Siddharth: రియల్‌ లైఫ్‌లో లవ్‌ ఫెయిల్యూర్‌.. సిద్దార్థ్‌ ఏం చెప్పారంటే

తన తదుపరి చిత్రం ‘టక్కర్‌’ (TAKKAR) ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు నటుడు సిద్దార్థ్‌ (Siddharth). తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో లవ్‌ ఫెయిల్యూర్‌పై స్పందించారు.

Updated : 29 May 2023 16:02 IST

హైదరాబాద్‌: కెరీర్‌ ఆరంభంలోనే లవర్‌బాయ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నటుడు సిద్దార్థ్‌ (Siddharth). వెండితెరపై ఎన్నో సక్సెస్‌ఫుల్‌ లవ్‌స్టోరీల్లో నటించిన ఆయన రియల్‌ లైఫ్‌లో తన ప్రేమకథ విజయం సాధించకపోవడంపై స్పందించారు. ‘టక్కర్‌’ (TAKKAR) సినిమా ప్రెస్‌మీట్‌లో దీని గురించి మాట్లాడారు. ‘‘రీల్‌ లైఫ్‌లో విజయవంతమైన ప్రేమకథల్లో నటించిన మీరు ప్రేమలో సక్సెస్‌ కాలేకపోయారు? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా?’’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దానిపై స్పందిస్తూ.. ‘‘ఇలాంటి విషయం గురించి ఇప్పటివరకూ నేను ఆలోచించలేదు. కానీ, నా రియల్‌లైఫ్‌ లవ్‌ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి, మనిద్దరం పర్సనల్‌గా కూర్చొన్నప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే, ఈ ప్రెస్‌మీట్‌కు దానికి అసలు సంబంధం లేదు’’ అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశారు.

అనంతరం ‘టక్కర్‌’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘నా నుంచి ఫుల్‌ కమర్షియల్‌ సినిమా ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. వాళ్లకు సమాధానమే ఈ సినిమా. కార్తిక్‌ ఈ కథ చెప్పిన వెంటనే నాకెంతో నచ్చేసింది. ముఖ్యంగా లవ్‌స్టోరీ, అందులోనూ హీరోయిన్‌ పాత్ర విభిన్నంగా అనిపించాయి. ఇది తప్పకుండా కమర్షియల్‌ హిట్‌ అవుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా తర్వాత ప్రతి మూడు నెలలకు నా సినిమా రిలీజ్‌ కానుంది. నా కెరీర్‌లో ఇదొక కీలక సమయం. ‘టక్కర్‌’లో నా పాత్ర ఎంతో కొత్తగా ఉంటుంది. దీని కోసం ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ తీసుకున్నా. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నా. 35 రోజులపాటు ఫైట్‌ సీన్స్‌ షూట్‌ చేశాం. ‘మహాసముద్రం’ బాగా ఆడి ఉంటే నాలుగు నెలల్లోనే మరో కొత్త సినిమాతో వచ్చేవాడిని. మేము ఎంతో ఇష్టపడి చేశాం. కాకపోతే అది సరిగ్గా వర్కౌట్‌ కాలేదు. కెరీర్‌లో ఏ సినిమా విషయంలోనూ నేను బాధపడటం లేదు. ఎందుకంటే ప్రతి చిత్రాన్ని ముందు కథ విని.. నచ్చితేనే చేశాను’’ అని ఆయన వివరించారు.

‘మహా సముద్రం’ తర్వాత సిద్దార్థ్‌ నటించిన చిత్రం ‘టక్కర్‌’. శంకర్‌ అసిస్టెంట్‌ కార్తిక్‌ దీన్ని తెరకెక్కించారు. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. జూన్‌ 9న ఇది విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని