logo

గడువులోపు.. గగనమే!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు మినహా పురపాలికల్లో జనరల్‌ ఫండ్‌(సాధారణ) నిధులతో ప్రత్యేకంగా అభివృద్ధి జరగడం లేదు. ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి

Published : 31 Mar 2023 05:50 IST

పురపాలికల్లో ఆస్తిపన్ను వసూళ్ల తీరిది!

కాగజ్‌నగర్‌ పురపాలికలో ఆస్తిపన్ను వసూలు చేస్తున్న అధికారులు

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు మినహా పురపాలికల్లో జనరల్‌ ఫండ్‌(సాధారణ) నిధులతో ప్రత్యేకంగా అభివృద్ధి జరగడం లేదు. ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ నెల 31వ తేదీ లోపు శతశాతం పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాల్లోనూ ఆస్తిపన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించి, మరింత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. అయినప్పటికీ ప్రధాన ఆదాయ వనరైన ఈ పన్ను వసూలు చేయడంలో బల్దియా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని 12 బల్దియాల్లో లక్షెటిపేటలో 93శాతం, క్యాతన్‌పల్లి 75, ఆదిలాబాద్‌లో 71శాతం పన్ను వసూలు చేయగా.. భైంసాలో అతి తక్కువ శాతం మాత్రమే వసూలు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు కేవలం ఒక రోజు గడువు మాత్రమే ఉంది. ఆ లోపు శతశాతం ఆస్తిపన్ను ఏ ఒక్క పురపాలిక చేరే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.  
* మంచిర్యాల జిల్లాలో ఏడు బల్దియాలున్నాయి. ఆయా కార్యాలయాల్లో పనిచేసే బిల్లు కలెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉండటం ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం ఉన్న అరకొర సిబ్బందితోనే వసూలు చేస్తున్నారు. నస్పూర్‌, చెన్నూరు, లక్షెట్టిపేట, క్యాతన్‌పల్లి కొత్త పురపాలికలో నిధుల కొరతతో కాంట్రాక్టు కార్మికుల వేతనాలను చెల్లించడం కష్టంగా మారింది.
* కుమురంభీం జిల్లాలోని ఏకైక పురపాలికలోనూ ఏటా వంద శాతం ఆస్తి పన్ను వసూలు కాక, ఒప్పంద కార్మికుల వేతనాలను కూడా చెల్లించలేని దుస్థితి. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్‌ పురపాలికలో కొంత మేరకు మెరుగ్గా పన్నులు వసూలు చేశారు.
* నిర్మల్‌ జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పురపాలికల్లోనూ ఆస్తి పన్ను తక్కువ వసూలైంది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎక్కువ శాతం వసూలుకు చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని