Ayodhya: బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా: రామ్‌చరణ్‌

అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ పై సినీ తారలు స్పందించారు. 

Updated : 22 Jan 2024 11:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సినీ తారలు అయోధ్యకు పయనమైన విషయం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి - సురేఖ దంపతులు, రామ్‌చరణ్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో రామ్‌చరణ్‌ (Ram Charan) మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఈ మహత్తర కార్యంలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందడంపై చిరంజీవి (Chiranjeevi) ఆనందం వ్యక్తం చేశారు. ‘‘చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఇందులో భాగస్వామికావడాన్ని అరుదైన అవకాశంగా భావిస్తున్నా. నేను ఆంజనేయుడి భక్తుడిని. ఆయనే స్వయంగా నాకు ఆహ్వానం పంపించినట్లు అనిపించింది’’ అని అన్నారు.

‘‘రామ మందిరానికి వెళ్లే ముందు హనుమంతుడిని దర్శించుకోవడం ముఖ్యం. అయోధ్యలో వాతావరణం రమణీయంగా ఉంది. ఎక్కడ చూసినా ‘జై శ్రీరామ్’ నినాదం మార్మోగుతోంది. దీపావళి మళ్లీ వచ్చినట్లుంది’’ అని బాలీవుడ్‌ నటుడు అనుపమ్ ఖేర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘ఇది చరిత్రాత్మక రోజు. అంతటా ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. శ్రీరాముడు అయోధ్యకు వస్తున్నాడని నినదించే శతకోటి స్వరాల్లో నేను భాగమైనందుకు గర్విస్తున్నా’’ అని నటి జెనీలియా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని