‘మీ ఇంటికొచ్చి.. నిన్ను గంటలో చంపేస్తా’.. విలేకరికి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపు

‘మీ ఇంటికొచ్చి.. నిన్ను గంటలో చంపేస్తా’ అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక వెబ్‌ పత్రిక విలేకరిని బుధవారం ఫోన్‌లో బెదిరించారు.

Updated : 07 Mar 2024 07:20 IST

ఈనాడు, ఒంగోలు: ‘మీ ఇంటికొచ్చి.. నిన్ను గంటలో చంపేస్తా’ అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక వెబ్‌ పత్రిక విలేకరిని బుధవారం ఫోన్‌లో బెదిరించారు. ఇటీవల తర్లుపాడు పంచాయతీకి చెందిన ముగ్గురు వార్డు సభ్యులు రాజీనామాలు చేయడంతో వైకాపా నాయకులు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. వారిలో ఇద్దరు తమ రాజీనామాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు. రాజీనామాల వ్యవహారం వెనుక అసమ్మతి వర్గం ఉందని ఎంపీపీ వర్గం భావిస్తోంది. అదేరోజు వైకాపాలోని అసమ్మతివర్గం ప్రస్తుత వైకాపా సమన్వయకర్త అన్నా రాంబాబును కలిసి, స్థానికంగా ఉన్న విలేకరికి పత్రికా ప్రకటన ఇచ్చింది. అందులో ఎంపీపీ భర్తను తర్లుపాడు నయీంగా, ఎమ్మెల్యే సోదరుడిని నియోజకవర్గ నయీంగా ఆరోపించారు. ఆ విషయాన్ని విలేకరి కొన్ని వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేయడంతోపాటు తన వెబ్‌ పత్రికలో ప్రచురించారు. దీంతో ఆవేశానికి లోనైన ఎమ్మెల్యే సోదరుడు విలేకరికి ఫోన్‌ చేసి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఫోన్‌ కాల్‌ను రికార్డ్‌ చేసిన విలేకరి తనకు ఏదైనా జరిగితే ఆయనదే బాధ్యతంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని