ఆపత్కాలం యాప్‌లు!

కరోనా కష్టకాలంలో పలు యాప్స్‌ ఎంతో మేలు చేస్తున్నాయి. అన్నిరకాలుగా ఉపయోగపడే సర్వీసులు అందిస్తున్నాయి.

Published : 05 May 2021 00:42 IST

కరోనా కష్టకాలంలో పలు యాప్స్‌ ఎంతో మేలు చేస్తున్నాయి. అన్నిరకాలుగా ఉపయోగపడే సర్వీసులు అందిస్తున్నాయి. ఇవి ఫోన్‌లో ఉంటే ఆపత్కాలంలో మనకు, సన్నిహితులకు మంచిది.

ట్రూ కాలర్‌- నిజమైన సేవ: కాలర్‌ ఐడీ సర్వీస్‌ ప్రొవైడర్‌ ‘ట్రూ కాలర్‌’ దేశంలోని మొత్తం ఆసుపత్రుల జాబితాను సిద్ధం చేసింది. యాప్‌లోని మెనూ లేదా డైలర్‌ విభాగంలోకి వెళ్తే ఆసుపత్రుల వివరాలు, అక్కడి కరోనా వైద్య సౌకర్యాలేంటో తేలికగా తెలుసుకోవచ్చు. ఫోన్‌ నెంబర్లు, చిరునామా సైతం అందుబాటులో ఉంచారు. ఈ సమాచారం అంతా ప్రభుత్వ డేటాబేస్‌ నుంచి సేకరించాం అంటోంది ట్రూ కాలర్‌..

ఎస్‌.. మీకు తోడుగా: ఇరవై లక్షల యూజర్లు ఉన్న కార్‌ పూలింగ్‌ యాప్‌ ఎస్‌ రైడ్‌. ‘ఎస్‌ నైబర్‌’ పేరుతో కొత్త సర్వీసు ప్రారంభించింది. కొవిడ్‌ సమాచారం, పరీక్షల వివరాలు, ఆహారం, వైద్యం, మందులు, నిత్యావసరాలు, ఆసుపత్రుల వివరాలు.. ఇలా ప్రతీదీ పంచుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. దీన్ని ప్రారంభించిన కొద్ది సమయంలోనే యూజర్లు వందశాతం రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నారు అంటున్నారు ఎస్‌ రైడ్‌ వ్యవస్థాపకుడు లక్ష్య ఝా.

ప్రేమతో.. ట్రూలీ మ్యాడ్‌లీ: నిన్నటిదాకా జంటల్ని కలిపిన డేటింగ్‌ యాప్‌ ట్రూలీ మ్యాడ్లీ ఇప్పుడు ప్లాస్మా అవసరమై ఆపదల్లో ఉన్నవారు, ప్లాస్మా దాతల్ని కలిపే వేదికగా మారిపోయింది. ఈ యాప్‌లో ‘ప్లాస్మా మ్యాచ్‌ మేకింగ్‌’ అనే కొత్త ఫీచర్‌ జోడించారు. దీని సాయంతో డోనర్లను కలుసుకొని కొంతమంది ప్రాణాలు నిలుపుకొంటున్నారు.

మ్యాప్‌ మై ఇండియా- లెక్క చెబుతుంది: ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లో లభ్యం. ఈ యాప్‌లోని డాష్‌బోర్డులోకి వెళ్తే రాష్ట్రాలవారీగా మొత్తం కొవిడ్‌ కేసులు, చికిత్సా కేంద్రాలు, ఐసోలేషన్‌ సెంటర్లు, ఆహార కేంద్రాలు.. సమస్త వివరాలన్నీ కనిపిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక లెక్కల్లో నుంచే ఈ వివరాలు తీసుకుంటున్నారు.

ఇంట్లోనే పరీక్షలు- ప్రాక్టో: కరోనా పరీక్షల చేయించుకోవడం అంటే మన సహనానికే పెద్ద పరీక్ష. ఆ ఇబ్బందేం లేకుండా టెలిమెడిసిన్‌ ప్లాట్‌ఫామ్‌ యాప్‌ ప్రాక్టో ప్రస్తుతం ఇంటి దగ్గరికే వచ్చి కరోనా శాంపిళ్లు తీసుకుంటోంది. దీనికోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవాలి. వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని