Prakasam: తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఒంగోలులో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లా ఒంగోలు సమతానగర్‌లో వైకాపా ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Updated : 11 Apr 2024 00:59 IST

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు సమతానగర్‌లో వైకాపా ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కోడలు కావ్యారెడ్డి, వాలంటీరు సుజన ప్రియ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీరు పాల్గొనడంపై తెదేపా కార్యకర్త ప్రభావతి నిలదీశారు. దీంతో ప్రభావతి, ఆమె పిల్లలపై వైకాపా నేతలు రామానాయుడు, కృష్ణరెడ్డి, బిన్నీ స్థానిక కార్పొరేటర్‌ భర్త తిరుపతిరావులు దాడికి దిగారు. సమాచారం అందుకున్న తెదేపా నేత మేడికొండ మోహన్‌ ఇతర కార్యకర్తలతో కలిసి ప్రభావతిని పరామర్శించడానికి అక్కడికి వెళ్లారు. ఆయనను అడ్డగించిన వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్‌కు గాయాలు అయ్యాయి.

విషయం తెలుసున్న తెదేపా నేత జనార్దన్‌, ఇతర నాయకులు ఘటనాస్థలికి వెళ్లారు. ప్రభావతి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. దాడి జరుగుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు దామచర్ల జనార్దన్‌, జనసేన నాయకులు వెళ్లారు. ఈదాడిలో గాయపడిన వారిని జనార్దన్‌ జిల్లా ఆసుపత్రి రిమ్స్‌కు తరలించారు. వాలంటీర్‌ సుజన ప్రియను పరామర్శించేందుకు జిల్లా ఆసుపత్రికి బాలినేని రాగా, తెదేపా కార్యకర్తలను పరామర్శించేందుకు జనార్దన్‌, ఇతర నేతలు అక్కడికి వెళ్లారు. ఒకరికి ఒకరు ఎదురు పడడంతో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని