Srimanthudu: ‘శ్రీమంతుడు’ కాపీ రైట్‌ వివాదం.. అప్పుడు ₹15 లక్షలు ఇస్తామన్నారు: శరత్‌ చంద్ర

‘శ్రీమంతుడు’ (Srimanthudu) కాపీ రైట్‌ వివాదంపై రచయిత శరత్‌ చంద్ర స్పందించారు. తాను నష్టపరిహారం కోరుకోవడం లేదన్నారు.

Published : 01 Feb 2024 16:49 IST

హైదరాబాద్‌: ‘శ్రీమంతుడు’ (Srimanthudu) కాపీ రైట్‌ వివాదం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తన కథను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) సినిమా తెరకెక్కించారని రచయిత శరత్‌ చంద్ర ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాజాగా రచయిత స్పందిస్తూ తనకు నష్టపరిహారం ఇవ్వమని కోరడం లేదని చెప్పారు. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

‘‘2012లో నేను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. ఆ కథతో ఒక సినిమా చేస్తే బాగుంటుందని దర్శకుడు సముద్రను కలిశా. మేం ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాలనుకున్న సమయంలో ‘శ్రీమంతుడు’ విడుదలైంది. అది చూసిన మిత్రులు.. అది నా కథేనన్నారు. దాంతో నేనూ ఆ సినిమా చూశా. నా కథలో ఉన్నది ఉన్నట్లు స్క్రీన్‌పై చూసి షాకయ్యా. దర్శకుడితో మాట్లాడా. ఇది నా కథేనని చెప్పా. దానికి ఆయన అంగీకరించలేదు. సినీ పెద్దలు కొంతమంది రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. రూ.15 లక్షలు ఇస్తామన్నారు. ఈ విషయంలో రచయితల అసోసియేషన్ నాకు ఎంతో సాయం అందించింది. వాళ్ల సహకారంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించా. ఈ స్క్రిప్ట్‌ నాదేనని అంగీకరించమని కోరుతున్నా’’ అని శరత్‌ చంద్ర అన్నారు.

ఏం జరిగిందంటే...

మహేశ్‌ బాబు (Mahesh babu) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శ్రీమంతుడు’. 2015లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఆ సమయంలోనే ‘శ్రీమంతుడు’ను తన నవల ఆధారంగా తెరకెక్కించారంటూ రచయిత శరత్‌ చంద్ర హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కొరటాలకు చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టగా అక్కడా అదే పరిస్థితి. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని