NRI: తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకోవాలి: కృష్ణ లాం

తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షులు  కృష్ణ లాం అన్నారు.

Updated : 16 Apr 2023 22:39 IST

వాషింగ్టన్ డీసీ (అమెరికా):  తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షులు  కృష్ణ లాం అన్నారు. జీడబ్ల్యూటీసీఎస్‌(బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం) ఆధ్వర్యంలో శోభాకృత ఉగాది ఉత్సవాలు అత్యంత ఆహ్లాదకరంగా, వైభవంగా జరిగాయి. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి వేద పండితుల ఆశీర్వచనాలతో కార్యక్రమం ప్రారంభమైంది. వాషింగ్టన్‌ డీసీలోని ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. తెలుగు వారి అభిరుచులకు తగిన విధంగా పసందైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని లైవ్‌ బ్యాండ్‌ మ్యూజికల్‌ కన్సర్ట్‌ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కృష్ణలాం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా సతీష్‌ వేమన, సత్యనారాయణ మన్నె, మన్నవ సుబ్బారావు, మూల్పూరి వెంకట్రావు, డా.హేమప్రసాద్ యడ్ల, స్టేట్ డెలికేట్ సుహాస్ సుబ్రహ్మణ్యం, బుటా బీబీ రాజ్, గంటి భాస్కర్, బాబూరావు సామల, విష్షు కల్వాల, నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రముఖ గాయని  సునీత ఉపద్రష్ట బృందం తమ పాటలతో ప్రేక్షకులను మైమరపించారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ చేస్తున్న సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. సునీత సినీ నేపథ్య గాయనిగా తన 25 ఏళ్ల ప్రస్థానం పూర్తిచేసుకోవడాన్ని పురస్కరించుకుని ఆమెను ఘనంగా సత్కరించి “సుమధుర సుస్వర సుహాసిని” బిరుదు ప్రదాన చేశారు. 

ఈ సందర్భంగా కృష్ణ లాం మాట్లాడుతూ.. అందరికీ శోభాకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు  తెలిపారు.‘‘భాషను, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తీపి, చేదు కలిసిందే జీవితం. ఈ ఉగాది ప్రారంభం నుంచి అందరి జీవితాలు ఆనందమయం కావాలి. జీడబ్ల్యూటీసీఎస్ లాంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న సంస్థకు అతి చిన్న వయసులో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగువారు అందరికీ వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అందజేయాలన్నదే మా అభిలాష. మీరిస్తున్న ప్రోత్సాహం, ఆశీస్సులు మమ్ముల్ని మరింత ఉత్సాహ పరుస్తున్నాయి. మా సంస్థ పట్ల భవిష్యత్ లోనూ ఇలాంటి ఆదరణే చూపాలని కోరుకుంటున్నా’’ అని కృష్ణ లాం తెలిపారు.  

సతీష్ వేమన మాట్లాడుతూ.. ‘‘ఉగాది కొత్త ఆలోచనలు, సరికొత్త ఆశయాలు మీ జీవితాల్లో నింపాలని ఆకాంక్షిస్తున్నా. తెలుగు జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది ఉగాది పండుగ’’అన్నారు.  సత్యనారాయణ మన్నె మాట్లాడుతూ.. తెలుగుదనానికి అద్దంపట్టే పండుగ ఉగాది. చాలా కాలం నుంచి ఇక్కడున్న తెలుగువారందరికీ చక్కటి వినోదాన్ని, వికాసాన్ని జీడబ్ల్యూటీసీఎస్ అందిస్తోందన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. సుదీర్ఘ చరిత్ర కలిగిన జీడబ్ల్యూటీసీఎస్ క్రమం తప్పకుండా తెలుగువారి అస్థిత్వాన్ని కాపాడుకుంటూ అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ తెలుగుదనాన్ని ఒక గొడుకు కిందకు చేర్చి వారి మధ్య సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తున్నారన్నారు.  

మూల్పూరి వెంకట్రావు మాట్లాడుతూ.. సంక్రాంతి సంబరాలకు ధీటుగా ఉగాది వేడుకలను నిర్వహించారు. భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు జీడబ్ల్యూటీసీఎస్ ద్వారా చేపట్టాలన్నారు.  ఫ్యాషన్ షో, రాఫెల్స్, ఫోటో బూత్స్, కిడ్స్ ఆర్ట్ కాంపిటీషన్, షాపింగ్ స్టాల్స్, డాజ్లింగ్ కల్చరల్ పెర్ఫామెన్స్‌  వంటి అనేక సాంస్కృతిక, క్రీడా, వినోద కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి.చిన్నారుల నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులకు, ప్రేక్షకులకు ఈ కార్యక్రమం ఒక మధురానిభూతిని మిగిల్చింది.  నరేన్ కొడాలి, సుశాంత్ మన్నె, విజయ్ అట్లూరి, సుష్మ అమృతలూరి, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, ప్రవీణ్ కొండక, శ్రీనివాస్ గంగా, యాష్ బొద్దులూరి, శ్రీవిద్య సోమ, కార్తీక్ కోమటి, ఫణి తాళ్లూరు, ఉమాకాంత్ రఘుపతి, రాజేష్ కాసరనేని, శ్రీమతి సుధ పాలడుగు, సత్య సూరపనేని, రమాకాంత్ కోయ, రామ్ చౌదరి ఉప్పుటూరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని