షార్లెట్‌లో తెదేపా అభిమానుల ఆత్మీయ సమావేశానికి హాజరైన వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి

అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరికి అమెరికాలోని షార్లెట్‌ నగరంలో ఘన స్వాగతం లభించింది. బోస్టన్‌లో ఈ నెల 20, 21 నిర్వహించనున్న ఎన్నారై తెదేపా యూఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహానాడులో పాల్గొనేందుకు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి అమెరికా వచ్చారు.

Published : 20 May 2022 00:03 IST

అమెరికా: అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరికి అమెరికాలోని షార్లెట్‌ నగరంలో ఘన స్వాగతం లభించింది. బోస్టన్‌లో ఈ నెల 20, 21 నిర్వహించనున్న ఎన్నారై తెదేపా యూఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహానాడులో పాల్గొనేందుకు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి అమెరికా వచ్చారు. ఈ సందర్భంగా ఈ నెల 18న షార్లెట్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా అభిమానులు దాదాపు 250 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతపురం వాసులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు షార్లెట్‌లో ఎక్కువగా ఉండడంతో వారి కోరికను మన్నించి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

షార్లెట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పురుషోత్తం చౌదరి గుడే, రవి నాయుడు, ఠాగూర్ మల్లినేని, వెంకట్ మాలపాటి, ఆవులపాటి, మహేష్ సూరపనేని, వెంకట్ సూర్యదేవర, కృష్ణ, నరసింహ సమన్వయకర్తలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సురేష్ కాకర్ల, రామ్ అల్లు, సిద్ద కోనంకి, కేశవ్ వేముల తదితరులు పాల్గొన్నారు.

తెదేపా అభిమానుల ఆత్మీయ సమావేశంలో పురుషోత్తం చౌదరి గుడే స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పిల్లలు పుష్పగుచ్ఛంతో ప్రభాకర్ చౌదరికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పలువురు మహిళలు, యువత తమ తమ ఆలోచనలను ప్రసంగ రూపంలో పంచుకున్నారు. అనంతరం ప్రభాకర్ చౌదరి సమావేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపన, విధివిధానాలు, తెదేపా అధికారంలో ఉన్నప్పుడు అణగారిన వర్గాలకు అందించిన చేయూత, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దురాగతాలు, స్వలాభాపేక్ష లేకుండా ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న వైనం, బోస్టన్ మహానాడు ఆహ్వానం తదితర విషయాలపై ప్రభాకర్ చౌదరి సుదీర్ఘంగా మాట్లాడారు. సభికులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పారు. 

ఈ సందర్భంగా కార్యక్రమ సమన్వయకర్తలు ప్రభాకర్ చౌదరిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. శాలువాతో సత్కరించబోగా ఆ శాలువాను తిరిగి ఠాగూర్ మల్లినేనికి కప్పి, తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఠాగూర్ లాంటి వాళ్లను ముందు సత్కరించాలని ప్రభాకర్ చౌదరి అనడంతో సభికులు హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి యోగక్షేమాలు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి అడిగి తెలుసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. మహిళలు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని