
WHO: కలిసికట్టుగా పనిచేస్తేనే.. మహమ్మారికి ముగింపు: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య అసమానతలను తొలగించి కలిసికట్టుగా పనిచేస్తే.. 2022లోనే ఈ మహమ్మారి అంతమవుతుందని అభిప్రాయపడ్డారు. ‘మహమ్మారి నుంచి ఏ దేశమూ బయటపడలేదు. అయితే కొవిడ్ కట్టడికి, చికిత్సకు అనేక నూతన సాధనాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు దేశాల మధ్య అసమానతలు కొనసాగితే.. మనం నియంత్రించలేనంతగా, కనీసం అంచనా వేయలేనంతగా వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. అసమానతలకు ముగింపు పలికితేనే.. ఈ మహమ్మారిని అంతం చేయగలుగుతాం. కొవిడ్-19 మహమ్మారి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగు పెడుతున్న క్రమంలో.. ఈ సంవత్సరంలోనే దానికి ముగింపు ఉంటుందని భావిస్తున్నా. కానీ, మనం కలిసికట్టుగా పోరాడితేనే అది సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో ప్రపంచం ఎదుర్కోబోయేది కరోనా ముప్పు ఒక్కటే కాదని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు లక్షలాది ప్రజలు సాధారణ వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ సేవలు, పలు అంటువ్యాధులు, ఇతర వ్యాధులకు చికిత్సలకు దూరమయ్యారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్ను పెద్దఎత్తున అందించాలని కోరారు. అత్యవసరంగా, పెద్దఎత్తున వ్యాక్సినేషన్ చేపడితే.. ప్రతి ఏటా వేలాది ప్రాణాలు కాపాడగలుగుతామని సూచించారు.
‘పోలియో నిర్మూలనలో ఇంకా పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. రెండు దేశాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. ఎబోలా, మార్బుర్గ్ వంటి ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్లపై మా భాగస్వామ్య సంస్థలు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఎదురయ్యే అంటువ్యాధులు, మహమ్మారులను కట్టడి చేసేందుకు కొత్త బయోహబ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. బెర్లిన్లో పాండమిక్, ఎండమిక్ ఇంటెలిజెన్స్ హబ్ను ప్రారంభించాం. ప్రజారోగ్యంపై కొత్త ఆవిష్కరణల కోసం ఇది ఉపయోగపడుతుంది’ అని వెల్లడించారు. 2022 మధ్య నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించే లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు.