Yash: పుట్టినరోజంటేనే భయమేస్తోంది.. అభిమానుల మృతిపై యశ్‌ భావోద్వేగం

కటౌట్‌ ఏర్పాటు చేస్తూ మృతి చెందిన అభిమానుల కుటుంబాలను యశ్‌ (yash) ఓదార్చారు. పుట్టినరోజు వస్తుందంటేనే తనకు భయమేస్తోందని ఆయన అన్నారు.

Published : 09 Jan 2024 10:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో యశ్‌ (yash) పుట్టినరోజు సందర్భంగా కటౌట్‌లు ఏర్పాటు చేస్తూ కరెంట్‌షాక్‌కు గురై ముగ్గురు అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను యశ్‌ ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

‘రాష్ట్రంలో మళ్లీ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని వార్తలు వస్తుండటంతో నేను ఈసారి పుట్టినరోజు వేడుకలను చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని నాలుగురోజుల ముందే నా అభిమానులకు తెలియజేశాను. నన్ను కలిసేందుకు ఎవరూ రావొద్దని చెప్పాను. నా పుట్టినరోజు నాడు బ్యానర్లు, కటౌట్లు పెట్టడం మానేయాలని ఎన్నోసార్లు కోరాను. నాపై ప్రేమను చూపించాలంటే మీ భవిష్యత్తు కోసం ఏదైనా చేసుకోండి. నేను ఇక్కడకు వచ్చేటప్పుడు కూడా కొందరు బైకులపై వేగంగా నా కారును వెంబడించారు. దయచేసి అలా చేయకండి. ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టే నాకు పుట్టినరోజు వస్తోందంటేనే భయమేస్తోంది. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేం. ఇకపై వారి కుటుంబాల బాధ్యత నాది’ అని చెప్పారు.

ఈ ఘటనలో మరో ముగ్గురు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి యశ్‌ పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి కూడా అండగా ఉంటానని భరోసానిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని