దోచిపెట్టాలని దాచిపెట్టారు!

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన మంగంపేట గనుల్లో సీ, డీ గ్రేడ్‌ ముగ్గురాయి కోసం ఇటీవల పిలిచిన టెండర్ల వెనుక భారీ స్కెచ్‌  బయటపడింది.

Updated : 19 Mar 2024 12:50 IST

మంగంపేట ముగ్గురాయి టెండర్ల రద్దు వెనుక రహస్యమిదే
ఈ ఏడాదితో నిండుకోనున్న ఏ-గ్రేడ్‌ నిల్వలు
తర్వాత గ్రేడ్‌లకు డిమాండ్‌తో రెట్టింపు కానున్న ధర
దీనిని గుట్టుగా ఉంచి సీ, డీ గ్రేడ్‌లకు ఐదేళ్లకు టెండరు
ఓ బయ్యర్‌కు రూ.వందల కోట్ల ప్రయోజనం కలిగించేందుకే
పత్రికల్లో కథనాలు రావడంతో వెనక్కి తగ్గిన వైనం
ఈనాడు - అమరావతి

పీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన మంగంపేట గనుల్లో సీ, డీ గ్రేడ్‌ ముగ్గురాయి కోసం ఇటీవల పిలిచిన టెండర్ల వెనుక భారీ స్కెచ్‌  బయటపడింది. ఏపీఎండీసీకి రూ.వందల కోట్ల నష్టం చేకూర్చి, ఓ బయ్యర్‌కు మేలుచేసే వ్యూహం దీని వెనుక ఉంది. ప్రతి ఏటా పిలవాల్సి ఉండగా ఐదేళ్ల కాలానికి ఒకేసారి కోటి మెట్రిక్‌ టన్నుల ముగ్గురాయి విక్రయాలకు బిడ్లు ఆహ్వానించారు. ఇందులో మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం కథ నడిపారు. అక్కడ లభించే ముగ్గురాయిలో ఏ గ్రేడ్‌ నిల్వలు కొన్ని నెలల్లో అయిపోతుండగా, ఆ తర్వాత మిగిలిన గ్రేడ్లకు డిమాండ్‌ పెరుగుతుంది. దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా ఇదంతా చేసినట్లు సమాచారం. పత్రికల్లో కథనాలు రావడంతో చివరికి ఆ టెండర్లు రద్దయ్యాయి. రద్దు వెనుక తతంగాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి... 

అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె మండలం మంగంపేట వద్ద ఏపీఎండీసీకి ముగ్గురాయి గనులు ఉన్నాయి. చమురు వెలికితీసే కంపెనీలు దీనిని వినియోగిస్తుండటంతో వీటికి మంచి డిమాండ్‌ ఉంది. ఇక్కడ తవ్వితీసే ముగ్గురాయిలో ఏ, బీ, సీ, డీ, డబ్ల్యూ(వేస్ట్‌) గ్రేడ్‌లకు ఏటా టెండర్లు పిలిచి, బయ్యర్లను ఎంపిక చేస్తారు. సాధారణంగా ఏటా 15-20 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకే సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌ల ముగ్గురాయిని బయ్యర్లు తీసుకుంటారు. అయితే ఈ ఏడాది జనవరి 24న ఏపీఎండీసీ అధికారులు ఐదేళ్ల కాలవ్యవధికి కోటి మెట్రిక్‌ టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల ముగ్గురాయికి ఒకేసారి టెండరు పిలిచారు. ఇందులో టెండరు ధరావతు రూ.90 కోట్లు, టెండరు డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు రూ.29.5 లక్షల ఫీజు చెల్లించాలి... బిడ్‌ దక్కించుకునే గుత్తేదారు కాంట్రాక్టు విలువలో 50 శాతం మేర పెర్ఫార్మెన్స్‌ సెక్యూరిటీగా(దాదాపు రూ.600 కోట్లు) డిపాజిట్‌ చేయాలి... వంటి నిబంధనల్ని విధించారు. ఓ కీలక బయ్యర్‌కు ఈ టెండరు దక్కేలా ఇదంతా చేశారనే విమర్శలొచ్చాయి. 

ఏటా టెండర్లు నిర్వహిస్తే...

ప్రస్తుతం మంగంపేట గనుల్లో కీలకమైన ఏ గ్రేడ్‌ నిల్వలు చివరి దశలో ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరుకు గనుల్లో ఏ గ్రేడ్‌ ముగ్గురాయి లభించదు. ఆ తర్వాత బీ గ్రేడ్‌తోపాటు, సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌లకు డిమాండ్‌ ఏర్పడుతుంది. ఏటా టెండర్లు నిర్వహిస్తే వీటి ధర క్రమంగా పెరుగుతుంది. కానీ ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి, ఒకేసారి ఐదేళ్లకు టెండరు పిలిచారు.

  • రెండేళ్ల కిందట టెండర్లు పిలిచినప్పుడు ఏ గ్రేడ్‌కు మెట్రిక్‌ టన్ను ధర రూ.6,691, బీ గ్రేడ్‌ రూ.5,225, సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్లకు రూ.1,670గా ఉంది. వీటికి అదనంగా సీనరేజ్‌, సెస్‌, జిల్లా ఖనిజ నిధి, మెరిట్‌, జీఎస్టీ తదితరాలు ఉంటాయి.
  • తాజాగా పిలిచిన టెండర్లలో సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల రిజర్వ్‌ ధర మెట్రిక్‌ టన్నుకు రూ.1,200గా పేర్కొన్నారు. ఇప్పటివరకు బయ్యర్లు కొంటున్న ధర రూ.1,670. దానిని రూ.470 తగ్గించి రూ.1,200గా టెండరులో పేర్కొన్నారు. అంటే కోటి మెట్రిక్‌ టన్నుల టెండరు దక్కించుకున్న బయ్యర్‌కు ఐదేళ్లలో రూ.470 కోట్లు మిగులుతుంది.
  • సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్లకు వచ్చే ఏడాది నుంచి ధర పెరిగి రెండు, మూడేళ్లలో మెట్రిక్‌ టన్ను రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు చేరొచ్చని భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం మెట్రిక్‌ టన్ను రూ.1,200 ధరతో బిడ్‌ దక్కించుకునే బయ్యర్‌కు మున్ముందు మార్కెట్‌లో రెట్టింపు ధరకు విక్రయించి భారీగా లాభపడనున్నారు. దాదాపు రూ.1,200 కోట్ల మేర బయ్యర్‌కు మిగులుతుంది.

లొసుగుల్ని వెలుగులోకి తెచ్చేసరికి...

మంగంపేట ప్రాంతంలో పల్వరైజింగ్‌ మిల్లులు, విదేశీ కంపెనీలతో సంబంధాలు కలిగి... ముగ్గురాయి ఎగుమతుల్లో కొంతకాలం ‘విక్రమా’ర్కుడిలా పైచేయి చూపిస్తున్న ఓ బయ్యర్‌ కోసం ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. అతనికి ఏపీఎండీసీ కీలక అధికారితో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో టెండరును ఎలాగైనా అతడి సంస్థకే దక్కేలా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ టెండర్లలో లొసుగులు, ఇందులో విధించిన నిబంధనలపై పత్రికల్లో వరుస కథనాలతో ఏపీఎండీసీ అధికారులు వెనక్కు తగ్గారని తెలిసింది. ఈ కీలక బయ్యర్‌కు బిడ్లు వేయొద్దని సూచించినట్లు సమాచారం. చివరకు ఎవరూ బిడ్లు దాఖలు చేయలేదని టెండర్లు రద్దుచేశారు. ముందుగా అనుకున్నట్లు ప్రణాళిక ప్రకారం టెండర్లు జరిగి ఉంటే ఏపీఎండీసీ రూ.వందల కోట్లు నష్టపోయేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని