Hyundai IPO: దీపావళికి హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఐపీఓ?

Hyundai IPO: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా విలువను ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లు 22-28 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. దీంట్లో 15-20 శాతం వాటాను ఐపీఓలో విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Published : 05 Feb 2024 12:38 IST

ముంబయి: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్ తమ భారత అనుబంధ కంపెనీని ఐపీఓకి (IPO) తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ఎకనామిక్‌ టైమ్స్‌’ వెల్లడించింది. దీపావళి వరకు హ్యుందాయ్‌ మోటార్ ఇండియా లిమిటెడ్‌ (Hyundai Motor India Limited- HMIL) పబ్లిక్‌ ఇష్యూకు రావొచ్చని తెలిపింది.

హ్యుందాయ్‌ భారత్‌లోకి ప్రవేశించి దాదాపు మూడు దశాబ్దాలు గడిచింది. గత ఏడాది దేశంలో రెండో అతిపెద్ద ప్రయాణికుల వాహన విక్రయ సంస్థగా (HMIL) నిలిచింది. గోల్డ్‌మన్‌ శాక్స్‌, సిటీ, మోర్గాన్‌ స్టాన్లీ, జేపీ మోర్గాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, హెచ్‌ఎస్‌బీసీ, డాయిషే బ్యాంక్‌, యూబీఎస్ వంటి బడా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు ఐపీఓ అవకాశాలను గతవారం కంపెనీకి వివరించినట్లు సమాచారం. హెచ్‌ఎంఐఎల్‌ విలువను ఈ సంస్థలు 22-28 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. దీంట్లో 15-20 శాతం వాటాను ఐపీఓలో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని విలువ దాదాపు రూ.27,500- 46,500 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అదే జరిగితే భారత్‌లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ (IPO) ఇదే అవుతుంది. ఇప్పటి వరకు రూ.21,000 కోట్లు సమీకరించిన ఎల్‌ఐసీ ఐపీఓనే పెద్దది.

హ్యుందాయ్‌ (Hyundai) 1996లో భారత్‌లోకి ప్రవేశించింది. ప్రపంచంలో ఈ కంపెనీకి భారత్‌ మూడో అతిపెద్ద మార్కెట్‌. క్రెటా, ఎక్స్‌టర్‌, వెర్నా, ఐ20, గ్రాండ్‌ ఐ10, నియోస్‌, టక్సన్‌, అల్కజార్‌ వంటి ప్రముఖ కార్లను విక్రయిస్తోంది. 2023లో దేశీయంగా 6.02 లక్షల వాహనాలను విక్రయించింది. 1.63 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. 2022-23లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 27 శాతం పెరిగి రూ.59,781 కోట్లకు చేరింది. EBITDA ఆదాయం 14.33 శాతం పుంజుకుంది. నికర లాభాలు 62 శాతం పెరిగి రూ.4,653 కోట్లకు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని