ఇస్రో శాస్త్రవేత్త గొప్ప మనసు.. రూ.25 లక్షల నగదు సత్కారాన్ని విరాళంగా!

చంద్రయాన్‌-3 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పీ వీరముత్తువేల్‌ తన దాతృత్వ గుణాన్ని చాటి.. ఎంతో మందికి స్ఫూర్తివంతంగా నిలిచారు. తాను అందుకున్న నగదు బహుమతిని పూర్వ విద్యార్థుల సంఘాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Published : 11 Nov 2023 02:12 IST

బెంగళూరు/చెన్నై: చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయం తర్వాత భారత్ సహా అంతర్జాతీయ సమాజం ఇస్రో (ISRO) శాస్త్రవేత్తల పనితీరును ప్రశంసించింది. ఒకానొక సమయంలో ప్రభుత్వం వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, జీతభత్యాలపై కూడా తీవ్రంగా చర్చ జరిగింది. వీటన్నింటినీ పక్కనపెడితే ఇస్రో శాస్త్రవేత్త అయిన పి వీరముత్తువేల్‌ (Dr P Veeramuthuvel) తాజాగా వార్తలకెక్కారు. చంద్రయాన్‌-3కు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆయన.. తన దాతృత్వ గుణం చాటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 

చంద్రయాన్‌-3 ప్రాజెక్ట్ విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించిన ఎనిమిది మంది శాస్త్రవేత్తలకు తమిళనాడు ప్రభుత్వం సత్కరించింది. ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు నగదు బహుమానం అందజేసింది. ఆ మొత్తాన్ని వీరముత్తవేల్‌ తాను చదువుకున్న విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల సంఘాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విల్లుపురంలోని ఎలుమలై పాలిటెక్నిక్‌ కళాశాల, తిరుచ్చిలోని శ్రీ సాయిరామ్‌ ఇంజనీరిగ్‌ కళాశాల, ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థుల సంఘాలకు రూ.25 లక్షల మొత్తాన్ని వీరముత్తువేల్‌ సమానంగా ఇవ్వాలనుకుంటున్నట్లు భారత అంతరిక్ష విభాగం అదనపు కార్యదర్శి సంధ్య వేణుగోపాల్‌ శర్మ తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు.

‘‘నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. విల్లుపురంలోని రైల్వే పాఠశాలలో చదివాను. డబ్బు గురించి నాకు పెద్దగా అర్థం కాదు. దేశాభివృద్ధి కోసం పనిచేసే గొప్ప అవకాశాన్ని ఇస్రో ఇవ్వడమే నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. చంద్రయాన్‌ విజయంలో ‘నా’ పాత్ర కంటే.. ‘మా’ పాత్రే ఎక్కువగా ఉంది. ఇది సమష్ఠి కృషి. ఇంత పెద్ద మొత్తం నగదును నేను ఒక్కడినే అవార్డుగా స్వీకరించేందుకు నా మనస్సు అంగీకరించడంలేదు. అందుకే ఈ మొత్తాన్ని పూర్వ విద్యార్థుల సంఘాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా’’ అని వీరముత్తువేల్‌ తెలిపారు. 

ఇస్రో శాస్త్రవేత్తగా నెలకు రూ.లక్ష జీతం అందుకుంటున్న తనకు హోంలోన్‌ రూ.72 లక్షలు ఉన్నప్పటికీ.. సత్కారం ద్వారా వచ్చిన రూ.25 లక్షల మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమానికి ఇవ్వడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని వీరముత్తువేల్ చెప్పినట్లు ఒక జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. వీరముత్తువేల్‌తో పాటు రూ.25 లక్షలు నగదు సత్కారం అందుకున్న యూఆర్‌ రావ్ శాటిలైట్‌ సెంటర్‌ (URSC) డైరెక్టర్‌ ఎమ్‌ శంకరన్‌ కూడా ఆ మొత్తాన్ని తాను చదువుకున్న కళాశాల పూర్వ విద్యార్థుల సంఘాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని