Minister Peddireddy: ఇది పెద్దిరెడ్డి అడ్డా.. మీరెలా వస్తార్రా?

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పానికి సైకిల్‌ యాత్ర చేపట్టిన తెదేపా కార్యకర్తలను అసభ్యంగా దూషించారు.

Updated : 21 Oct 2023 11:06 IST

పుంగనూరులో రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు
శ్రీకాకుళం నుంచి వచ్చిన తెదేపా అభిమానులపై దౌర్జన్యం
పసుపు చొక్కాలు విప్పించి, జెండాలు, కండువాలు తీయించి..
ఈ తతంగాన్ని వీడియో తీయాలని చెప్పి మరీ తెగింపు

ఈనాడు, చిత్తూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పానికి సైకిల్‌ యాత్ర చేపట్టిన తెదేపా కార్యకర్తలను అసభ్యంగా దూషించారు. వారు ధరించిన పసుపు చొక్కాలు విప్పించి, తెదేపా జెండాలు, కండువాలు తీసేయించాకే పుంగనూరు నుంచి కదలనిచ్చారు. ‘ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం. ఇక్కడ తెదేపా జెండా ఎగరకూడదు. మిమ్మల్ని కొట్టకుండా పంపిస్తున్నాం. సంతోషించండి. శ్రీకాకుళం నుంచి ఏం పీకడానికి వచ్చారు?’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ తతంగమంతా వీడియో తీయాలని పక్కనున్న వ్యక్తులకు చెప్పిన వైకాపా కార్యకర్త.. చివర్లో తన పేరు చెంగలాపురం సూరిగా చెప్పుకొన్నారు.

ఎక్కడా లేనంత బరితెగింపు: బాధితుల కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్తలు మాజీ సర్పంచి రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందరరావు, రమేశ్‌.. అక్టోబరు 2న రణస్థలం నుంచి కుప్పానికి సైకిల్‌ యాత్రగా బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద టీ తాగడానికి సైకిళ్లు ఆపారు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా కార్యకర్త సూరి, మరికొందరితో అక్కడికి వచ్చి దుర్భాషలాడారు. ‘ఇది పెద్దిరెడ్డి అడ్డా. పుంగనూరులో అడుగుపెట్టి వెనక్కి వెళ్లగలరా? చంద్రబాబునే రానివ్వలేదు. అలాంటిది తెదేపా జెండాలతో మీరెలా వస్తార్రా’ అంటూ రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి వారు పలమనేరులో బస చేశారు. శనివారం కుప్పానికి చేరుకుని పర్యటన ముగిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని