ఏంటీ ‘జూమ్‌’.. ప్రభుత్వం ఎందుకు వాడొద్దు అంటోంది?

జూమ్‌ యాప్‌ ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పాలంటే ఈ రెండు ప్రకటనలు చాలు. దేశంలో లాక్‌డౌన్‌ విధించాక ‘జూమ్‌’ యాప్‌ వినియోగం  ఒక్కసారిగా పెరిగిపోయింది. డౌన్‌లోడ్స్‌ రికార్డులు సృష్టించింది.

Updated : 17 Apr 2020 17:15 IST

‘జూమ్‌’ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ అంత శ్రేయస్కరం కాదు!

- కేంద్ర ప్రభుత్వం

మన కార్యాలయంలో ‘జూమ్‌’ వాడకాన్ని నిషేధిస్తున్నాం!

- గూగుల్‌

జూమ్‌ యాప్‌ ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పాలంటే ఈ రెండు ప్రకటనలు చాలు. దేశంలో లాక్‌డౌన్‌ విధించాక ‘జూమ్‌’ యాప్‌ వినియోగం  ఒక్కసారిగా పెరిగిపోయింది. డౌన్‌లోడ్స్‌ రికార్డులు సృష్టించింది. వీడియో కాన్ఫరెన్స్‌, ఆన్‌లైన్‌ తరగతులు, ప్రెస్‌ మీట్స్‌ ఇలా అన్నీ జూమ్‌తోనే.  అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ‘జూమ్‌’ అంటేనే వామ్మో అనే పరిస్థితి. కారణం డేటా చౌర్యం ఆరోపణలు. అసలు జూమ్‌ వల్ల వస్తున్న ఇబ్బందులేంటి, ప్రభుత్వం ఎందుకు వాడొద్దంటోందో చూద్దాం!

ఏమిటీ జూమ్‌ 

జూమ్‌ గురించి ప్రాథమికంగా చెప్పాలంటే.. ఇది వీడియో కాల్స్‌ చేసుకునే యాప్‌. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, స్కైప్‌, గూగుల్‌ డుయోల్లో ఎలాగైతే వీడియో కాల్స్‌ చేస్తుంటామె అలాగన్నమాట. అయితే ఇందులో అదనపు ఫీచర్లు చాలా ఉంటాయి. మీ స్క్రీన్‌ షేరింగ్‌, కాల్‌ రికార్డింగ్‌ లాంటివి. అంటే మీ మొబైల్‌ / సిస్టమ్‌లో పీడీఎఫ్‌, డాక్స్‌ను జూమ్‌లో మాట్లాడుతూనే షేర్‌ చేయొచ్చు. ఆండ్రాయిడ్‌, యాపిల్‌, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌ వెర్షన్‌ను వాడుకోవచ్చు. జూమ్‌లో ఖాతా ప్రారంభించి... మాట్లాడాలనుకునే వ్యక్తికి జూమ్‌ ఐడీ అనే ఆరెంకల నంబరును ఇవ్వాలి. దాంతో అవతలి వ్యక్తి లాగిన్‌ అయ్యి మీతో మాట్లాడొచ్చు. అలా వందమంది వరకు కనెక్ట్‌ అయ్యి మాట్లాడుకోవచ్చు. ఈ యాప్‌ను విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి పాఠశాలలు కూడా వినియోగిస్తున్నాయి.  

 

అసలు ఏమైంది..

లాక్‌ డౌన్‌ ముందు వరకు జూమ్‌ గురించి ఐటీ ఉద్యోగులకు, కొంతమంది ఎంఎన్‌సీ సంస్థల ఉద్యోగులకు మాత్రమే తెలుసు. లాక్‌డౌన్‌ తర్వాత జూమ్‌ వినియోగం అమాంతం పెరిగిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసేవారు దీనిని ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. కాన్ఫరెన్స్‌, వీడియో క్లాస్‌లు, మీటింగ్‌లు ఇలా అన్నీ జూమ్‌లోకి వచ్చాయి. అప్పుడే ఇందులో డేటా అంత సేఫ్‌ కాదని వార్తలొచ్చాయి. లాగిన్‌ వివరాలు లాంటివి అగంతుకుల చేతిలోకి వెళ్లిపోతున్నాయని సైబర్‌ భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. ఆ తర్వాత పెద్ద పెద్ద సంస్థలు దీని వినియోగాన్ని నిషేధించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా అదే దారిలో అధికారులు వాడొద్దంటూ సూచించింది.

 

సింగపూర్‌లో జరిగిందిదీ...

ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించడానికి సింగపూర్‌లో విద్యాసంస్థలు జూమ్‌ను వినియోగించేవి. ఈ సమయంలో హ్యాకర్లు జూమ్‌ యాప్‌/సర్వీస్‌ను హ్యాక్‌ చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులు అందించే పవర్‌ పాయింట్‌ ప్రెజంటెషన్లు, నోట్స్‌ లాంటి కంటెంట్‌ కాకుండా అశ్లీల కంటెంట్‌ కనిపించేలా చేశారు. దీంతో జూమ్‌ సర్వర్లు హ్యాక్‌ అయ్యాయని గుర్తించారు. అలాగే ఇతర దేశాల్లో ముఖ్యమైన మీటింగ్స్‌ జరిగేటప్పుడు హ్యాకర్లు దాడి చేసి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారని తెలుస్తోంది. అవే ఇప్పుడు డార్క్‌ వెబ్‌లో అందుబాటులో ఉన్నాయి.

 

అన్ని ఉన్నాయా...

‘‘జూమ్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అంత భద్రం కాదు’’ అంటూ వార్తలొస్తున్న సమయంలోనే  ఓ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ బాంబు లాంటి వార్త చెప్పింది. బ్లీపింగ్‌ కంప్యూటర్ అనే సంస్థ చెప్పిన వివరాల ప్రకారం... ఐదు లక్షల మంది జూమ్‌ వినియోగదారుల డేటా లీక్‌ అయ్యింది.  నెటిజన్ల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకాలకు పెట్టే డార్క్‌ వెబ్‌లో ఐదు లక్షల మంది జూమ్‌ యూజర్ల డేటా అమ్మకానికి సిద్ధంగా ఉందని బ్లీపింగ్‌ కంప్యూటర్‌ చెప్పింది. 

 

ప్రభుత్వం ఏమంటోంది..

జూమ్‌ వినియోగం పెరగడం, దానిపై వస్తోన్న చౌర్యం ఆరోపణలు గురించి ప్రభుత్వం ఇటీవల దృష్టి సారించింది. భారత్‌లోని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ - ఐఎన్‌) దీని గురించి పరిశోధనలు చేసింది. జూమ్‌ వాడకం వల్ల యూజర్‌ మీద సైబర్‌ అటాక్స్‌ జరిగే అవకాశం ఎక్కువని తేల్చింది. వినియోగదారుని వ్యక్తిగత సమాచారానికి జూమ్‌లో భద్రత లేదని సీఈఆర్‌టీ స్పష్టం చేసింది.  దీంతో జూమ్‌ను వినియోగించొద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు వినియోగించుకోవడానికి కొన్ని సూచనలు కూడా చేసింది.

 

ఎవరెవరు నిషేధించారు...

జూమ్‌ వినియోగాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు నిషేధించాయి. సమాచార భద్రత లేదంటూ ఈ మేరకు ఉద్యోగులకు సూచించాయి.  జూమ్‌ బదులు డుయో సర్వీసును వాడమని గూగుల్‌ తమ ఉద్యోగులకు ఆదేశించింది. జూమ్‌ వాడకాన్ని నిషేధించిన బ్యాంకుల్లో స్టాండర్డ్‌ చార్టడ్‌ బ్యాంకు మొదటిది. స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అధిపతి ఎలాన్‌ మస్క్‌ తమ సంస్థలో ‘జూమ్‌’ వినియోగాన్ని నిలిపేశాడు.  తైవాన్‌, జర్మన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ, ఆస్ట్రేలియా రక్షణ దళం, నాసా, యునైటెడ్‌ స్టేట్స్‌ సెనేట్‌ జూమ్‌ వాడకాన్ని ఆపేశాయి. సింగపూర్‌, న్యూయార్క్‌లోని పాఠశాలలో జూమ్‌ వాడకాన్ని నిషేధించారు. 

 

మధ్యలోనే తస్కరిస్తారు...

జూమ్‌లో జరిగే వీడియో కాల్‌/ కాన్ఫరెన్స్‌ డేటా అన్‌ ఇన్‌క్రిప్టడ్‌గా సర్వర్లు మారుతూ అవతలి వ్యక్తికి చేరుతుంది. ఇలా టెక్ట్స్‌ రూపంలో ట్రాన్స్‌మీట్‌ అయినప్పుడు... మధ్యలో ఎవరైనా హ్యాకర్లు మీ చర్చల సారాంశాన్ని తస్కరించవచ్చు. చైనాలో ఉండే సర్వర్ల ద్వారానే ఈ డేటా ట్రాన్స్‌మిషన్‌ జరుగుతోంది.  అయితే ఉచిత అకౌంట్‌ వాడేవాళ్లకు చైనాలో ఉండే సర్వర్ల ద్వారా సేవలు అందుతాయి. కాబట్టి ఆ దేశ ప్రభుత్వం మన డేటాను యాక్సెస్‌ చేసే అవకాశమూ ఉంది.

- నల్లమోతు శ్రీధర్‌, ప్రముఖ సైబర్‌ నిపుణుడు

 

జూమ్‌ ఏమంటోంది...

డేటా చౌర్యం గురించి జూమ్‌ యాజమాన్యం స్పందించింది. జూమ్‌ మీద వస్తోన్న ఆరోపణల దృష్ట్యా జూమ్‌ సీఈవో ఎరిక్‌ ఎస్‌ యువాన్‌ ఈ నెల మొదట్లో క్షమాపణలు చెప్పారు. యాప్‌ అప్‌డేట్స్‌ కార్యక్రమాలను పక్కనపెట్టి యాప్/సర్వీసులో భద్రత పెంచే దిశగా పనులు ప్రారంభించామని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని బగ్స్‌ / ఇష్యూలు ఫిక్స్‌ చేసి అప్‌డేట్స్‌ విడుదల చేసింది. 

పాస్‌వర్డ్‌ క్రియేషన్‌లో మార్పులు చేసింది. పాస్‌వర్డ్‌ పొడవును పెంచింది. మీటింగ్‌ ఐడీల విషయంలోనూ మార్పులు చేసింది. మీటింగ్‌ ఐడీల్లో క్లిష్టత పెంచి... ఇతరులు అంచనా వేయకుండా చేశామని చెప్పింది. గతంలో 9 అంకెలున్న ఐడీ.. ఇప్పుడు 11 అంకెలకు మార్చింది. కాన్ఫరెన్స్‌ రికార్డింగ్స్‌ను బాక్స్‌, డ్రాప్‌బాక్స్‌, వన్‌డ్రైవ్‌ లాంటి క్లౌడ్‌ సర్వీసుల్లో సేవ్‌ చేసుకునే ఆప్షన్‌ను డిజేబుల్‌ చేసింది. కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నప్పుడు పైన ఐడీ కనిపించకుండా... జూమ్‌ కొన్ని మార్పులు చేసింది. పెయిడ్‌ యూజర్లు ఏ సర్వర్‌ ద్వారా కాన్ఫరెన్స్‌ జరగాలో నిర్ణయించుకునే ఆప్షన్‌ కూడా తీసుకొచ్చారు. 

 

‘ప్రైవేటు’కు సూచనలివే...

ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు జూమ్‌ని ఇంకా వినియోగించాలనుకుంటే ఈ సూచనలు పాటించాలని కేంద్రం కోరింది. 

* ప్రతి మీటింగ్‌కి కొత్తగా యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ను సెట్‌ చేసుకొండి. 

* జూమ్‌ సెట్టింగ్స్‌లో వెయిటింగ్‌ రూమ్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోండి. ఐడీతో ఎంటర్‌ అయినవాళ్లను అడ్మిన్‌ (మీటింగ్‌ను ప్రారంభించిన వ్యక్తి) ఒకసారి పరిశీలించి అప్పుడు జూమ్‌ కాన్ఫరెన్స్‌కి యాక్సెప్ట్‌ చేస్తారు.

* కాన్ఫరెన్స్‌ / మీటింగ్‌ ప్రారంభానికి ముందే ఇతరులు జాయిన్‌ అవ్వకుండా... చూసుకోండి. దీని కోసం సెట్టింగ్స్‌లో ఓ ఆప్షన్‌ ఉంది.

* స్క్రీన్‌ షేరింగ్‌ను కేవలం హోస్ట్‌/ అడ్మిన్‌ చేసేలా మార్పులు చేసుకోవాలి.

* ఒకసారి కాన్ఫరెన్స్‌ నుంచి తొలగించిన వ్యక్తి మళ్లీ జాయిన్‌ అవ్వకుండా ఆ ఆప్షన్‌ను యాప్‌ సెట్టింగ్స్‌లో డిజేబుల్‌ చేసుకోవాలి. 

* ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోవడం మంచిది కాదు. డీఫాల్ట్‌గా డిజేబుల్‌లో పెట్టుకోవాలి.

* మీటింగ్‌ / కాన్ఫరెన్స్‌ కోసం మీరు ఆహ్వానించిన వారందరూ జాయిన్‌ అయ్యాక మీటింగ్‌ను లాక్‌ చేయండి.

* మొత్తం కాన్ఫరెన్స్‌ రికార్డ్‌ చేసుకునే ఆప్షన్‌ను  డిజేబుల్‌ చేయండి.

* మీటింగ్‌ అయిపోయాక.. యాప్‌/సర్వీసును క్లోజ్‌ చేయకుండా... ‘ఎండ్‌ మీటింగ్‌’ బటన్‌ను క్లిక్‌ చేసి కన్ఫర్మ్‌ చేసుకొని అప్పుడు క్లోజ్‌ చేయండి. 

 

ఇలాంటివి ఇంకేమున్నాయ్‌...

జూమ్‌ వినియోగం పెరిగాక.. ఇప్పుడు వాడటం ఆపేయమంటే ఎలా అనే ప్రశ్న కూడా రావొచ్చు. దానికి ప్రత్యామ్నాయంగా చాలా యాప్స్‌ / సర్వీసులు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌ నుంచి టీమ్స్‌, స్లాక్‌, సిస్కో వెబెక్స్‌,  టీమ్స్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌, జోహో లాంటి యాప్స్‌ / సర్వీసులు ఉన్నాయి. ఇది కాకుండా గూగుల్‌ తన పాత హ్యాంగ్‌అవుట్స్‌ మీట్‌ను ‘గూగుల్‌ మీట్‌’ పేరుతో కొన్ని మార్పులు చేసి తీసుకురాబోతోంది. 

 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని