Cell phone : సెల్‌ఫోన్‌ కనిపెట్టాడు.. టిక్‌టాక్‌ గురించి తెలియదన్నాడు!

నిత్యం మనం వాడుతున్న సెల్‌ఫోన్‌ సృష్టికర్త దాని గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 05 Mar 2023 11:04 IST

అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌ టెలిఫోన్‌(telephone) కనిపెట్టాడని చాలా మందికి తెలుసుంటుంది. ఇప్పుడు టెలిఫోన్‌ వాడకం బాగా తగ్గింది. పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరి చేతుల్లోనూ సెల్‌ఫోనే(cell phone) ఉంది. మరి ఆ సెల్‌ఫోన్‌ ఎవరు కనిపెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనే మార్టిన్‌ కూపర్. ‘ఫాదర్‌ ఆఫ్‌ ద సెల్‌ఫోన్‌’గా ఖ్యాతి గడించారు.

ఎవరీ మార్టిన్‌ కూపర్‌?

మార్టిన్‌ కూపర్‌ 1928లో చికాగో(chicago)లో జన్మించారు. ఇల్లినాయిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ చదివారు. అనంతరం యూఎస్‌ నేవీలో చేరారు. కొరియా యుద్ధం(Korean War)లో పాల్గొని దేశానికి సేవ చేశారు. ఆ యుద్ధం ముగిసిన తరువాత ఆయన టెలిటైప్‌ కార్పొరేషన్‌లో చేరారు. అటు నుంచి 1954లో మోటరోలా(motorola)లో చేరి తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తర్వాతి కాలంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ మాస్టర్స్‌ పట్టా పొందారు. మోటరోలాలో పని చేసే కాలంలో కూపర్‌ ఎన్నో ఆవిష్కరణలు చేశారు. వైర్‌లైస్‌ కమ్యూనికేషన్ల(wireless communication) అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. అందులో రేడియో కంట్రోల్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ కూడా ఒకటి. 1960లో ఆ ఆవిష్కరణకు సంబంధించిన పేటెంట్‌ హక్కును మార్టిన్‌ పొందారు. 1967 నాటికి పోలీసులు(police) చేతితో పట్టుకుని ఉపయోగించేందుకు అనువైన రేడియో కనిపెట్టారు. మెరుగైన పనితీరు కనబర్చడంతో ఆయనకు అనతి కాలంలోనే కంపెనీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ డైరెక్టరు, ఉపాధ్యక్షుడి హోదా దక్కింది.

ముందే కారు ఫోన్లు..

నిజానికి 1946లోనే అమెరికా టెలిఫోన్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌(ఏటీటీ) కంపెనీ కారు ఫోన్లను(car phones) ప్రవేశపెట్టింది. అంటే కార్లకు ఫోన్‌ను అనుసంధానం చేసేవారు. దగ్గర్లోని రేడియో సిగ్నల్‌ సహాయంతో అవి పనిచేసేవి. కానీ, అందులో 11 నుంచి 12 ఛానళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. దాంతో వాటిని ఉపయోగించాలంటే యూజర్లు ఎక్కువ సేపు వేచి చూడాల్సి వచ్చేది. పైగా ఆ ఫోన్లకు ఎక్కువగా విద్యుత్తు అవసరం. వాటిని కారు బ్యాటరీలకు అనుసంధానం చేసేవారు. అందువల్ల వాటిని పోర్టబుల్ ఫోన్‌గా కాకుండా.. కార్‌ ఫోన్‌గానే పరిగణించేవారు. కార్‌ ఫోన్‌ కనిపెట్టడంతో టెలికాం(telecom) రంగంలో చాలా ఏళ్లు ఏటీటీ  ఆధిపత్యమే నడిచింది. ఆ కంపెనీకి అడ్డుకట్ట వేయాలని భావించిన మోటరోలా సెల్‌ఫోన్ల అభివృద్ధికి ఓ కొత్త ప్రాజెక్టును చేపట్టింది. దానికి మార్టిన్‌ కూపర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించింది.

ఫోన్‌ మన వెంట రావాలి!

కొత్త ప్రాజెక్టు చేపట్టిన మార్టిన్‌ తాను తయారు చేయబోయే ఫోన్‌.. డెస్క్‌, ఇల్లు, ప్రదేశం ఇలా ఒక చోట మాత్రమే ఉండకూడదని భావించారు. ఎక్కడికెళ్లినా ఫోన్‌ మన వెంట వచ్చే విధంగా దాన్ని మార్చాలని సంకల్పించారు. ఆ ఆలోచన ఫలితమే ‘డైనమిక్‌ అడాప్టివ్‌ టోటల్‌ ఏరియా కవరేజి’ ఫోన్‌. 23 సెంటీమీటర్ల పొడవైన ఆ ఫోన్‌ 1.1 కేజీ బరువుండేది. 35 నిమిషాలపాటు మాట్లాడేలా దాని బ్యాటరీని రూపొందించారు. ఆ ఫోన్‌ను మార్టిన్‌ కూపర్‌ 1973 ఏప్రిల్‌ 3న మీడియా ముందు ప్రవేశపెట్టారు. దాంతో తమకు పోటీ కంపెనీ ఏటీటీ హెడ్, ఇంజినీర్‌ జోయల్‌ ఏంజెల్‌కు ఫోన్‌ చేశారు. ‘జోయల్‌ నేను మార్టీ.. ఒక పోర్టబుల్‌ సెల్యులార్‌ ఫోన్‌ నుంచి నీతో మాట్లాడుతున్నానని’ సంతోషంగా అవతలి వ్యక్తికి చెప్పి సంచలనం సృష్టించారు. నిజానికి మార్టిన్‌కు పోర్టబుల్ ఫోన్‌ను తయారు చేయాలనే ఆలోచన పత్రికల్లో వచ్చిన ‘డిక్‌ ట్రాసీ’ చేతి గడియారం చూసిన తరువాత వచ్చిందట. 1983 నాటికి పోర్టబుల్‌ ఫోన్‌ను మోటరోలా మరింత అభివృద్ధి చేసి దానికి DynaTAC 8000xగా పేరు పెట్టి మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటికి దాని ఖరీదు 3,995 డాలర్లు. మన భారతీయ కరెన్సీలో రూ.3 లక్షలకు పైగానే ఉంటుంది. అయినా కూడా ఆ ఫోన్‌కు వినియోగదారుల్లో ఆదరణ లభించింది. మార్టిన్‌ కూపర్‌ కృషితో మోటరోలా అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. ఆ మరుసటి ఏడాదే కూపర్‌ మోటరోలాను వీడి సొంతంగా కొన్ని కంపెనీలను స్థాపిస్తూ తన వ్యాపార ప్రయాణం సాగించారు. వైర్‌లైస్‌ రంగం అభివృద్ధిలో మార్టిన్‌ కూపర్‌ సేవలకుగానూ అనేక అవార్డులు వరించాయి. 2013లో ఆయనకు ఛార్లెస్‌ స్టార్క్ డ్రాపర్‌ ప్రైజ్‌ దక్కింది.

వద్దు.. మితిమీరొద్దు

‘ఫాదర్‌ ఆఫ్‌ సెల్‌ఫోన్‌’గా ఖ్యాతిగాంచిన మార్టిన్‌ కూపర్‌ ప్రస్తుతం ప్రపంచం సెల్‌ఫోన్‌ వాడుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల స్పెయిన్‌లో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన సాంకేతికత కారణంగా యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని మార్టిన్‌ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలకు ఎక్కువ మంది బానిసలు కావడం కూడా ఆందోళన కలిగించే అంశమేనని చెప్పారు. యూజర్లు సెల్‌ఫోన్ల వాడకంపై సమయాన్ని తగ్గించి సాధారణ జీవనంపై దృష్టి సారించాలన్నారు. పిల్లలను సెల్‌ఫోన్లకు బానిసలను చేయడం మంచి పద్ధతి కాదన్నారు. గడిచిన దశాబ్దాల్లో మొబైల్‌ రంగం అభివృద్ధిపై పెట్టినంత దృష్టిని.. పరిశోధకులు విద్య, ఆరోగ్యరంగంపై కేటాయిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్‌ కనిపెట్టిన తనకు ఇప్పటికీ చాలా విషయాలు తెలియవని అందులో ‘టిక్‌టాక్‌’ ఒకటని ఆయన చమత్కరించారు.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని