అనర్హత పిటిషన్లు స్పీకర్‌ కార్యాలయానికి అందజేత

స్టేషన్‌ ఘన్‌పూర్‌, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ పిటిషన్లను స్పీకర్‌ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు.

Published : 01 May 2024 05:52 IST

హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌
కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు.. విచారణ జూన్‌ 5కు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: స్టేషన్‌ ఘన్‌పూర్‌, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ పిటిషన్లను స్పీకర్‌ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. దీంతో ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, స్పీకర్‌ కార్యాలయానికి హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్‌ స్వీకరించడం లేదని పేర్కొంటూ భారాస ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. గత విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ద్వారా అనర్హత పిటిషన్లను స్పీకర్‌ కార్యాలయానికి పంపాలన్న హైకోర్టు సూచన మేరకు అందజేసినట్లు అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు. వీటిపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసే పరిధి హైకోర్టుకు ఉందని తెలిపారు. అంతేగాకుండా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలన్న ఈ పిటిషన్లు విచారణార్హమేనన్నారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌కు సంబంధించి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడానికి ఆ పార్టీ జారీ చేసిన బీఫాంతోపాటు అదనపు అఫిడవిట్‌ను సైతం స్పీకర్‌కు అందించినట్లు ఏజీ తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, పిటిషన్లపై ఏం నిర్ణయం తీసుకున్నారన్న దానిపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని