
Year Ender 2021:హీరోలు కలిస్తే ‘బొమ్మ’ హిట్టే.. ఈ ఏడాది మది దోచిన చిత్రాలు!
ఇంటర్నెట్డెస్క్: కరోనా కారణంగా గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చిత్రపరిశ్రమలో పూర్వ వైభవం ఒకింత కనబడింది. ఒకటికి మించి ప్రాజెక్ట్లు చేస్తూ ప్రముఖ నటీనటులందరూ ఓ వైపు వ్యక్తిగత జీవితంలో బిజీ కావడంతోపాటు సమయం దొరికినప్పుడు విహారయాత్రలకు వెళ్లి ఫ్యామిలీ టైమ్నీ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టా వేదికగా తమ అభిమానులతో పంచుకున్నారు. ఇలా, 2021లో నటీనటులు షేర్ చేసిన వాటిల్లో నెటిజన్ల మదిదోచిన పలు ఫొటోలపై ఓ లుక్కేద్దాం..!
మెగాఫ్యామిలీ@వన్ పిక్చర్..!
మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టినరోజు వేడుకలు ఈ ఏడాది కుటుంబసభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగాయి. అదేరోజు రాఖీ పౌర్ణమి కావడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న పవర్స్టార్ పవన్కల్యాణ్ ఈ వేడుకల్లో ప్రత్యేకార్షణగా నిలిచారు. ఆయన రాకతో కుటుంబసభ్యులే కాకుండా మెగా అభిమానులూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫొటోలో మెగా హీరోలు చిరంజీవి, నాగబాబు, పవన్కల్యాణ్, రామ్చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఒకే ఫ్రేమ్లో ఉండటంతో అది కాస్త నెట్టింట్లో వైరల్గా మారింది.
చిన్నతమ్ముడ్ని ముద్దాడుతూ..!
పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం కోసం చాలారోజుల తర్వాత తన ఇంటికి విచ్చేసిన చిన్న తమ్ముడు పవన్ని చూసి చిరు దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. పవన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకుని చిరంజీవి ముద్దుపెట్టుకున్నారు. ఈ ఫొటో, దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ ఎప్పటికీ ఓ ఎవర్గ్రీన్ మూమెంటే..!
చిరంజీవి, మోహన్బాబు ఓ టూర్..!
చిరంజీవి, మోహన్బాబు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఇండస్ట్రీవారికి పండగే. గతేడాది ‘మా’ డైరీ ఫంక్షన్లో ఆత్మీయ ఆలింగనంతో అదరగొట్టిన ఈ స్టార్హీరోల జోడీ ఈ ఏడాది సరదాగా సిక్కిం టూర్కు వెళ్లారు. చిరంజీవి ఒప్పించి మరీ తన తండ్రిని టూర్కు తీసుకువెళ్లడం ఆనందాన్ని ఇచ్చిందని మంచు లక్ష్మి ఫొటోలు పంచుకున్నారు.
మోహన్బాబు @ మాల్దీవులు..!
కరోనా కారణంగా గతేడాది ఎక్కువ శాతం ఇంటికే పరిమితమైన మంచు లక్ష్మి ఈ ఏడాది ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల టూర్ వెళ్లారు. మోహన్బాబు ఆయన సతీమణి ఈ వెకేషన్లో భాగమయ్యారు. చల్లని సాయంత్రం వేళ సముద్రతీరంలో తన సతీమణితో సరదాగా మాట్లాడుతూ మోహన్బాబు సేద తీరారు. ఈ ఫొటోలను లక్ష్మి ఇన్స్టా వేదికగా షేర్ చేశారు.
మంచు విష్ణు X ప్రకాశ్రాజ్ = వన్ పిక్చర్..!
ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగాయి. ప్రత్యర్థులుగా పోటీలోకి దిగిన ప్రకాశ్రాజ్, మంచు విష్ణుల మధ్య కొన్ని వారాలపాటు మాటల యుద్ధాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలు జరిగిన రోజు ప్రకాశ్రాజ్, విష్ణు నవ్వులు చిందిస్తూ కలిసి దిగిన ఓ సెల్ఫీ అప్పటివరకూ వాళ్ల మధ్య ఉన్న అంతరాలకు పుల్స్టాఫ్ పెట్టినట్లే అయ్యింది.
తారకరాముడు విత్ అభయ్రామ్ అండ్ భార్గవ్ రామ్..!
తారకరాముడు (ఎన్టీఆర్) సోషల్మీడియాకు దూరంగా ఉంటారనే విషయం అందరికీ తెలుసు. చాలా అరుదుగా తన ఫ్యామిలీ ఫొటోలను ఆయన అభిమానులతో పంచుకుంటారు. ఈ ఏడాది దీపావళికి ఆయన షేర్ చేసిన ఓ పిక్ జెట్ స్పీడ్లో వైరల్గా మారింది. తన ఇద్దరు కుమారులతో ఆయన షేర్ చేసిన ఈ ఫొటో చూసి తారక రాముడు విత్ అభయ్ రామ్ అండ్ భార్గవ్ రామ్ అని నెటిజన్లు క్యాప్షన్లు పెట్టుకున్నారు.
‘అఖండ’తో అల్లుఅర్జున్..!
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ ప్రీరిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ చేసిన సందడి మామూలుగా లేదు. బాలయ్యతో కలిసి తగ్గేదేలే అంటూ ఆయన డైలాగ్లు చెప్పి అలరించారు. బాలయ్య-బన్నీ ఒకే స్టేజ్పై నవ్వులు పూయించడం ఈ ఏడాది మేటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
నిర్మల పుత్రోత్సాహం..!
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ డిసెంబర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ‘పుష్ప’ విడుదలైన రోజు కుటుంబసభ్యులు, అభిమానులతో కలిసి ఆయన సంధ్యా థియేటర్లో చిత్రాన్ని వీక్షించారు. సినిమాలో బన్నీ పెర్ఫార్మెన్స్ చూసి ఆయన తల్లి నిర్మల ఎంతో ఆనందించారు. తన తనయుడి నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుని ప్రశంసించారు.
మహేశ్.. ఎన్టీఆర్.. క్లిక్ క్లిక్..!
సూపర్స్టార్ మహేశ్బాబు, యంగ్టైగర్ ఎన్టీఆర్ కలిసి ఒకే స్టేజ్పై సందడి చేశారు. ఒకరు హాట్ సీట్లో మరొకరు హోస్ట్ సీట్లో కూర్చొని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. వీటితోపాటు మహేశ్బాబు న్యూలుక్ ఫొటోలూ ఈ ఏడాది నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మహేశ్ రోజురోజుకీ యంగ్గా మారిపోతున్నారని అందరూ చెప్పుకున్నారు.
భీమ్లానాయక్.. డేనియల్ శేఖర్ = గోపాల గోపాల
పవన్కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమ్లానాయక్’. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూట్ మధ్య కాస్త విరామం రావడంతో పవన్కల్యాణ్, రానా సేద తీరుతూ కనిపించారు. మంచంపై నిద్రిస్తూ పవన్.. ఆ పక్కనే ఉన్న ఎండ్లబండిపై రానా విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. ఈ ఫొటోని ఆనాటి ‘గోపాల గోపాల’ పిక్తో ఎటాచ్ చేసి అభిమానులు షేర్ చేశారు. పవర్స్టార్తో ఆనాడు బాబాయ్.. ఈనాడు అబ్బాయ్.. ఫొటో అదుర్స్ అని కామెంట్లు పెట్టారు.
‘ఆర్ఆర్ఆర్’.. పిక్ అదుర్స్ అప్పా..!
రామ్చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సుమారు నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ‘ఆర్ఆర్ఆర్’ ప్రయాణం ముగింపు దశకు చేరుకుంటోంది. జనవరిలో సినిమా విడుదల చేయనున్న తరుణంలో ప్రస్తుతం ఈ ముగ్గురూ ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ ప్రయాణాన్ని తమ మధ్య ఉన్న స్నేహాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురైన రాజమౌళిని చరణ్, తారక్ హత్తుకున్నారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.