Telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

upcoming movies in telugu: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలివే!

Published : 14 Mar 2022 10:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  వేసవి సినిమాల సందడి షురూ అయింది. వరుస సినిమాలు బాక్సాఫీస్‌ క్యూ కడుతున్నాయి. రెండు వారాలకు ఒక పెద్ద సినిమా విడుదలయ్యేలా దర్శక-నిర్మాతలు షెడ్యూల్‌ పెట్టుకున్న నేపథ్యంలో మధ్యలో చిన్న సినిమాల సందడి చేస్తున్నాయి.  మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలేంటో చూసేద్దామా!

పునీత్‌ చివరి చిత్రం ‘జేమ్స్‌’

న్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం ‘జేమ్స్‌’(James). చేతన్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. కిశోర్‌ పత్తికొండ నిర్మాత. పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగు కథానాయకుడు శ్రీకాంత్‌ ముఖ్యభూమిక పోషించిన ఈ సినిమాని ఆయనే విజయ్‌.ఎమ్‌తో కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇందులో ఓ ఆర్మీ అధికారిగా కనిపిస్తారు. శ్రీకాంత్‌ (Srikanth)ప్రతినాయకుడిగా  నటించారు.  శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, ప్రియా ఆనంద్‌, శరత్‌కుమార్‌, ముఖేష్‌ రుషి తదితరులు  ఈ చిత్రంలో నటించారు.


నవ్వించేందుకు సిద్ధమైన రాజ్‌ తరుణ్‌

రాజ్‌తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. కూర్చుంది చాలు.. అనేది ఉపశీర్షిక. శాంటో మోహన్‌ వీరంకి దర్శకుడు. నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగలూరి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 18న విడుదల కానుంది.  జీవితంలో ఏ విషయానికి కూడా నించోడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్‌ కమెడియన్‌గా మారతాడు. ఆ యువకుడికి నిజమైన ప్రేమ ఎదురైనప్పుడు ఏం జరిగింది? తన తల్లిదండ్రులు, ప్రేమ, స్టాండప్‌ కామెడీ కోసం ఎలా కష్టపడాల్సి వచ్చింది? అన్నదే ఈ చిత్ర కథాంశం. కుటుంబంతో కలిసి వచ్చి.. రెండు గంటలు హాయిగా ఆస్వాదించేలా సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం తెలిపింది.


‘నల్లమల’లో ఏం జరిగింది?

బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ప్రవేశించింది. మరి ఆ మృగం అడవిలోకి ప్రవేశించాక ఏం జరిగిందన్నది తెలియాలంటే మా ‘నల్లమల’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు రవి చరణ్‌. అమిత్‌ తివారి, భానుశ్రీ జంటగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. ఆర్‌.ఎమ్‌ నిర్మాత. నాజర్‌, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్‌, కాలకేయ ప్రభాకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  ఇప్పటికే విడుదల పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ‘ఏమున్నావే పిల్ల’పాటకు యువత ఫిదా అయింది.  పి.ఆర్‌ ‘నల్లమల’కు సంగీతం అందించారు.


బాలీవుడ్‌ ‘జిగర్తాండ’

ఇప్పటివరకూ పలు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరించిన అక్షయ్‌కుమార్‌ నటించిన విభిన్న కథా చిత్రం ‘బచ్చన్‌ పాండే’. కృతి సనన్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ నాయికలు. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయనున్నారు.  తమిళంలో ఘన విజయం  సాధించిన ‘జిగర్తాండ’ మూవీకి రీమేక్‌గా ‘బచ్చన్‌పాండే’ తెరకెక్కుతోంది. ఇందులో ఆయన నెగెటివ్‌ రోల్‌లో కనిపిస్తారు. యాక్షన్‌ కామెడీ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దారు. అన్నట్లు ఇదే కథను తెలుగులో వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ ‘గద్దల కొండ గణేశ్‌’గా తెరకెక్కించి బ్లాక్‌ బస్టర్ హిట్‌ కొట్టారు. మరి బాలీవుడ్‌లో ఎలాంటి మార్పులు చేశారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

పాత్రికేయురాలిగా విద్యాబాలన్‌..

బాలీవుడ్‌ ప్రముఖ నటి విద్యాబాలన్‌ పాత్రికేయురాలిగా నటించిన చిత్రం ‘జల్సా’. షెఫాలీ షా, రోహిణి హట్టంగడి, సూర్య కాశీభట్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేశ్‌ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలవుతుంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో మార్చి 18నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలను చూస్తే, విద్యాబాలన్‌ ఇందులో రిపోర్టర్‌గా నటిస్తున్నట్లు అర్థమవుతోంది. భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, విక్రమ్‌ మల్హొత్రా, శిఖా శర్మ, సురేశ్‌ త్రివేణి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు గౌరవ్‌ సంగీతం అందించారు.


పోలీస్‌ ఆఫీసర్‌గా దుల్కర్‌

మలయాళంతో పాటు, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan). ఇప్పటికే ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. తాజాగా రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో దుల్కర్‌ నటించిన చిత్రం ‘సెల్యూట్‌’ (Salute). ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌ వేదికగా మార్చి 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.  ఈ చిత్రంలో దుల్కర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. మరి దుల్కర్‌కు ఎదురైన సమస్య ఏంటి? దాన్ని ఎలా పరిష్కరించాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


ఓటీటీలోకి ‘సెబాస్టియన్‌’

యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం నటించిన సరికొత్త చిత్రం ‘సెబాస్టియన్‌ పీసీ 524’. రేచీకటి సమస్యతో ఇబ్బందిపడే ఓ కానిస్టేబుల్‌ కథతో రూపుదిద్దుకున్న విభిన్న కథాచిత్రమిది. ఎన్నో అంచనాల నడుమ మార్చి 4న విడుదలైన  ఈసినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ వేదికగా మార్చి 18 నుంచి ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సిద్ధారెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. కిరణ్‌కు జోడీగా నువేక్ష నటించారు.


ఓటీటీలో విడుదల కానున్న మరికొన్ని చిత్రాలు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* ఔటర్‌ రేంజ్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 15

* డీప్‌ వాటర్‌ (హాలీవుడ్‌) మార్చి 18

* మాస్టర్‌ (హాలీవుడ్‌) మార్చి 18

జీ5

* బ్లూడీ బ్రదర్‌ (హిందీ సిరీస్‌) మార్చి 18

నెట్‌ఫ్లిక్స్‌

* బాడ్‌ వెగాన్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 16

* రెస్క్యూడ్‌ బై రూబీ (హాలీవుడ్‌) మార్చి 17

* క్రాకౌ మాన్‌స్టర్స్‌ (వెబ్‌సిరీస్‌)మార్చి 18

* టాప్‌ బాయ్‌ (వెబ్‌ సిరీస్‌-2) మార్చి 18

* విండ్‌ ఫాల్‌ (హాలీవుడ్‌) మార్చి 18

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌

* లలితం సుందరమ్‌ (మలయాళం) మార్చి 18

ఆహా

* జూన్‌ (తెలుగు సిరీస్‌) మార్చి 18

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని