NATS: నాట్స్‌ ‘సొగసైన తెలుగు భాష’ వెబినార్‌కు చక్కటి స్పందన

తెలుగు భాష రమణీయతను తెలియజెప్పేందుకు నాట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్‌కు విశేష స్పందన లభించింది.

Published : 21 Mar 2023 17:46 IST

న్యూజెర్సీ: ‘భాషే రమ్యం.. సేవే గమ్యం’ అనే తన నినాదానికి అనుగుణంగా నాట్స్(NATS) అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తెలుగు భాష గొప్పతనాన్ని, వైభవాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు ఇంటర్నెట్‌ వేదికగా నాట్స్ సొగసైన తెలుగు భాష పేరిట సదస్సు నిర్వహించింది. నాట్స్ లలిత కళా వేదిక, న్యూ జెర్సీలోని స్థానిక తెలుగు కళా సమితి సంయుక్తంగా నిర్వహించిన ఈ వెబినార్‌కు అమెరికాలో తెలుగు వారి నుంచి విశేష స్పందన లభించింది. ‘సొగసైన తెలుగు’ వెబినార్‌కు ప్రముఖ రచయిత జీవీ పూర్ణచందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుభాష మాధుర్యం ఎంత గొప్పదనే అంశాన్ని చక్కగా వివరించారు. తెలుగువారు మరిచిపోయిన.. వాడుకలో లేని పదాలను ఈ సదస్సులో గుర్తుచేశారు. ఆ పదాలను ఏయే సందర్భాల్లో ఎలా వాడాలనేది కూడా వివరించారు. ఒక్కో పదం అర్థం.. అందులోని పరమార్థం విడమరిచి చెప్పడంతో సదస్సుకు హాజరైన తెలుగు వారు జీవీ పూర్ణచందుపై ప్రశంసలు కురిపించారు. 

నాట్స్ తెలుగు భాష కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగానే నాట్స్ లలిత కళా వేదిక ఏర్పాటు చేసినట్టు నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి తెలిపారు. తెలుగు భాషా వైభవానికి నాట్స్ తన వంతు కృషి చేస్తుందన్నారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. ‘సొగసైన తెలుగు’ భాష వెబినార్‌కు వ్యాఖ్యతలుగా నాట్స్ నాయకులు గిరి కంభంమెట్టు, శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ వ్యవహరించారు. తెలుగు భాష కోసం నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల గురించి నాట్స్ కార్యనిర్వాహక కార్యదర్శి(మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల వివరించారు. తెలుగు సాహిత్యం, కళలకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా తమ మద్దతు ఉంటుందని తెలుగు కళా సమితి అధ్యక్షుడు మధు రాచకుళ్ల తెలిపారు. ఇంటర్నెట్‌ ద్వారా అనేక మంది తెలుగువారు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. సొగసైన తెలుగు భాష వెబినార్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని