Abhijit Gangopadhyay: భాజపాలో చేరుతున్నా.. రాజీనామా చేసిన గంటల్లోనే ప్రకటన

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ తన పోస్టుకు రాజీనామా చేసి భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకూ సిద్ధమన్నారు.

Published : 05 Mar 2024 16:53 IST

కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ (Justice Abhijit Gangopadhyay) తన పోస్టుకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే.. తాను భాజపా (BJP)లో చేరుతున్నట్లు ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) అవినీతికి మారుపేరని ఆరోపిస్తూ.. ఆ పార్టీపై చివరివరకు పోరాడతానన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేయాలా? వద్దా? అనేది భాజపా అధిష్ఠానం చేతుల్లో ఉందని, ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తానని తెలిపారు.

‘‘రాజకీయాల్లో చేరాలనే నిర్ణయం తీసుకునేందుకు టీఎంసీ వైఖరే కారణం. పశ్చిమబెంగాల్‌లో ఆ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయి. సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమికి పట్టిన గతే పడుతుంది. భాజపా ఓ జాతీయ పార్టీ. రాష్ట్రంలో టీఎంసీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కష్టపడి పనిచేసే వ్యక్తి. దేశం కోసం ఏదైనా చేయాలని కృషి చేస్తున్నారు’’ అని జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ వ్యాఖ్యానించారు. మార్చి 7వ తేదీన కమలదళంలో చేరే అవకాశం ఉందని కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

కలకత్తా హైకోర్టు జడ్జి రాజీనామా.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి?

2018 మేలో కలకత్తా హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2020 జులైలో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ ఉన్నప్పటికీ.. ముందస్తుగానే రాజీనామా చేశారు. బెంగాల్‌లో విద్యారంగానికి సంబంధించి ఆయన ఇచ్చిన పలు తీర్పులు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ సీబీఐ, ఈడీలను ఆదేశించారు. ఆయన తీర్పులపై అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు వార్తలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని