జూన్‌ 15 నుంచి కేజీ బేసిన్‌ గ్యాస్‌ సరఫరా: ఓఎన్‌జీసీ

దేశీయ చమురు-గ్యాస్‌ దిగ్గజం ఓఎన్‌జీసీ.. తమ కేజీ బేసిన్‌ గ్యాస్‌ క్షేత్రం (కేజీ-డీ5)లో ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు, జూన్‌ 15 నుంచి ఖాతాదార్లకు సరఫరా ప్రారంభించాలనుకుంటోంది.

Published : 29 May 2023 02:58 IST

దిల్లీ: దేశీయ చమురు-గ్యాస్‌ దిగ్గజం ఓఎన్‌జీసీ.. తమ కేజీ బేసిన్‌ గ్యాస్‌ క్షేత్రం (కేజీ-డీ5)లో ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు, జూన్‌ 15 నుంచి ఖాతాదార్లకు సరఫరా ప్రారంభించాలనుకుంటోంది. ఈ గ్యాస్‌ను మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌.. 12 డాలర్ల చొప్పున విక్రయించాలని భావిస్తోంది. రోజువారీగా 0.4 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎం) చొప్పున ఉత్పత్తిని ప్రారంభించి, 2024 ఫిబ్రవరి 5 నాటికి రోజుకు 1.4 ఎంఎంఎస్‌సీఎంకు చేర్చాలని భావిస్తోంది. ఓఎన్‌జీసీ డైరెక్టర్‌ (ఉత్పత్తి) పంకజ్‌ కుమార్‌ కేజీ-డి5 క్షేత్రంలో జూన్‌ నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని గత మార్చిలోనే పేర్కొన్నారు. వాహనాల కోసం సీఎన్‌జీ సరఫరా చేసే సంస్థలు, నివాసాలకు పైప్డ్‌ గ్యాస్‌ అందించే సిటీ గ్యాస్‌ ఆపరేటర్లతో పాటు ఎరువుల తయారీ, విద్యుదుత్పత్తి కంపెనీలు, ఎల్‌పీజీ ఉత్పత్తిదార్లు, ట్రేడర్ల నుంచి గ్యాస్‌ కోసం ఓఎన్‌జీసీ బిడ్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు 77 డాలర్లు ఉండటంతో, గ్యాస్‌ కనీస ధర 11.8 డాలర్లు (బ్రెంట్‌ ముడి చమురులో 14 శాతం=10.78 డాలర్లు+1 డాలరు ప్రీమియం) చొప్పున కంపెనీలు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఓఎన్‌జీసీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని