logo

పరుగుతీస్తున్న పట్టణ ప్రగతి

బల్దియాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో అభివృద్ధికి మార్గం సుగమమైంది.

Published : 02 Jun 2023 04:05 IST

ప్రత్యేక ప్రణాళికతో బల్దియాల్లో వేగవంతమైన అభివృద్ధి

లక్షెట్టిపేటలోని పోలీస్‌స్టేషన్‌ పక్కన ఏర్పాటు చేసిన బృహత్‌ ప్రకృతి వనం ఇది. ఇక్కడ మియావాకీ విధానంలో చిట్టడివిని తలపించేలా వివిధ రకాల మొక్కలు నాటారు. ప్రకృతిని తలపించేలా గడ్డితో వాచ్‌టవర్‌, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఇక్కడ ఆట వస్తువులు, ఉదయపు కాలినడక కోసం వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు.


లక్షెట్టిపేట, న్యూస్‌టుడే: బల్దియాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఒకవైపు పట్టణ ప్రగతి నిధులు, రెండోవైపు ఆర్థిక సంఘం నిధులు, మరోవైపు టీఎఫ్‌ఐడీసీ నిధులు, ఇంకోవైపు పన్నుల రూపంలో సమకూరుతున్న నిధులు వెరసి.. అభివృద్ధికి బాటలు పడ్డాయి. రాష్ట్ర అవతరణ తర్వాత కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలతో పాటు ఇంతకాలం నిధులు లేక కునారిల్లుతున్న పాత మున్సిపాలిటీల్లో సైతం నిధుల రాకతో అభివృద్ధి వేగవంతమైంది. ప్రతి పురపాలికలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఆహ్లాదం, ఆరోగ్యానికి ప్రభుత్వ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ల నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైకుంఠధామాలు, చెత్త డంపింగ్‌ యార్డుల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారంలో మొక్కలు నాటడం,  వార్డుల వారీగా ఓపెన్‌ జిమ్‌లు, పట్టణ ప్రకృతివనాలు, పార్కులు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, అంతర్గత రహదారుల విస్తరణ, వీధి దీపాల ఏర్పాటు, సెంట్రల్‌ లైటింగ్‌ లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో.. అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.


ఇది చెన్నూరులో ఏర్పాటు చేసిన కేసీఆర్‌ పార్కు. రూ.2.5 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ పార్కులో ఉదయపు కాలినడక కోసం వాకింగ్‌ ట్రాక్‌, ఫౌంటెన్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడి పార్కు పిల్లలకు ఆట విడుపుతోపాటు పెద్దలకు ఆహ్లాదాన్ని పెంచేందుకు దోహదం చేస్తోంది.


సమీకృత మార్కెట్ల నిర్మాణం

ఒకేచోట పండ్లు, కూరగాయలు, పూలు, మాంసం, చేపల విక్రయాల కోసం పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టింది. ప్రజలు అన్నింటిని ఒకే చోట కొనే వెసులుబాటు కలిగింది.  


సకల సౌకర్యాలతో వైకుంఠధామాలు

చనిపోయిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా జరగాలన్న ఉద్దేశంతో పురపాలికల్లో వైకుంఠధామాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవసరం ఉన్న ప్రాంతాల్లో మృతదేహాల తరలింపునకు వైకుంఠ రథాల ఏర్పాటుకు అవకాశాలపై దృష్టి సారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని