మదిగా అందరికీ నచ్చుతుంది. ఇక స్ఫూఫ్‌ ఇంటర్వ్యూల విషయానికొస్తే, చిన్నప్పటి నుంచి మనం చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల సినిమాలు చూసి, వాళ్లు చేసినట్లే చేసి, హీరోల్లా ఫీలవుతాం. ఇంటర్వ్యూ కూడా అలాంటిదే. రెండో భాగంలో కూడా సత్య క్యారెక్టర్‌తో కామెడీ చేయించవచ్చు. అప్పుడు నేను రాసుకున్న కథకు న్యాయం చేయలేను. పైగా అంత పెద్ద టైటిల్‌ పెట్టుకుని ఇంత ఫన్నీగా సినిమా ఎలా తీశాడంటారు’’ అని సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని