Lal Salaam: ‘బాబా’ తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నా: రజనీకాంత్‌

అగ్ర హీరో రజనీకాంత్‌ (Rajinikanth).. మొయిద్దీన్‌ భాయ్‌గా నటించిన చిత్రం ‘లాల్‌ సలాం’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 06 Feb 2024 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొయిద్దీన్‌ భాయ్‌గా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు ప్రముఖ హీరో రజనీకాంత్‌ (Rajinikanth). ఆయన కీలక పాత్ర పోషించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వం వహించిన ఆ చిత్రాన్ని నిర్మించకపోవడానికి గల కారణాన్ని తెలిపారు. 

‘‘ఐశ్వర్య ప్రతిభ గురించి నాకు తెలుసు కాబట్టి ఇలాంటి కథను ఎంపిక చేసుకున్నందుకు ఆశ్చర్యపోలేదు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ వద్దకు వెళ్లకముందు ఐశ్వర్య కొంత మంది నిర్మాతలను సంప్రదించింది. సినిమాని నిర్మించేందుకు తిరస్కరించారు. ‘రజనీకాంతే ఎందుకు ఈ సినిమాని ప్రొడ్యూస్‌ చేయకూడదు?’ అని అనుకుని ఉంటారు. ఇకపై నిర్మాతగా వ్యవహరించకూడదని ‘బాబా’ చిత్రం తర్వాత నిర్ణయించుకున్నా. నా కూతురు విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అందుకే కొంత మంది నిర్మాతల పేర్లు ఆమెకు సూచించి, వెళ్లమని చెప్పా. వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ కథను వినేందుకు గంట సమయం కావాలని ఐశ్వర్య నన్ను అడగడంతో కాదనలేకపోయా. ఈ సినిమా జాతీయ అవార్డులను అందుకుంటుందంటూ కథ చెప్పడం మొదలు పెట్టింది. వెంటనే నేను వినకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే అవార్డుల కోసమే సినిమాలు చేయకూడదు. అలాగని నేను వాటికి వ్యతిరేకిని కాదు. ఆర్థికంగా కూడా మంచి ప్రతిఫలం పొందాలనుకుంటా’’ అని నవ్వుతూ చెప్పారు.

ఐశ్వర్య కొంత విరామం తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిది. విష్ణు విశాల్‌ (Vishnu Vishal), విక్రాంత్‌ (Vikranth) ప్రధాన పాత్రల్లో నటించారు. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్‌ మూవీలో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అతిథిగా నటించారు. మరోవైపు, రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’ (Vettaiyan)లో నటిస్తున్నారు. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జె. జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్నారు. అది పూర్తయ్యాక లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నటిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు