KGF: కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీయఫ్‌) కథ.. నిజమేనా..?

కేజీయఫ్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలివే

Published : 11 Apr 2022 02:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భూమిలో దాగున్న బంగారాన్ని బయటకు తీసేందుకు కార్మికులు పడే కష్టాన్ని, ఆ బంగారు సామ్రాజ్యానికి అధిపతి అయ్యేందుకు కొంతమంది వ్యక్తులు చేసే అలుపెరగని పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీయఫ్‌’. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో యశ్‌ కీలకపాత్ర పోషించారు. మరికొన్ని రోజుల్లో ‘కేజీయఫ్‌-2’ ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ‘కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌’ (కేజీయఫ్‌)గా ప్రాచుర్యం పొందిన ఈ ప్రాంతం, దాని చరిత్ర గురించి తెలుసుకుందాం.

‘కేజీయఫ్‌’ ఎక్కడ..?

‘కేజీయఫ్‌’ అంటే కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. కోలార్‌ నగరానికి 30 కిలోమీటర్లు, బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ గోల్డ్‌ ఫీల్డ్స్‌ ఉన్నాయి. సుమారు 100 సంవత్సరాలపాటు ఆ ప్రాంతంలో బంగారం కోసం తవ్వకాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. వరుస తవ్వకాలతో బంగారు గనులు అంతరించిపోవడంతో 2001 నుంచి ఇక్కడ తవ్వకాలను పూర్తిగా నిలిపివేశారు.

ఎలా బయటకు వచ్చింది..?

కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే కోలార్‌లో బంగారు గనులు ఉన్నట్లు తెలుస్తోంది. కైవర గంగాస్‌, కోలార్‌ గంగాస్‌, చోళులు, విజయనగర రాజులు ఇలా ఎంతోమంది కర్ణాటకను పరిపాలించిన అనంతరం అధికారంలోకి వచ్చిన టిప్పు సుల్తాన్‌ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశాడు. ఆంగ్లేయులతో జరిపిన పోరాటంలో ఆయన కన్నుమూసిన తర్వాత మైసూర్‌ ప్రాంతం బ్రిటిష్‌ వారి వశమైంది. అదే సమయంలో బ్రిటిష్‌ గవర్నర్‌ జాన్‌ వారెన్‌.. కోలార్‌ మట్టిలో బంగారం ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని ఆయన ఓ పుసక్తంలోనూ రాసుకొచ్చారు. బంగారాన్ని వెలికి తీయాలని ఆ పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్థుల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టాడు. ఎక్కువ మొత్తంలో మట్టిని సేకరించి పరిశీలించగా.. అందులో అతి తక్కువ మొత్తంలో బంగారం ఉందని, ఇది ఒక వృథా ప్రయత్నమేనని భావించి మధ్యలోనే తన మిషన్‌ని నిలిపివేశాడు. 1850 తర్వాత లావెల్లీ అనే ఓ బ్రిటిష్‌ అధికారి వారెన్‌ రాసిన పుస్తకాన్ని చదివి బంగారు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడున్న మైసూర్‌ రాజుల నుంచి గనుల తవ్వకాలకు సంబంధించి అనుమతులు తీసుకున్నాడు. కాలక్రమంలో జాన్‌ టేలర్‌ కంపెనీ చొరవతో కోలార్‌లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. తవ్వకాలకు అవసరమైన విద్యుత్‌ కోసం ఓ భారీ పవర్‌ ప్లాంట్‌ని సైతం ఇక్కడ నిర్మించారు. 30,000 మంది కార్మికులు ఈ ఫీల్డ్స్‌లో పని చేశారు. ఏళ్లు గడిచే కొద్దీ బంగారు గనులు అంతరించిపోవడంతో ఆ ప్రాంతంలో తవ్వకాలను ప్రభుత్వం (2001) పూర్తిగా నిలిపివేసింది.

సినిమా రియల్‌ కాదు కానీ..!

‘కేజీయఫ్‌’ పేరుతో ప్రశాంత్‌నీల్‌ రూపొందించిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందర్నీ ఎంతగానో ఆకర్షించింది. ఒక రీజనల్‌ ఫిల్మ్‌గా విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. బంగారు గనుల ప్రాంతాన్ని దక్కించుకోవడం కోసం పలువురు వ్యక్తుల మధ్య జరిగిన పోరాటాలను, అందులో పనిచేసే కార్మికుల చీకటి జీవితాలను ఈ సినిమాలో ప్రశాంత్‌నీల్‌ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత.. ‘కేజీయఫ్‌’ గురించి అందరూ సెర్చ్‌ చేయడం ప్రారంభించారు. ‘కేజీయఫ్‌’లో గతంలో ఇలాంటి పరిస్థితులే ఉండేవా? అని చర్చించుకున్నారు. దీనిపై ఓ సందర్భంలో చిత్రబృందం స్పందిస్తూ ఇది కేవలం కల్పిత కథేనని.. ఆనాటి కేజీయఫ్‌కు సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉండగా, గరుడ మరణం తర్వాత ‘నరాచీ’లో ఆధిపత్యం సొంతం చేసుకున్న రాఖీబాయ్‌.. ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అనేది ‘కేజీయఫ్‌-2’లో చూపించనున్నారు. ఈసినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని