ఓటీఎస్‌.. కట్టించాల్సిందే!

పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం పరిధిలోని కొత్తూరు ఇందిరమ్మ కాలనీ ఇది.. రెండు వేలకుపైగా పేద కుటుంబాలు ఉంటున్న ఈ కాలనీకి 2004-05లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

Published : 04 Dec 2021 04:19 IST

సిబ్బందికి రోజువారీ లక్ష్యాలు 

వసూలుకు సకల అస్త్రాల ప్రయోగం

ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ఉన్నా తప్పని ఒత్తిడి

క్షేత్రస్థాయిలో ‘ఈనాడు’ పరిశీలన

పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం పరిధిలోని కొత్తూరు ఇందిరమ్మ కాలనీ ఇది.. రెండు వేలకుపైగా పేద కుటుంబాలు ఉంటున్న ఈ కాలనీకి 2004-05లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో గృహనిర్మాణ సంస్థ అందించిన సొమ్ముతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకున్నారు. ఇన్నాళ్లూ ఇంటిని తమ సొంతమనే భావిస్తున్నామని, ఇప్పుడు ఉన్నట్లుండి అధికారులు వచ్చి ‘మీ పేరిట అప్పుంది... కట్టాలి’ అంటున్నారని వాపోయారు. కరెంటు బిల్లు, ఆధార్‌కార్డు, ఇంటి పట్టా జిరాక్స్‌ తీసుకెళ్లారని చెబుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద... వన్‌టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) వసూలుకు లబ్ధిదారులపై ప్రభుత్వం అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తోంది. అప్పుడెప్పుడో ఇచ్చిన రుణాన్ని ఓటీఎస్‌ పేరిట తిరిగి కట్టించేందుకు ప్రయత్నిస్తోంది. స్వచ్ఛందం అంటూనే అధికారులు కొన్నిచోట్ల లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒక్కో జిల్ల్లాలో ఒక్కో రకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని వసూలుపై దృష్టిసారించారు. వారి ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది అప్పు చేసి మరీ చెల్లిస్తున్నారు. తినడానికి తిండికే లేక ఇబ్బందులు పడుతుంటే రూ.10 వేలు ఎక్కడి నుంచి కట్టాలని మరికొందరు నిలదీస్తున్నారు. ఇప్పటికిప్పుడు కట్టమంటే ఎలా అని ఇంకొందరు వాపోతున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రామాల ప్రజలు, గ్రామ కంఠం, పోరంబోకు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు మాత్రం ఓటీఎస్‌ చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. పట్టణాల పరిధిలోని వారూ కొంతమేర స్పందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏపూరు, తోటగూడెం, పెదపాడు, కొత్తూరు, వెంకటాపురం, తంగెళ్లమూడి సచివాలయాల పరిధిలోని లబ్ధిదారులను ‘ఈనాడు డిజిటల్‌ ప్రతినిధి’ కలిసినప్పుడు తమ ఇబ్బందులను వివరించారు.

కడప జిల్లా ముద్దనూరులో ఇంటి సరిహద్దు కొలతలు తీసుకుంటున్న సచివాలయ సిబ్బంది

వసూలుకు మహిళా పోలీసులు

తహసీల్దారు, ఎంపీడీవో, గృహనిర్మాణశాఖ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌, వీఆర్వో, వాలంటీర్ల వరకు అందరికీ ఓటీఎస్‌ వసూలు బాధ్యత అప్పగించారు. కొన్నిచోట్ల మహిళా పోలీసులనూ వినియోగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏపూరు-2 సచివాలయం, పెదపాడు సచివాలయం పరిధిలోని మహిళా పోలీసుల్ని ఇళ్ల వద్దకు పంపుతున్నారు. కొందరు పేదలు రుణ వివరాలతో కూడిన పత్రాలపై సంతకాలనూ చేయడంలేదు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల, తొండూరు, జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు పంచాయతీలో చాలామంది సంతకాలు పెట్టలేదు. విజయనగరం మండలం కోరుకుండలో ఇప్పుడికిప్పుడు ఒత్తిడి చేస్తే ఎలా కట్టాలని మహిళలు అధికారుల్ని ప్రశ్నించారు.

ప్రతి సచివాలయం నుంచి రోజుకు 1-4 చొప్పున

ఓటీఎస్‌ వసూలుకు అధికారులు సచివాలయాల వారీగా ఓటీఎస్‌ లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. రోజుకు కనీసం ఒకరు నుంచి నలుగురు లబ్ధిదారులతో డబ్బులు కట్టించాలని లక్ష్యంగా పెట్టారు. ఇవన్నీ మౌఖిక ఆదేశాలుగానే అధికారులు ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యంలో రోజుకు 10% సొమ్మును వసూలు చేయాలని ఆదేశాలున్నాయి.

* లబ్ధిదారుల నుంచి మూకుమ్మడిగా వ్యతిరేకత వ్యక్తంకాకుండా ఓటీఎస్‌ జాబితాను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు సచివాలయం పరిధిలో 217 మందితో జాబితా ఉంటే మొదట 12 మంది పేర్లనే ప్రకటించారు. పెదపాడు, వెంకటాపురం, కొత్తూరు, తంగెళ్లమూడి సచివాలయాల్లో వారానికి 5 నుంచి 10 పేర్లను ప్రకటిస్తున్నారు.
* ఓటీఎస్‌ పర్యవేక్షణకు సచివాలయాల వారీగా మండలస్థాయిలోని ఇతర అధికారుల్ని ప్రత్యేక అధికారులుగా నియమించారు.
* జిల్లాస్థాయిలో రోజుకు 2 నుంచి 4 సార్లు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు.

అప్పు కట్టించుకునేందుకు మళ్లీ అప్పు

డబ్బులు లేవని చెబుతున్న వారికి అప్పు ఇప్పించి మరీ జమ చేసుకోడానికి డ్వాక్రా సంఘాలను తెరపైకి తెచ్చారు. లబ్ధిదారుల్లోని డ్వాక్రా మహిళల నుంచి ఓటీఎస్‌ రుసుం కట్టించే బాధ్యతను వెలుగు సిబ్బందికి అప్పగించారు. ఒక వీవో పరిధిలో కనీసం పది మందితో కట్టించాలని యానిమేటర్లకు లక్ష్యంగా పెట్టారు. లబ్ధిదారు కాకుండా... వారి కుటుంబంలో మరొకరు డ్వాక్రా సభ్యులుగా ఉంటే వారి పొదుపు సొమ్ము నుంచైనా కట్టాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. ఇలా తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో చేస్తున్నారు.

* కొన్నిచోట్ల ఆసరా కింద ఇచ్చిన మొత్తాన్ని ఓటీఎస్‌కు కట్టిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో కొందరు ఆసరా మొత్తంతోపాటు మరికొంత బయట నుంచి అప్పు తెచ్చి కట్టారు.

జాబితాలో రుణం తీసుకోని వారి పేర్లు

కొన్ని ప్రాంతాల్లో ఓటీఎస్‌ జాబితాల్లో రుణం తీసుకోని వారి పేర్లూ నమోదయ్యాయి. సిమెంటు/సామగ్రి మాత్రమే తీసుకున్న వారి పేర్లనూ చేర్చారు. కొన్నిచోట్ల ఒకే ఇంటిపైన రెండు, మూడు రుణాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తంగెళ్లమూడి, అనంతపురం జిల్లా యాడికిలో ఈ తరహా వెలుగుచూశాయి.

* కొన్ని ప్రాంతాల్లో గృహనిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారి నుంచి రిజిస్ట్రేషన్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే వారి పేర్లపై రిజిస్ట్రేషన్‌ ఉన్నా మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయిస్తామంటూ సచివాలయ సిబ్బంది కొలతలు తీసుకుంటున్నారు. దీంతో తమ పత్రాలు చెల్లవా? అని కృష్ణా జిల్లా కంకిపాడులో లబ్ధిదారులు వాపోతున్నారు.


తిండికే కష్టపడుతుంటే ఎలా కట్టాలి?

భర్త తాపీమేస్త్రి. నేను ఇళ్లలో పాచి పనికి వెళతా. ముగ్గురు పిల్లలు ఉన్నారు. పనుల్లేక పూట గడవడానికే కష్టంగా ఉంది. ప్రభుత్వమిచ్చిన రుణం మాఫీ అయిందని అప్పట్లోనే చెప్పారు. ఇప్పుడేమో అధికారులు వచ్చి రూ.20 వేలు కట్టమంటున్నారు. ఎలా కట్టాలి?

-మాదు కుమారి, కొత్తూరు ఇందిరమ్మ కాలనీ, వెంకటాపురం


ప్రభుత్వ ఇల్లే మంజూరు కాలేదు

మాకు ప్రభుత్వ ఇల్లే మంజూరు కాలేదు. సొంతంగా కట్టుకున్నాం. కానీ... మా పేరిట ఇల్లు మంజూరై, రుణం తీసుకున్నట్లు ఓటీఎస్‌ జాబితాలో ఉందని అధికారులు చెబుతున్నారు. రూ.10 వేలు కడితే రిజిస్ట్రేషన్‌ చేయిస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయం?

-నీలూరి కృష్ణమూర్తి, యాడికి, అనంతపురం జిల్లా


అప్పుడు ఒక దర్వాజ, రెండు కిటికీలిచ్చారు

మాకు ఇంటి నిర్మాణానికి 2005లో ఒక దర్వాజ, రెండు కిటికీలు ఇచ్చారు. రుణం తీసుకోకుండానే సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకున్నాం. ఇప్పుడు ఓటీఎస్‌ జాబితాలో పేరొచ్చిందని, రూ.10 వేలు కట్టమంటున్నారు. మాకు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ పత్రాలున్నా కూడా... మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని వీఆర్వో ఇంటి కొలతలు తీసుకెళ్లారు.

-అత్తి కోటేశ్వరమ్మ, ఏపూరు, పశ్చిమగోదావరి జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని