గతమెంతో ఘనం.. ప్రస్తుతం ఒంటరి పథం!

దక్షిణ భారతంపై దృష్టి పెట్టిన భాజపా తమిళనాడులో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌ సెల్వం(ఓపీఎస్‌)కు మద్దతు ప్రకటించింది. 

Updated : 26 Mar 2024 07:06 IST

 రామనాథ్‌పురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పన్నీర్‌ సెల్వం పోటీ
మద్దతు ప్రకటించిన భాజపా
ఉనికి కోసం పోరాడుతున్న మాజీ సీఎం

చెన్నై: దక్షిణ భారతంపై దృష్టి పెట్టిన భాజపా తమిళనాడులో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌ సెల్వం(ఓపీఎస్‌)కు మద్దతు ప్రకటించింది.  ఒకప్పుడు సీఎం స్థాయికి ఎదిగి చక్రం తిప్పిన ఓపీఎస్‌ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.

తాజా సార్వత్రిక ఎన్నికల్లో గణనీయమైన ఎంపీ స్థానాలు సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్న భాజపా దక్షిణ భారతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తమిళనాడులో ఎలాగైనా ఈసారి అత్యుత్తమ ఫలితాలను సాధించాలనే పట్టుదలతో ఉన్న మోదీసేన అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వాడుకుంటోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం(ఓపీఎస్‌)ను తమ వైపునకు తిప్పుకొని అన్నా డీఎంకేపైకి అస్త్రంగా ప్రయోగిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పన్నీర్‌ సెల్వం పోటీ చేస్తున్న రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంపైనే ఉంది. ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనున్న ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న పన్నీర్‌ సెల్వంకు భాజపా మద్దతు ప్రకటించింది. అక్కడి నుంచి అభ్యర్థిని నిలపబోమని వెల్లడించింది.

రామనాథపురం స్థానంలో ఎవరి బలం ఎంత?

రామనాథపురం పార్లమెంట్‌ స్థానం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా 59 ఏళ్ల పి.జయపెరుమాళ్‌ పోటీ చేస్తున్నారు. రైతు అయిన జయపెరుమాళ్‌ కారియాపట్టి తాలూకాకు చెందినవారు. డీఎంకే రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేసిన ఆయన 2011లోనే అన్నాడీఎంకేలో చేరారు. ఇక అధికార డీఎంకే కూటమి తరఫున ముస్లిం లీగ్‌ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎంపీ నవాస్‌ కాని పోటీలో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నవాస్‌ కాని 4.69 లక్షల ఓట్లు సాధించి విజయభేరి మోగించారు. అప్పట్లో అన్నాడీఎంకే మద్దతుతో పోటీచేసిన భాజపా అభ్యర్థి నయనార్‌ నాగేంద్రన్‌కు 3.42 లక్షల ఓట్లు పడ్డాయి.

అయితే ఈసారి అన్నాడీఎంకే, భాజపా వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాజపాతో పాటు అన్నాడీఎంకేలోని చీలిక వర్గం మద్దతుతో తాను సులువుగా రామనాథపురం పార్లమెంట్‌ స్థానం నుంచి గెలుస్తాననే ధీమాతో పన్నీర్‌ సెల్వం ఉన్నారు. గత ఎన్నికల్లో ముస్లిం లీగ్‌ అభ్యర్థి కేవలం లక్ష ఓట్ల మెజారిటీని సాధించారని దానిని సులువుగా తాను అధిగమిస్తానని సెల్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండు ఆకుల చిహ్నాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పన్నీర్‌ సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు సోమవారం జూన్‌10కి వాయిదా వేసింది. అంటే ఈ ఎన్నికల్లో ఆయనకు ఆ చిహ్నం వాడుకునే అవకాశం లేనట్టే!

ఓపీఎస్‌ను దెబ్బకొట్టిన పళనిస్వామి

ఒకప్పుడు అన్నాడీఎంకేలో బలమైన నేతగా పన్నీర్‌ సెల్వంకు పేరు ఉండేది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఆయన్ను చెప్పేవారు. జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ ముక్కలు కాకుండా పన్నీర్‌ సెల్వం, పళనిస్వామి కలసికట్టుగా పనిచేశారు. కానీ ఆ తర్వాతి కాలంలో వీరి మధ్య అంతరం పెరిగిపోయింది.

అదును చూసి పన్నీర్‌ సెల్వంను పళనిస్వామి దెబ్బ కొట్టారు. ఏకంగా అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. జయలలిత సన్నిహితురాలైన శశికళ చేతికి పార్టీని వెళ్లకుండా కాపాడుకున్న ఇద్దరు నేతల్లో ఇప్పుడు పళనిస్వామి అగ్రనేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా మారిన పన్నీర్‌ సెల్వం ఎదుట ఈ లోక్‌సభ ఎన్నికలు పెద్ద సవాల్‌గా నిలిచాయి. ఒకప్పుడు సీఎం స్థాయికి చేరి ఓ వెలుగు వెలిగిన ఓపీఎస్‌ ఇప్పుడు ఉనికి కోసం ఒక్క స్థానం నుంచి గెలవడానికి చెమటోడ్చాల్సి వస్తోంది. అది కూడా ఒక స్వతంత్ర అభ్యర్థిగా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని