చందమామ నీడలో...
భూమి నుంచే పుట్టుకొని వచ్చి ఉండొచ్చు. భూమికి ఉపగ్రహమే కావొచ్చు. అయితేనేం? మన వాతావరణం, కాలాల దగ్గర్నుంచి జీవుల మనుగడ వరకూ చంద్రుడి ప్రభావం పెద్దదే. కొన్ని జీవులకు దిక్సూచిగా, పువ్వులకు పరాగ సంపర్క కారకుడిగానే కాదు..
భూమి నుంచే పుట్టుకొని వచ్చి ఉండొచ్చు. భూమికి ఉపగ్రహమే కావొచ్చు. అయితేనేం? మన వాతావరణం, కాలాల దగ్గర్నుంచి జీవుల మనుగడ వరకూ చంద్రుడి ప్రభావం పెద్దదే. కొన్ని జీవులకు దిక్సూచిగా, పువ్వులకు పరాగ సంపర్క కారకుడిగానే కాదు.. గ్రహశకలాల తాకిడి నుంచి భూమిని కాపాడే రక్షకుడిగానూ నిలుస్తున్నాడు. అంతటి చందమామ గొప్పతనాన్ని తెలుసుకోకపోతే ఎలా?
ఏటా దూరంగా..
చూడటానికి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకే దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంటాడు. కానీ ఇది మన భావనే. భూమి చుట్టూ చంద్రుడు తిరిగే కక్ష్య వృత్తాకారంలో ఉండదు. కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అందువల్ల భూమి, చంద్రుడి మధ్య దూరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు 3,62,600 కి.మీ., అతి దూరంగా వెళ్లినప్పుడు 4,05,400 కి.మీ. దూరంలో ఉంటాడు. అంటే 42,800 కి.మీ. తేడా ఉంటుందన్నమాట. మరోవైపు చందమామ భూమి నుంచి ఏటా సగటున 3.8 సెం.మీ. (1.5 అంగుళాలు) దూరంగా జరిగిపోతోంది. దీనికి కారణం అల ప్రభావమే (టైడ్ ఎఫెక్ట్). చంద్రుడు తన గురుత్వాకర్షణ శక్తితో సముద్రాలను, మహా సముద్రాలను ఆకర్షిస్తుంటాడు. దీని మూలంగానే ఆటుపోట్లు సంభవిస్తుంటాయి. ఇందులో సూర్యుడి పాత్ర కూడా ఉంటుందనుకోండి. చంద్రుడి ప్రభావం ఒక్క అలల మీదే కాదు, భూమి ఉపరితలం (క్రస్ట్) మీదా పడుతుంది. కాకపోతే ద్రవాలతో పోలిస్తే భూమి ఉపరితలం అంతగా సాగదు కాబట్టి మనకేమీ తెలియదు. భూమి-చంద్రుడి అక్షంతో పాటు ఈ ప్రభావాలతో ఘర్షణ పుట్టుకొస్తుంది. ఫలితంగా వేడి రూపంలో శక్తి చెదిరిపోతుంది. ఇది చంద్రుడు, భూమి రెండింటి కక్ష్యల సమతుల్యత మీద ప్రభావం చూపుతుంది. దీంతో భూమి భ్రమణ వేగం ప్రతి వందేళ్లకు 2 మిల్లీసెకండ్ల చొప్పున తగ్గుతోంది. అలాగే భూమి నుంచి చంద్రుడు ఏటా ఒకటిన్నర అంగుళం (3.8 సెం.మీ.) చొప్పున దూరంగా జరుగుతున్నాడు కూడా.
ఎలా కొలుస్తారు?
భూమి నుంచి చందమామ దూరంగా జరుగుతున్న విషయాన్ని, అదీ అంత కచ్చితంగా ఎలా కొలుస్తారు? మన మీద ఎలాంటి ప్రభావం చూపని, మనకేమాత్రం తెలియని ఈ స్వల్ప తేడాను గుర్తించటానికి లేజర్ రిఫ్లెక్టర్లు ఉపయోగపడుతున్నాయి. అపోలో వ్యోమనౌకల ద్వారా వెళ్లిన అమెరికా వ్యోమగాములు చంద్రుడి మీద వాటిని నెలకొల్పారు. సోవియట్ యూనియన్ పంపించిన లునోకాడ్ రోవర్లతోనూ వీటిని స్థాపించి ఉండొచ్చు. భూమి మీద అబ్జర్వేటరీ నుంచి లేజర్ పుంజాన్ని రిఫ్లెక్టర్ల మీదికి ప్రసరింపజేసి, అక్కడ్నుంచి కాంతి తిరిగి రావటానికి పట్టే సమయాన్ని బట్టి దూరాన్ని లెక్కిస్తారు. కాంతి సెకండుకు 3లక్షల కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది కదా. దీని ప్రకారం చంద్రుడి నుంచి కాంతి ప్రతిఫలించటానికి 2 సెకండ్ల కన్నా కాస్త ఎక్కువ సమయం పడుతుంది. దీని ఆధారంగానే రెండింటి మధ్య దూరాన్ని కచ్చితంగా లెక్కించగలుగుతున్నారు. చంద్రుడు దూరంగా జరిగితేనేం? నిజానికి భూమి మీద దీని ప్రభావం చాలా తక్కువే. అయినా ఖగోళ శాస్త్రవేత్తలు ఊరుకుంటారా? మున్ముందు ఎలాంటి ప్రభావం పడుతుందో అంచనా వేయకుండా ఉంటారా? చంద్రుడు ఇలాగే దూరంగా పోతుంటే.. 60 కోట్ల సంవత్సరాల తర్వాత సంపూర్ణ సూర్య గ్రహణాలు ఏర్పడకపోవచ్చు. ఎందుకంటే అప్పటికి సూర్యుడిని చంద్రుడు పూర్తిగా మూయలేనంత దూరం జరిగిపోవచ్చు.
‘చందమామ రావే, జాబిల్లి రావే’ అని పాట పాడి పిలుచుకుంటాం. చంద్రుడిని చూపించి పిల్లలకు బువ్వ తినిపిస్తాం. వెన్నెల రాత్రుల్లో ప్రణయ విహారాలూ చేస్తుంటాం. జాబిల్లి ప్రేరణతో పుట్టుకొచ్చిన కవిత్వం, కావ్యాలకు లెక్కేలేదు. నిత్యం కళలను మార్చుకుంటూ.. పౌర్ణమికి నిండు వెన్నెల కురిపిస్తూ, అమావాస్యకు కటిక చీకటిని ప్రసాదిస్తూ అనుక్షణం మన జీవితాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఆశలు, ఆకాంక్షలకే కాదు సృజనాత్మకతను వెలికితీయటానికీ చంద్రుడు అనాదిగా మన వెన్నంటే వస్తున్నాడు. నాగరికతల వికాసానికి సాక్షిగానూ నిలుస్తూ వస్తున్నాడు. కానీ ఏటా భూమి నుంచి సుమారు 1.5 అంగుళాల దూరం జరిగిపోతున్నాడు. ఇది చాలా చాలా తక్కువే అయినా.. దీని ప్రభావం మనకు కనిపించనిదే అయినా కోట్లాది సంవత్సరాల తర్వాత ఏదో ఒకనాడు భారీ అనర్థం సంభవించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చంద్రుడు మన భూమికి చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. చంద్రుడు లేకపోతే రాత్రిపూట వెన్నెల కురవక పోవటం ఒక్కటే కాదు.. భూమి మీద వాతావరణం, జీవుల మనుగడ కూడా కష్టమైపోయేది. విశ్వం భావనే సంపూర్ణంగా మారిపోయి ఉండేది. జీవజాతుల పురోగతి మందగించి ఉండేది. మన రుతువుల క్రమం, అలల మీద వినోద క్రీడలు.. కనువిందు చేసే సూర్య గ్రహణం, భూమి చరిత్ర నిక్షిప్తం వంటివన్నీ చంద్రుడితో ముడిపడినవే.
అలలు కరవు!
చంద్రుడు లేకపోతే కొట్టొచ్చినట్టు కనిపించే మొట్టమొదటి మార్పు సముద్రపు అలలు ఏర్పడకపోవటం. ఇవి ఏర్పడటానికి, సముద్రంలో ఆటుపోట్లకు ప్రధాన కారణం చంద్రుడే మరి. నేల మీద ప్రాణుల పుట్టుకకు ఒకరకంగా ఈ ఆటుపోట్లే కారణమని చెప్పినా అతిశయోక్తి కాదేమో. సముద్రపు అలలు వెనక్కి మళ్లిపోయాక, తీరాన మిగిలిపోయిన నీటిలోని ప్రాణులు నేల మీద మనుగడ సాగించటానికి అలవడి ఉండొచ్చు. అలా నీటిలోంచి బయటకు వచ్చిన జీవులే చివరికి మానవ పరిణామక్రమానికీ దారితీసి ఉండొచ్చన్నది ఒక భావన. చంద్రుడు లేకపోతే ప్రస్తుతం ఎగిసిపడే అలల సైజులో సుమారు 33% తగ్గిపోతుంది. దీంతో అలల ప్రాంతాల్లో నివసించే పీతలు, నత్తలు, ఆల్చిప్పల వంటి ప్రాణుల జీవనం అతలాకుతలమైపోతుంది. సముద్రపు ఆహార చట్రమే మారిపోతుంది. ఫలితంగా మొత్తం తీర ప్రాంత వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది. దీంతో సముద్రంలోని, నేల మీది ప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాత్రిపూట ఆహారం దొరక్కపోవటం వల్ల వేటాడే జంతువులూ అంతర్థానం కావొచ్చు.
* భూమి వాతావరణం తీరుతెన్నుల మీదా అలలు కీలక ప్రభావం చూపుతాయి. చల్లటి ఆర్కిటిక్ నీటిని, ఉష్ణప్రాంతాల వేడి నీటిని సముద్ర ప్రవాహాలు కలిపేస్తుంటాయి. వాతావరణం సమతులంగా ఉండటానికిది అత్యవసరం. ఈ సముద్ర ప్రవాహాలను సృష్టించటంలో అలలదే ప్రధాన పాత్ర. చంద్రుడు, అలలు లేకపోయినట్టయితే భూమి మీద అత్యధిక వేడి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. అదే సమయంలో అతి చల్లటి ప్రాంతాల్లో బాగా పడిపోతాయి. ఇది మొత్తంగా జీవుల ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతుంది.
భూమి అక్షం స్థిరంగా..
మన భూమి 23.5 డిగ్రీల అక్షం వద్ద తనచుట్టూ తాను తిరుగుతుంటుంది. ఇది చంద్రుడి కక్ష్య, అతడి గురుత్వాకర్షణ చలవే. ఒకవేళ చంద్రుడు లేనట్టయితే భూమి అక్షం 10 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్యలో ఊగిసలాడుతుంది. అప్పుడు ఉష్ణోగ్రతల తీరుతెన్నులు సమూలంగా మారిపోతాయి. భూమధ్యరేఖ అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతంగా, ధ్రువాలు అతి చల్లటి ప్రాంతాలుగా ఉండవు. మంచు చరియలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. ఒకప్పుడు భూమి అక్షం 1 నుంచి 2 డిగ్రీల మేరకు మారిపోయిందని, ఇదే క్రమంగా మంచు యుగానికి దారితీసి ఉండొచ్చన్నది పరిశోధకుల నమ్మకం. అందువల్ల భూమి అక్షం 10 నుంచి 45 డిగ్రీల వరకు వంగితే రుతువులన్నీ మారిపోవటం ఖాయం. జీవుల స్థితిగతులన్నీ చిందర వందరైపోవటం నిశ్చయం.
భూ భ్రమణ వేగం కుదురుగా
చంద్రుడి గురుత్వాకర్షణ లేకపోతే భూమి భ్రమణ వేగమూ గణనీయంగా పెరిగిపోతుంది. అప్పుడు సంవత్సరంలో వెయ్యికన్నా ఎక్కువ రోజులు ఉండే అవకాశముంది. భూమిని వేడి చేయటానికి సూర్యుడికి తగినంత సమయం చిక్కకపోవటం వల్ల చలి విపరీతంగా పెరిగిపోయేది. భూ భ్రమణ వేగం పెరిగితే అలలు చాలా వేగంతో ఎగిసిపడతాయి కూడా. తుపాన్లు రోజువారీ వ్యవహారంగా మారిపోతాయి. రుతువులు కనుమరుగవుతాయి. వాతావరణం పూర్తిగా అంచనా వేయలేని స్థితికి చేరుకుంటుంది. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో జీవుల నివాసమే గగనమై పోతుంది. గురుగ్రహం గురుత్వాకర్షణ మూలంగా భూమి అక్షం వంపు స్థిరంగా ఉంటున్నట్టు నాసా అధ్యయనంలో తేలినప్పటికీ చంద్రుడి గురుత్వాకర్షణ లేకపోతే విపరీత పరిణామాలు తలెత్తటం ఖాయం. భూమి అక్షం నిరంతరం మారిపోతూ ఉన్నట్టయితే భూమి అంతర్భాగం కంపించి, తీవ్ర మార్పులు సంభవిస్తాయి. అసాధారణ భూకంపాలు, అగ్ని పర్వతాల విస్ఫోటనాలు జరుగుతాయి. అప్పుడు జీవుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటమే కష్టం. ఈ మార్పులను తట్టుకొని మనుగడ సాగించే క్రమంలో పాత ప్రాణులు అంతర్థానమై, కొత్త జీవులు పుట్టుకురావొచ్చు. ఇవి దృఢంగా, పొట్టిగా ఉండి ఉండొచ్చు.
భూమికి రక్షణగా..
చందమామ భూమికి రక్షకుడిగానూ నిలుస్తాడు. గ్రహశకలాల దాడి నుంచి కాపాడుతుంటాడు. పైగా చంద్రుడి మీది రాళ్లు భూమి, సౌర వ్యవస్థ ఏర్పాటుకు రుజువులు కూడా. భూమి నుంచి విడిపోయినప్పట్నుంచీ చంద్రుడు ఏమాత్రం మారకుండా అలాగే ఉన్నాడు మరి. ఈ రాళ్లను రసాయనికంగా విశ్లేషించటం ద్వారా గ్రహశకలాలు, తోకచుక్కలు భూమికి ఎంత నీటిని తీసుకొచ్చాయో నిర్ధరించొచ్చు. అంటే చంద్రుడిని ఒకరకంగా భూమి చరిత్ర నిక్షిప్త గని అనుకోవచ్చన్నమాట.
జీవుల పునరుత్పత్తికీ
చంద్రుడు తోడ్పడతాడు. గ్రేట్ బారియర్ రీఫ్ వద్ద నవంబరులో పౌర్ణమి తర్వాత సుమారు 2-6 రోజుల్లో రాత్రికి రాత్రే పగడాలు (కోరల్స్) పెద్దమొత్తంలో పునరుత్పత్తి అవుతాయి. ప్రపంచంలోనే ఇదో అతిపెద్ద పునరుత్పత్తి వేడుకగా పేరొందింది. దీనికి కచ్చితమైన కారణమేంటన్నది ఇంకా రహస్యంగానే ఉండిపోయింది. ఉష్ణోగ్రత, నీటి తీరుతెన్నులు, చంద్రుడి వంటివన్నీ ఇందులో పాలు పంచుకొని ఉంటుండొచ్చని భావిస్తున్నారు. నేల మీద జంతువులు సైతం.. ముఖ్యంగా ఎర్ర పీతలు నవంబరు/డిసెంబరు చివరి రోజుల్లో పర్వతాల నుంచి తీరానికి వలస వస్తుంటాయి. చంద్రుడే లేనట్టయితే ఇలాంటి జీవ అద్భుతాలు జరిగి ఉండేవే కావు. పేడ పురుగులు కూడా పేడ ముద్దలను బొరియల్లో పూడ్చటానికి వెన్నెల సాయం తీసుకుంటాయి. కొన్ని పువ్వుల పరాగ సంపర్కానికీ, తేళ్లు నీలిరంగులో మెరవటానికీ వెన్నెల తోడ్పడుతుంది. ఇలా జీవజాతుల మీద, పునరుత్పత్తి మీద చంద్రుడి ప్రభావం ఎనలేనిది, సాటిలేనిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..