వెల్లువెత్తిన అమ్మకాలు

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లకు భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయాయి.

Published : 26 Jan 2023 02:32 IST

సమీక్ష

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లకు భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. జనవరి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియడం, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 81.65 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.31 శాతం తగ్గి 85.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్‌ లాభపడగా, హాంకాంగ్‌, షాంఘై పనిచేయలేదు. ఐరోపా సూచీలు మిశ్రమంగా కదలాడాయి.
సెన్సెక్స్‌ ఉదయం 60,834.73 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా అమ్మకాలు కొనసాగడంతో ఏదశలోనూ కోలుకోలేకపోయిన సూచీ.. ఇంట్రాడేలో 60,081.36 పాయింట్లకు పడిపోయింది. చివరకు 773.69 పాయింట్ల నష్టంతో 60,205.06 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 226.35 పాయింట్లు క్షీణించి 17,891.95 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,846.15- 18,100.60 పాయింట్ల మధ్య కదలాడింది.

* ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో టీవీఎస్‌ మోటార్‌ షేరు 5.18% లాభపడి రూ.1037.30 దగ్గర స్థిరపడింది.
* బలహీన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇండస్‌ టవర్స్‌ షేరు 7.36% నష్టంతో రూ.157.95; యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేరు 5.91% నష్టపోయి రూ.768.75 దగ్గర ముగిసింది.
* సెన్సెక్స్‌ 30 షేర్లలో 24 కుదేలయ్యాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 4.63%, ఎస్‌బీఐ 4.30%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.78%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.02%, హెచ్‌డీఎఫ్‌సీ         2.02%, టెక్‌ మహీంద్రా 1.87%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.78%, అల్ట్రాటెక్‌ 1.63%, ఎల్‌ అండ్‌ టీ 1.45%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.36%, రిలయన్స్‌ 1.33% చొప్పున నష్టపోయాయి. మారుతీ, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, ఐటీసీ మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో యుటిలిటీస్‌ 2.87%, విద్యుత్‌ 2.72%, బ్యాంకింగ్‌ 2.42%, ఆర్థిక సేవలు 2.11%,  టెలికాం 2.06%, చమురు-గ్యాస్‌ 1.76%, స్థిరాస్తి 1.92%, యంత్ర పరికరాలు 1.06% పడ్డాయి. బీఎస్‌ఈలో 2492 షేర్లు నష్టాల్లో ముగియగా, 1037 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 117 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* మధురై కేంద్రంగా పనిచేసే ఐటీ సేవల కంపెనీ ఎస్‌ఎంఐను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. ఇందుకు అప్‌ఫ్రంట్‌, వాయిదా ఈక్విటీ రూపేణా రూ.111 కోట్లు చెల్లించనుంది.
* వచ్చే మూడేళ్లలో కొత్త ఉత్పత్తులు, పవర్‌ట్రైన్‌ అభివృద్ధి కోసం 25 మిలియన్‌ యూరోల (దాదాపు రూ.220 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు విద్యుత్‌ ద్విచక్రవాహన సంస్థ ఒకినవా ఆటోటెక్‌ ప్రకటించింది.
* రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మొదటిసారిగా రూ.8,000 కోట్ల విలువైన సార్వభౌమ హరిత బాండ్లను బుధవారం వేలంలో విక్రయించింది. అయిదేళ్ల కాలవ్యవధి కలిగిన ఈ బాండ్లకు కూపన్‌ రేటు 7.10 శాతంగా ఉంది. అయిదేళ్ల సార్వభౌమ బాండ్ల రాబడులతో పోలిస్తే ఇది 5 బేసిస్‌ పాయింట్ల తక్కువ.

నేడు మార్కెట్లకు సెలవు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు (గురువారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు. బులియన్‌, ఫారెక్స్‌, కమొడిటీ మార్కెట్లు కూడా పని చేయవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని