Vishwak Sen: తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారు.. : విశ్వక్‌సేన్‌ వైరల్‌ పోస్ట్‌

విశ్వక్‌సేన్‌ (Vishwak sen) తాజాగా చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చకు దారి తీశాయి.

Published : 29 Oct 2023 10:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన తదుపరి చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) రిలీజ్‌ను ఉద్దేశించి నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) ఓ పోస్ట్‌ పెట్టారు. సినీ పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ఇబ్బందిపెట్టాలనే చూస్తుంటారని అన్నారు. తొలుత అనుకున్న తేదీకే తమ సినిమా విడుదల అవుతుందని.. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.

‘‘బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్‌ మారుద్దాం అనుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రతి ఫ్రేమ్‌లో ప్రాణం పెట్టి పనిచేసి చెప్తున్నా. డిసెంబర్‌ 8న వస్తున్నాం. హిట్‌, ఫ్లాప్‌, సూపర్‌హిట్‌, అట్టర్‌ ఫ్లాప్‌ అనేది మీ నిర్ణయం. ఆవేశంతోనో లేదా అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదిది. తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని అర్థమైంది. డిసెంబర్‌ 8 సివాలెత్తిపోద్ది. గంగమ్మతల్లిపై నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్‌లో కనుక మా సినిమా విడుదల కాకపోతే ఇకపై నన్ను ప్రమోషన్స్‌లో కూడా చూడరు’’ అంటూ విశ్వక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

The Railway Men: ఆ భయానక క్షణాలను గుర్తు చేసేలా ‘ది రైల్వే మేన్‌’ టీజర్‌..!

‘దాస్‌ కా ధమ్కీ’ తర్వాత విశ్వక్‌ సేన్‌ నటిస్తోన్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకుడు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌, వినోదం నిండిన కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. నేహాశెట్టి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. డిసెంబర్‌ 8న దీనిని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే, అదే సమయంలో నితిన్‌ ‘ఎక్స్‌ట్రా’, వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సైతం రిలీజ్‌ కానున్నాయి. ఆయా చిత్రాలను దృష్టిలో ఉంచుకుని ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ని వాయిదా వేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని, ఈ విషయంపై విశ్వక్‌ అసహనానికి లోనయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పోస్ట్‌ పెట్టినట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని