Shyam Singha Roy: రెండేళ్లు మిస్‌ అయ్యారు.. ఈసారి క్రిస్మస్‌ మనదే: నాని

ఒక మంచి సినిమా చేసిన తర్వాత తెలియని గర్వంతో మనసు నిండుగా ఉంటుందని అదే భావనను ‘శ్యామ్‌ సింగరాయ్‌’(Shyam Singha Roy) ఇచ్చిందని నటుడు

Updated : 14 Dec 2021 23:24 IST

వరంగల్‌‌: ఒక మంచి సినిమా చేసిన తర్వాత తెలియని గర్వంతో మనసు నిండుగా ఉంటుందని, అదే భావనను ‘శ్యామ్‌ సింగ రాయ్‌’(Shyam Singha Roy) ఇచ్చిందని నటుడు నాని(Nani) అన్నారు. ఆయన కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సాయి పల్లవి(Sai Pallavi), కృతిశెట్టి (Krithi Shetty), మడోనా సెబాస్టియన్‌(Madonna Sebastian) కథానాయికలు. మిక్కీ జే మేయర్‌ సంగీతమందించారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో ‘రాయల్‌ ఈవెంట్‌ ఆఫ్‌ శ్యామ్‌ సింగరాయ్‌’ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘‘వరంగల్‌ అంటే నాకు చాలా ఇష్టం. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తామంటే మంత్రి దయాకర్‌గారు అంతా చూసుకున్నారు. ఇప్పుడు హీరోలందరూ సుమగారి డేట్స్‌ కోసం వేచి చూస్తున్నారు. వరంగల్‌లో ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్‌ ఉంది. ఎంసీఏ హిట్‌ అయింది కదాని ఇక్కడకు రాలేదు. మళ్లీ అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. ‘శ్యామ్ సింగ రాయ్’ను చూసిన తర్వాత మీరు ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నా. రాహుల్ చేసిన మొదటి సినిమాను నేను చూడలేదు. ఆ సినిమా చూసి నేను డిసైడ్ చేయకూడదనుకున్నా. కానీ,  ఈ రోజు  నా సినిమాను చూశాను. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా అతనికి ఉంది. నిర్మాత వెంకట్ గారు మమ్మల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉంది. కెమెరామెన్ సాను, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ ఇలా అందరికీ మళ్లీ అవార్డులు వస్తాయని నమ్మకం ఉంది. అందరూ కష్టపడ్డారు కాబట్టే ఇంత మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం’’

‘‘సాయి పల్లవి డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంటుంది. రెండు మూడు రోజుల్లో ఆ పాటను విడుదల చేస్తాం. అందులో నేను నటించాల్సిన అవసరం రాలేదు. సాయి పల్లవిని చూసి అలా ఆశ్చర్యపోయా. కృతి శెట్టి చేసింది ఒక్క సినిమానే అయినా, తన పాత్ర కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంది.  ‘అరేయ్ నాన్న నేను నీ ఒక్కడికే ఫ్యాన్’ అని సిరివెన్నెల అనేవారు. ఆయనకు ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూపించాం. పాటలు రాయమని అన్నాం. ‘చూడటానికి రెండు కళ్లు చాలడం లేదురా.. నాకు సినిమా చూడాలని ఉందిరా’ అని అనేవారు. ఆయనకు ఈ సినిమాను అప్పుడే చూపించాల్సింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీర్వాదం మాతోనే ఉంటుంది. ఆయన చివరి పాట శ్యామ్ సింగ రాయ్ కోసం రాయడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది. రెండేళ్ల తరువాత థియేటర్లోకి వస్తున్నా.. మీరు మిస్ అయ్యారని తెలుసు. నేను కూడా మిస్ అయ్యాను. కానీ ఈ సారి మాత్రం మిస్ అయ్యే ఛాన్సే లేదు’ అని అన్నారు.

కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అందరి నటనా, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్కటి అద్భుతంగా ఉంటాయి. మీరు కొత్త అనుభూతికి లోనవుతారు. నాని గారంటే నాకు, నా ఫ్యామిలీకి చాలా ఇష్టం. నా రెండో సినిమానే ఆయనతో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘శ్యామ్ సింగ రాయ్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ రెండు ప్రపంచాలను చూపించారు. వాసు, శ్యామ్ సింగ రాయ్ రెండు ప్రపంచాలని అద్భుతంగా చూపించారు. కెమెరామెన్, క్యాస్టూమ్ డిజైనర్ పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు థియేటర్లో చూడాల్సిందే. అన్ని సినిమాలను థియేటర్లోనే చూడండి’ అని చెప్పుకొచ్చింది.

‘ఇక్కడ ఏది పెట్టినా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఏ సినిమా తీసినా హిట్ అవుతుంది. సినీ పరిశ్రమకు నా వంతు సాయం చేస్తా’ అని మంత్రి దయాకర్‌రావు అన్నారు. నిర్మాత దిల్‌ రాజ్ మాట్లాడుతూ.. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఎక్కడున్నా మనల్ని చూస్తుంటారు. మీ పాటలను మేం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. నిర్మాత వెంకట్ గారు ఒక హిట్ సినిమా తీయాలని అనేవారు. ఆయనకు నాని దొరికారు. నాని, సాయిపల్లవి, కృతిశెట్టిల నటన చూస్తుంటే ఈ సినిమాతో మళ్లీ హిట్‌ కొట్టడం ఖాయం. దయాకరన్న వల్లే ఈ ఈవెంట్‌ను ఇక్కడ ప్లాన్ చేశాం. మాస్కులు ధరించి థియేటర్లకు వెళ్లండి’ అని అన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని