Nayanthara: విఘ్నేశ్‌ నన్నెప్పుడూ ప్రశ్నించలేదు.. నయనతార ఎమోషనల్‌ స్పీచ్‌

ప్రతి విషయంలోనూ భర్త అండ లభిస్తోందని నయనతార చెప్పారు. ప్రైవేట్‌ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated : 11 Jan 2024 12:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తన భర్త విఘ్నేశ్‌ శివన్‌పై నయనతార (Nayanthara) ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఒక ప్రైవేట్‌ కార్యక్రమానికి ఈ జంట హాజరైంది. అక్కడ నయనతార మాట్లాడుతూ ఓ దశలో భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని మనం విన్నాం. కానీ, విజయవంతమైన, సంతోషంగా ఉన్న స్త్రీ వెనుక పురుషుడు కచ్చితంగా ఉంటాడు. నేనే దీనికి ఉదాహరణ. ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. ఆ సినీ ప్రయాణంలో విఘ్నేశ్‌ను (Vignesh Shivan) కలిశాను. నాటి నుంచి నేను ఆనందంగా ఉన్నాను. ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉంటూ ప్రోత్సాహిస్తున్నాడు. నా నిర్ణయాలను ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఎన్నో పనుల్లో నాకు ధైర్యాన్నిస్తూ నడిపిస్తున్నాడు. ఏదైనా చేయగలను అనే నమ్మకాన్ని కల్పించాడు’ అంటూ అతడికి ధన్యవాదాలు తెలిపారు.

సినిమాల విషయానికొస్తే.. తాజాగా ‘అన్నపూరణి’తో పలకరించారు నయనతార. నీలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి స్పందనను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘టెస్ట్‌’ సినిమాతో బిజీగా ఉంది. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌. శశికాంత్‌ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘కుముధ’ అనే పాత్రలో నయనతార కనిపించనున్నారు. తాజాగా ఇందులో తన షెడ్యూల్‌ని కూడా పూర్తిచేసుకున్న ఆమె ఎక్స్‌లో ఈ చిత్రంపై పోస్ట్‌ పెట్టారు. ‘కుముధ...నా జీవితంలోకి ఓ పాత్రలా వచ్చినందుకు ధన్యవాదాలు. దీన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రం ద్వారా మా ప్రేమను చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని