మారుమూల ప్రాంతాల్లో 418 పోస్టాఫీసులు

తెలంగాణలోని మారుమూల పల్లెల్లో తపాల అడుగు పెడుతోంది. ఏకంగా నాలుగొందల పైచిలుకు కొత్త పోస్టాఫీసులు కొలువుదీర్చుతోంది. అయిదొందలు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి హైటెక్‌ సేవలందించేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తపాలశాఖ లేఖ రాసింది

Published : 01 Dec 2021 04:36 IST


తెలంగాణలోని మారుమూల పల్లెల్లో తపాల అడుగు పెడుతోంది. ఏకంగా నాలుగొందల పైచిలుకు కొత్త పోస్టాఫీసులు కొలువుదీర్చుతోంది. అయిదొందలు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి హైటెక్‌ సేవలందించేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తపాలశాఖ లేఖ రాసింది. మూరుమూల ప్రాంతాలు కావడంతో భవనాలు వంటి మౌలిక సదుపాయాలు, ఇతరత్రా అవసరాలకు సహకారం అందించాలని కోరింది.

ఈనాడు, హైదరాబాద్‌: తపాలశాఖ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 418 కొత్త పోస్టాఫీసులు ఏర్పాటు చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 154, వరంగల్‌ గ్రామీణంలో 71, జయశంకర్‌ భూపాలపల్లిలో 65, ఖమ్మం 58, పెద్దపల్లి 38, కుమురంభీం 12, ఆదిలాబాద్‌ 11, మంచిర్యాల జిల్లాలో 11 చొప్పున మంజూరయ్యాయి. ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లాలో మూడు, మంచిర్యాల జిల్లాలో రెండు కొత్త పోస్టాఫీసులు ప్రారంభమయ్యాయి. ‘వారంలోనే 12 ఎస్‌ఎస్‌ యోజన, 11 రికరింగ్‌, సేవింగ్‌ ఖాతాలు తెరిచాం. ఇతర ఊర్లలో బ్యాంకు ఖాతాలున్న 15 మందికి రూ.80 వేల మొత్తాన్ని చంద్రవెల్లిలోనే చెల్లించాం’ అని ఆ గ్రామ డాక్‌సేవక్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ‘ఆదిలాబాద్‌ జిల్లా బట్టిసావర్‌ గ్రామంలో ఏర్పాటైన పోస్టాఫీసు నుంచి బ్యాంకు ఖాతాల్లోని రూ.10 వేల మొత్తాన్ని చెల్లించామ’ని అక్కడి డాక్‌ సేవక్‌ గజానన్‌ తెలిపారు. మార్చి 31లోపు మంజూరైన కార్యాలయాలన్నీ ఏర్పాటు చేస్తామని, కొత్త పోస్టాఫీసులు వచ్చే ప్రాంతాలు, అక్కడ సేవల్ని వివరిస్తూ ఆసరా పింఛన్ల చెల్లింపులు వంటి వాటికి ఉపయోగించుకోమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశామని పోస్టుమాస్టర్‌ జనరల్‌ పి.విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. త్వరలో డాక్‌సేవక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

పొదుపు ఖాతాల నుంచి పాన్‌కార్డుల దాకా..
ఈ కార్యాలయాల్లో ప్రధానంగా 30 రకాలు సేవలు అందనున్నాయి. పొదుపు, రికరింగ్‌ డిపాజిట్‌, సుకన్య సమృద్ధి యోజన వంటి ఖాతాలను పోస్టాఫీసుల నుంచి నిర్వహించవచ్చు. పాన్‌కార్డు, పాస్‌పోర్టుకు దరఖాస్తులు, ఫాస్టాగ్‌ రీఛార్జి, రైలు, విమాన టికెట్ల బుకింగ్‌, జీవిత, సాధారణ బీమాల ప్రీమియం, కరెంటు బిల్లుల చెల్లింపులను ఈ కార్యాలయాల్లో చేయొచ్చు. ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ బిల్లులనే కాదు ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉంటే బ్రాంచి ఏ ఊరిదైనా సరే సొంతూరిలోనే డబ్బు తీసుకునే వెసులుబాటు ఈ ఆఫీసుల వల్ల కలగనుంది. పోస్టాఫీసుకు వెళ్లలేని పరిస్థితి ఉండే ఫోన్‌ చేస్తే ఇంటికే వచ్చి డబ్బులు చెల్లిస్తామంటున్నాయి తపాల వర్గాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని