Smartphones Launch: జూన్‌లో మిస్‌ అయిన స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే.. జులైలో పక్కా విడుదల!

జూన్‌ నెలలో కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ విడుదల వాయిదా పడటంతో.. వాటిని జులైలో విడుదల చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. మరి జులై నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ల జాబితాపై మీరు ఓ లుక్కేయండి..

Published : 28 Jun 2022 09:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గాడ్జెట్‌ ప్రియులకు జూన్‌ నెల కొంత నిరాశ కలిగించిందనే చెప్పుకోవాలి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ విడుదల వాయిదా పడటం ఇందుకు ప్రధాన కారణం. దీంతో జులైలో విడుదలయ్యే మోడల్స్‌ గురించి యూజర్లు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం..జులై నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ల జాబితాపై మీరు ఓ లుక్కేయండి..


వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ 5జీ (OnePlus Nord 2T 5G)

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 12.1తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉపయోగించారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80 వాట్‌ సూపర్‌వోక్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. జూన్‌ చివరి వారం లేదా జులై మొదటి వారంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. ధర రూ. 30వేలలోపు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. 

ఈ ఫోన్‌తో పాటు వన్‌ప్లస్‌ 10 టీ అనే మరో కొత్త ఫోన్‌ను కూడా విడుదల చేయనుంది. ఇందులో 120 హెర్జ్‌ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్‌ 1 ప్రాసెసర్ ఉపయోగించినట్లు సమాచారం.  4,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందట. జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో విడుదల చేస్తారని అంచనా. 


రియల్‌మీ జీటీ సిరీస్‌ (Realme GT Series)

రియల్‌మీ కంపెనీ జీటీ సిరీస్‌లో రెండు కొత్త మోడల్స్‌ రియల్‌మీ జీటీ నియో 3టీ (Realme GT Neo 3), రియల్‌మీ జీటీ2 మాస్టర్‌ ఎడిషన్‌ (Realme GT2 Master Edition)లను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. వీటిలో ముందుగా ఏ మోడల్‌ను విడుదల చేస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. జీటీ నియో 3టీలో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.

రియల్‌మీ జీటీ 2 మాస్టర్‌ ఎడిషన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ వన్‌, 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, రెండు 50 ఎంపీ, ఒక 2 ఎంపీ కెమెరాలుంటాయని సమాచారం. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తాయి. 


నథింగ్ ఫోన్‌ వన్‌ (Nothing Phone 1)

నథింగ్ ఫోన్‌ వన్‌ను జూన్‌ నెలలో విడుదల చేస్తారని ప్రకటించినప్పటికీ, కేవలం ముందస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మాత్రమే ప్రారంభించారు. జులై 12న ఈ ఫోన్‌ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫోన్‌ ఫీచర్ల గురించిన సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ వన్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు, ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 45 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. దీని ధర రూ. 35 వేల నుంచి రూ. 40 వేల మధ్య ఉంటుందని సమాచారం. 


గూగుల్ పిక్సెల్‌ 6ఏ (Google Pixel 6A)

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 60 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. టెన్సర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. పిక్సెల్‌ 6ఏలో వెనుకవైపు రెండు 12 ఎంపీ కెమెరాలు, వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం ముందు 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఫోన్‌లోని 4,410 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్‌ ధర సుమారు ₹ 40,000 ఉంటుందని అంచనా.


అసుస్‌ ఆర్‌వోజీ ఫోన్ 6 (Asus ROG Phone 6)

గేమింగ్ ప్రియుల కోసం అసుస్‌ కంపెనీ రెండు వేరియంట్లలో ఆర్‌వోజీ ఫోన్‌ 6ను తీసుకురానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. 165 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, వెనుకవైపు అదనంగా ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. అంతేకాకుండా వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు ముందు 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని సమాచారం. గేమ్స్‌ ఆడేప్పుడు ఫోన్‌ వేడెక్కకుండా కూలింగ్ ప్యాడ్స్‌ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ధర రూ. 60 వేల నుంచి రూ. 70 వేల మధ్య ఉండొచ్చని అంచనా. ముందుగా జులై 5న అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనున్నారు. తర్వాత భారత్‌లో విడుదల చేస్తారని సమాచారం. 


ఐకూ 9టీ (iQOO 9T) & ఐకూ 10 ప్రో (iQOO 10 Pro)

ఐకూ కంపెనీ కూడా రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఐకూ 9టీ, ఐకూ 10 ప్రో పేర్లతో వీటిని తీసుకురానుంది. ఈ రెండు ఫోన్లలో 120 హెర్జ్‌ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఇస్తున్నట్లు సమాచారం. ఐకూ 9 టీ మోడల్‌ 120 వాట్ ఛార్జింగ్‌కు, ఐకూ 10 ప్రో ఫోన్‌ 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 200 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. జులై రెండో వారంలో ఒక మోడల్‌, చివరి వారంలో మరో మోడల్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. 


షావోమి 12 అల్ట్రా (Xiaomi 12 Ultra)

షావోమి కంపెనీ కూడా గత నెలలోనే ఈ మోడల్‌ను విడుదల చేస్తారని భావించినప్పటికీ జులై నెలకు వాయిదా వేసింది. ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 2K అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో లైకా (Leica) కెమెరా సెటప్‌ ఉంది. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. జులై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ధర రూ. 50 వేల లోపు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 


ఒప్పో రెనో 8 సిరీస్‌  (Oppo Reno 8 Series)

ఒప్పో కంపెనీ రెనో సిరీస్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చినట్లు తెలుస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5జీ ప్రాసెసర్‌ ఉపయోగించారట. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. జులై రెండు లేదా మూడో వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ధర రూ. 40 వేల లోపు ఉంటుందని అంచనా. 


మోటో ఎడ్జ్‌ 30 అల్ట్రా (Moto Edge 30 Ultra)

మోటోరోలా ఫ్లాగ్‌షిప్ శ్రేణిలో కొత్త మోడల్‌ను జులై రెండు లేదా నాలుగో వారంలో భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. 200 ఎంపీ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ. సెల్ఫీ, వీడియో కాలింగ్‌ కోసం ముందుభాగంలో 60 ఎంపీ కెమెరా అమర్చినట్లు సమాచారం. 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.73-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారని సమాచారం. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 125 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్‌ చేస్తుందట. 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లో లభిస్తుందని అంచనా. 

ఇవేకాకుండా లావా కంపెనీ కొత్త 5జీ ఫోన్‌, వివో టీ1ఎక్స్‌, శాంసంగ్‌ ఎస్‌ 21 ఎఫ్‌ఈ 4జీ, మోటో జీ42 మోడల్స్‌ విడుదలవుతాయని సమాచారం. అయితే ఈ ఫోన్లలోని ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న 5జీ ఫోన్లకు పోటీగా తక్కువ ధరలో లావా 5జీ ఫోన్‌ తీసుకొస్తుందట. దీని ధర రూ. 15 వేల లోపు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు