చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Updated : 23 Sep 2023 06:36 IST

దర్యాప్తునకు ముందస్తు అనుమతి అవసరం లేదు
దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేం
చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి

ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. భజన్‌లాల్‌ కేసు మొదలు నిహారిక ఇన్‌ఫ్రా కేసు వరకూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే సీఆర్‌పీసీ సెక్షన్‌ 482 (క్వాష్‌) ప్రకారం ప్రస్తుత కేసులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కేసుకు చెందిన వాస్తవాల విషయంలో ఇరువైపుల సీనియర్‌ న్యాయవాదులు లేవనెత్తిన అంశాలపై సెక్షన్‌ 482 కింద హైకోర్టు మినీ ట్రైల్‌ నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంది. ఈ కేసు 2021 డిసెంబరు 9న నమోదైందని, దర్యాప్తు సంస్థ 140 మందికి పైగా సాక్షులను విచారించి, 4వేలకు పైబడి దస్త్రాలను సేకరించిందని గుర్తుచేసింది. నిధుల దుర్వినియోగం వ్యవహారం అస్పష్టమైనదని, దాన్ని తేల్చేందుకు అత్యంత నిపుణులతో కూడిన దర్యాప్తు అవసరం అని పేర్కొంది. దర్యాప్తు తుది దశలో ఉన్న ఈ సమయంలో ఎఫ్‌ఐఆర్‌లోను, జ్యుడిషియల్‌ రిమాండు ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోను జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

నిజాయతీగా విధులు నిర్వహించిన ప్రజాసేవకుడి రక్షణ కోసమే సెక్షన్‌ 17ఏ

సదుద్దేశంతో నిజాయతీగా విధులు నిర్వహించిన ప్రజా సేవకుడికి (పబ్లిక్‌ సర్వెంట్‌) రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో శాసనకర్తలు అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17ఏను 2018 జులై 26న తీసుకొచ్చారని న్యాయమూర్తి పేర్కొన్నారు. పబ్లిక్‌ సర్వెంట్‌ చర్యలు నేరపూరితమైనవిగా కనిపిస్తున్నప్పుడు దర్యాప్తు చేయాలంటే కాంపిటెంట్‌ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు దస్త్రాలు సృష్టించడం, ప్రజాధనం దుర్వినియోగం చేయడం అనేది ప్రజాసేవకుడి అధికారిక విధుల్లో భాగం కాదన్నారు. కొన్ని దస్త్రాల ఆధారంగా నిధుల విడుదలకు చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం, లేదా సిఫారసు చేయడం ద్వారా నిధుల దుర్వినియోగానికి పాల్పడటాన్ని అధికారిక విధుల్లో భాగమని చెప్పలేమన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు చేసేందుకు కాంపిటెంట్‌ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని