Supreme Court: సంపదపై దురాశే.. అవినీతిని క్యాన్సర్‌లా మారుస్తోంది..!

కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు అవినీతికి (Corruption) పాల్పడటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సంపదపై దురాశే అవినీతి అనేది క్యాన్సర్‌గా వృద్ధి చెందడానికి దోహదం చేసిందని (Supreme Court) వ్యాఖ్యానించింది.

Published : 03 Mar 2023 15:28 IST

దిల్లీ: సంపదపై దురాశే అవినీతిని (Corruption) ప్రోత్సహిస్తూ క్యాన్సర్‌గా వృద్ధి చెందడానికి దోహదపడిందని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు అవినీతిని ఏమాత్రం సహించకూడదని.. దేశ ప్రజల తరఫున బాధ్యతగా ఉంటూ ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేసింది. రాజ్యాంగ పీఠిక హామీ ఇచ్చినట్లుగా ప్రజలకు సామాజిక న్యాయం కల్పించడంలో అవినీతి అనేది తీవ్ర అవరోధంగా మారుతోందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

‘సంపద అందరికీ సమానంగా అందాలనే రాజ్యంగ పీఠిక సమన్యాయ హామీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. అందుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ దాన్ని సాధించడానికి ప్రధాన అవరోధం మాత్రం అవినీతే. అనారోగ్యమనే ఈ అవినీతి.. కేవలం పాలనా రంగానికే పరిమితం కాలేదు. దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో రూపంలో భాగమైందని పౌరులే చెప్పే స్థాయికి చేరింది. దీని మూలాలపై పెద్దగా చర్చ చేయడం అవసరం లేనప్పటికీ.. సంపదపై దురాశ అనేది అవినీతి క్యాన్సర్‌గా వృద్ధి చెందేందుకు దోహదం చేస్తోంది’ అని అవినీతికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. ప్రజాసేవలో ఉన్నవారిలో కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెంపర్లాడటంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి అమన్‌ సింగ్‌, ఆయన భార్యపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం.. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. ఈ సందర్భంగా కొన్ని కుంభకోణాలను ప్రస్తావించిన సుప్రీం కోర్టు.. వాటిపై దర్యాప్తు జరుగుతోన్న తీరు బాధ కలిగిస్తోందని అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని