లక్షల మెజారిటీతో గెలిచినా దక్కని సీట్లు

ఉత్తర భారత దేశంలో బలంగా కనిపిస్తున్నప్పటికీ సిట్టింగ్‌లను భారీ సంఖ్యలో భాజపా మార్చింది. 2019 ఎన్నికల్లో లక్షల మెజారిటీతో గెలిచిన అభ్యర్థులనూ వివిధ కారణాలతో పక్కనబెట్టింది.

Updated : 26 Mar 2024 07:36 IST

విజయావకాశాలే ప్రాతిపదికగా భాజపాలో టికెట్లు
పార్టీకి చేటు తెచ్చే మాటలు, చేతలకు చెల్లుచీటీ

ఈనాడు, దిల్లీ: ఉత్తర భారత దేశంలో బలంగా కనిపిస్తున్నప్పటికీ సిట్టింగ్‌లను భారీ సంఖ్యలో భాజపా మార్చింది. 2019 ఎన్నికల్లో లక్షల మెజారిటీతో గెలిచిన అభ్యర్థులనూ వివిధ కారణాలతో పక్కనబెట్టింది. గత ఎన్నికల్లో లక్ష నుంచి 6 లక్షల వరకూ మెజారిటీతో గెలుపొందిన 39 మంది అభ్యర్థులను మార్చింది. ఇందులో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్‌, జౌళిశాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోస్‌ ఉన్నారు. భౌమిక్‌ను త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించారు. ఆమె గెలిచారు. ఆమెను ముఖ్యమంత్రిని చేస్తారని భావించినా చివరి నిమిషంలో ఆ పదవి దక్కలేదు. దీంతో ఆమె కేంద్రంలోనే కొనసాగారు. గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, దిల్లీల్లో భారీ మెజారిటీలు దక్కాయి. ఇందులో ఒక్క మధ్యప్రదేశ్‌లో మినహాయించి మిగిలిన 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ 100% సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడూ అదే పంథాను కొనసాగించేందుకు అభ్యర్థులను మార్చి పార్టీ కేడర్‌ను క్రియాశీలకంగా ఉంచే ప్రయత్నం చేసింది. ప్రజా జీవితంలో నిర్లక్ష్యంగా, అచేతనంగా ఉన్నవారిని, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మాటలు, చేతలతో పార్టీకి చెడ్డపేరు తెచ్చిన వారిని పక్కనబెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో 9 మంది సిట్టింగ్‌లను ఇంటికి పంపింది. ఇందులో ప్రధాన మంత్రి ప్రాతినిధ్యం వహించిన వడోదరా ఎంపీ రంజనాబెన్‌ భట్‌ ఉన్నారు. ఆమెకు పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో స్థానం కల్పించినప్పటికీ తర్వాత ఆస్ట్రేలియాలో హోటళ్లు ఉన్నాయనే ఆరోపణలు చుట్టుముట్టడంతో పక్కనబెట్టింది. దిల్లీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్‌ వర్మ కుమారుడు పర్వేష్‌ వర్మ, రమేష్‌ బిదూరి మైనారిటీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారి అవకాశాలను దెబ్బతీసినట్లు చెబుతున్నారు. ఒక మతం చేసే వ్యాపారాలను బాయ్‌కాట్‌ చేయాలని ఒక బహిరంగ సభలో పర్వేష్‌ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీశాయి. అలాగే రమేష్‌ బిదూరి లోక్‌సభలో మాట్లాడుతూ.. ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున యూపీ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ ఎంపీ డానిష్‌ అలీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సీటు కోల్పోయేలా చేశాయి. భోపాల్‌ ఎంపీ సాద్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకుర్‌ తొలగింపు వెనుకా ఇలాంటి కారణాలే ఉన్నాయి.

అసెంబ్లీకి వెళ్లడంతో కొంత మంది..

రాజస్థాన్‌కు చెందిన దియా కుమారి, రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌, బాబా బాలక్‌నాథ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ప్రహ్లాద్‌ పటేల్‌, రాకేష్‌ సింగ్‌ గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో వారిని లోక్‌సభ బరి నుంచి తప్పించారు. ఈసారి ఎన్నికల్లో భాజపాకు 370, ఎన్డీయే కూటమికి 400కిపైగా సీట్లు రావాలని లక్ష్యంగా పెట్టుకున్న నాయకత్వం అభ్యర్థుల ఎంపికలో కేవలం విజయావకాశాలకే ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీలో అంతర్గత కలహాలు, ఒకరిని ఒకరు దెబ్బ తీసుకునేందుకు ప్రయత్నించడం, అనవరమైన వ్యాఖ్యలు చేసి పార్టీని వివాదాల్లోకి లాగిన వారిని నిర్మొహమాటంగా పక్కనబెడుతోంది. దీంతోపాటు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తోంది. 2019 ఎన్నికల్లో దేశంలో రెండో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన హరియాణాలోని కర్నాల్‌ ఎంపీ సంజయ్‌ భాటియాను పక్కనబెట్టి అక్కడ మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను రంగంలోకి దింపింది. ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి 6సార్లు గెలుపొంది, గత ఎన్నికల్లో కర్ణాటకలోనే అత్యధికంగా 4.79 లక్షల మెజారిటీతో గెలుపొందిన అనంత కుమార్‌ హెగ్డే.. తాము 400కిపైగా సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనను పక్కనబెట్టేలా చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని