West Bengal: బెంగాల్‌లో మళ్లీ నోట్ల కట్టల కలకలం.. TMC ఎమ్మెల్యే ఇంట్లో రూ.11కోట్లు

బెంగాల్‌ (West Bengal)లో ఓ టీఎంసీ నేత ఇంట్లో ఐటీ శాఖ జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున నగదు బయటపడింది. ఆయన ఇల్లు, ఫ్యాక్టరీల్లో రూ.11కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 12 Jan 2023 16:46 IST

(ప్రతీకాత్మక చిత్రం)

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC)కు చెందిన ఓ ఎమ్మెల్యే ఇళ్లు, ఫ్యాక్టరీలపై ఆదాయపు పన్ను (IT Dept) శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపుతోంది. మొత్తం రూ.11కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మాజీ మంత్రి, టీఎంసీ (TMC) ఎమ్మెల్యే జాకీర్‌ హొస్సేన్‌ నివాసం, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు (IT Raids) చేశారు. బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము 3.30 గంటల వరకు కోల్‌కతా, ముర్షిదాబాద్‌లోని దాదాపు 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. జాకీర్‌ ఇళ్లు, ఆయన బీడీ ఫ్యాక్టరీ, నూనె మిల్లు, రైస్‌మిల్లుల్లో జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలను ఐటీ అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.11కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. ముర్షిదాబాద్‌లోని మరో రెండు బీడీ తయారీ యూనిట్లలోనూ రూ.5.5కోట్ల నగదును గుర్తించారు. అయితే ఈ యూనిట్లు ఎవరివన్నది అధికారులు వెల్లడించారు.

ఈ మొత్తం లెక్కల్లో చూపించిన ఆదాయమా లేదా అన్నదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడులపై జాకీర్‌ స్పందించారు. ఆ డబ్బుకు తనవద్ద అన్ని పత్రాలు ఉన్నాయని తెలిపారు. తన ఫ్యాక్టరీలు, మిల్లుల్లో 7వేల మంది కూలీలు పనిచేస్తున్నారని, వారికి జీతం ఇచ్చేందుకే ఈ నగదును ఉంచినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈ వ్యవహారం నేపథ్యంలో టీఎంసీపై భాజపా విమర్శలు గుప్పిస్తోంది. దీంతో రాష్ట్ర మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ స్పందిస్తూ.. ‘‘ఆ డబ్బు లెక్కల్లో చూపించిందా లేదా అన్నది ఆలోచించాలి. దీనిపై మేం మాట్లాడదల్చుకోలేదు. అయితే జాకీర్‌ సంపన్న వ్యాపారవేత్త. ఆయన కింద చాలా మంది ఉద్యోగం చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.

గతేడాది టీఎంసీ నేత పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన నివాసాల్లో పెద్ద ఎత్తున నోట్ల గుట్టలు బయటపడిన ఘటన బెంగాల్‌ రాజకీయాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలుమార్లు అక్కడ టీఎంసీ నేతల ఇళ్లల్లో అధికారులు సోదాలు జరిపి కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ దాడులను టీఎంసీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని దుయ్యబట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని