Naveen Polishetty: అందుకే నేను ‘బిగ్‌బాస్’ హౌస్‌లో ఉండలేదు: నవీన్‌ పొలిశెట్టి

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో నవీన్‌ ‘బిగ్‌బాస్‌’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు.

Published : 04 Sep 2023 19:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కొత్త చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr PoliShetty) ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty). రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు సందర్శించి అభిమానులను కలుసుకోవడంతోపాటు టీవీ కార్యక్రమాల వేదికగా ఈ సినిమా విశేషాలు పంచుకుంటున్నారాయన. ఈ క్రమంలోనే.. ‘బిగ్‌బాస్‌ తెలుగు 7’ రియాల్టీ షోకు ఆయన హాజరయ్యారు. ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఆదివారం గ్రాండ్‌గా లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే. అతిథిగా వెళ్లిన నవీన్‌ను 15వ కంటెస్టెంట్‌గా ప్రకటించి, ఆయన్ను హౌస్‌లోకి పంపించి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు నాగ్‌. అయితే, నవీన్‌ అక్కడి నుంచి వచ్చేశారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ‘మీరెందుకు అక్కడ ఉండలేదు?’ అని ఓ విలేకరి  ప్రశ్నించగా ‘మా సినిమాకి సంబంధించి మిగిలిన ప్రచారం ఎవరు చేస్తారండీ..’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

‘బిగ్‌బాస్‌ సీజన్‌-7’ కంటెస్టెంట్స్‌.. పూర్తి జాబితా ఇదే!

ఆ షోలోనే నాగార్జునను తొలిసారి కలిశానని, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమా ట్రైలర్‌ని ఆయన బాగా ఎంజాయ్‌ చేశారని నవీన్‌ తెలిపారు. హీరోయిన్‌ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రస్తుతం సిటీలో లేరని, అందుకే ప్రచారంలో పాల్గొనడం లేదని చెప్పారు. అనుష్క పాల్గొన్న ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో అతి త్వరలోనే వస్తుందన్నారు. ‘అనగనగా ఒక రాజు’ సినిమా దర్శకుడి మార్పుపై స్పందిస్తూ.. దానికి ‘జాతి రత్నాలు’ ఫేమ్‌ అనుదీప్‌ కేవీ దర్శకత్వం వహిస్తున్నారనే రూమర్స్‌లో నిజంలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన ఫోకస్‌ మొత్తం తెలుగు సినిమాల్లో నటించడంపైనే ఉందని, మంచి కథ కుదిరితే మరోసారి బాలీవుడ్‌లో నటిస్తానన్నారు. దర్శకుడు పి. మహేశ్‌బాబు తెరకెక్కించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’లో నవీన్‌ స్టాండప్‌ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా కనిపించనున్నారు. సెప్టెంబరు 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని