గ్రూప్‌-1 ప్రిలిమినరీకి ఏర్పాట్లు

రాష్ట్రంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి హైకోర్టు నిర్ణయంతో తెరపడింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.

Published : 28 May 2023 04:44 IST

ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహణ
పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్ల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి హైకోర్టు నిర్ణయంతో తెరపడింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా ప్రవేశపత్రాలు జారీ చేయనుంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ (ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌) పద్ధతిలో నిర్వహించనుంది. తెలంగాణ తొలి గ్రూప్‌-1 కింద అత్యధికంగా 503 ఉద్యోగాలతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 2.85 లక్షల మంది హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దుచేసి, జూన్‌ 11న తిరిగి నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కొందరు అభ్యర్థులు ఆ పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. దీంతో పరీక్ష యథావిధిగా నిర్వహించేందుకు కమిషన్‌ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసింది. త్వరలోనే గ్రూప్‌-1 ప్రిలిమినరీ ప్రవేశపత్రాలను వెబ్‌సైట్లో పొందుపరచనుంది.

సీబీఆర్‌టీ విధానం పరిశీలన..

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పునఃపరీక్ష నిర్వహణపై కమిషన్‌ లోతుగా చర్చించింది. లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కమిషన్‌ నిర్వహించే పరీక్షలను మల్టీసెషన్ల విధానంలో నిర్వహించి, నార్మలైజేషన్‌ కింద మార్కులు లెక్కించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 పరీక్షపై చర్చజరిగింది. అయితే రాష్ట్రంలో ఒకేసారి 40 వేల మందికి మాత్రమే సీబీఆర్‌టీ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉంది. ఈ లెక్కన 3.8 లక్షల మందికి పరీక్ష నిర్వహించేందుకు దాదాపు పదిరోజుల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పోస్టును సృష్టించి, ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలను టీఎస్‌పీఎస్సీ అప్పగించింది. గ్రూప్‌-1 రాత పరీక్ష ప్రక్రియను ఈ ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని