ఎమ్మెల్వోల పేరుతో జగన్‌ గూడుపుఠాణి

మీ క్లస్టర్‌ పరిధిలోని కుటుంబాలకు చెందిన అత్యధిక ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి. రాబోయే రోజుల్లో సమయస్ఫూర్తితో పనిచేయాలి. తెలివిగా ప్రచారాన్ని నిర్వహించాలి. మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే మాకు సమాచారమివ్వండి.

Updated : 10 Apr 2024 11:57 IST

వాలంటీర్లకు శిక్షణ కోసమంటూ నియామకం
ప్రభుత్వానికి సమాంతరంగా సొంత సైన్యం
నాలుగున్నరేళ్లపాటు జీతభత్యాలుగా రూ.260 కోట్ల ప్రజాధనం
ప్రజలు, ఓటర్ల సమస్త సమాచారం సేకరించి గుప్పిట
ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగం
చేష్టలుడిగి చూస్తున్న ఎన్నికల సంఘం, కలెక్టర్లు
ఈనాడు - అమరావతి


మీ క్లస్టర్‌ పరిధిలోని కుటుంబాలకు చెందిన అత్యధిక ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి. రాబోయే రోజుల్లో సమయస్ఫూర్తితో పనిచేయాలి. తెలివిగా ప్రచారాన్ని నిర్వహించాలి. మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే మాకు సమాచారమివ్వండి. చేతనైన సాయం చేస్తాం.

వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరులో వాలంటీర్లకు ఎమ్మెల్వో పెట్టిన సందేశమిది


వైకాపాకు ఓట్లేసేలా జనాన్ని మోటివేట్‌ చేయాలి. జగనన్న మిమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు. మేం చెప్పినట్టు వినాలి. లేకపోతే వచ్చే ప్రభుత్వంలో వాలంటీర్లుగా మిమ్మల్ని తీసుకోం. వేరేవారిని నియమించుకుంటాం.

గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్వో వాలంటీర్లకు చేసిన హెచ్చరిక ఇది


వాలంటీరు పోస్టుకు రాజీనామా చేయాలి. ఇది పైనుంచి వచ్చిన ఆదేశం. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. వైకాపా అధికారంలోకి రాగానే మిమ్మల్నే మళ్లీ తీసుకుంటాం.

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వాలంటీర్లకు ఎమ్మెల్వో చేసిన దిశానిర్దేశం


ఎమ్మెల్వో అంటే ఎవరనే కదా మీ సందేహం? ఈయన్ను మండల స్థాయి అధికారి అని పిలవాలని జగన్‌ నిర్దేశించారు.  ఈ హోదా చూసి ప్రభుత్వ అధికారేమో అని అనుకునేరు. కానే కాదు. వైకాపాకు వేగు. వాలంటీర్లను వినియోగించుకుని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అధీకృతంగా దొంగిలించేందుకు సీఎం జగన్‌ ఏర్పాటు చేసుకున్న సొంత సైన్యం. ఇలాంటి వారిని రాష్ట్రవ్యాప్తంగా 1000 మందికిపైగానే నియమించుకున్నారు. వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే నెపంతో ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఓఏ) మాటున నాలుగున్నరేళ్లపాటు రూ.260 కోట్ల ప్రజాధనాన్ని వీరికి జీతభత్యాలుగా చెల్లించారు. ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించి గుప్పిట పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర పడేసరికి ఎమ్మెల్వోలకు వేసిన ముసుగును జగన్‌ తీసేశారు. ఎఫ్‌ఓఏ పేరిట రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఎమ్మెల్వోలను వైకాపాకు స్లీపర్‌సెల్స్‌లా ప్రజలపైకి వదిలారు.

ప్రభుత్వాధిపతిగా ఉండి పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రైవేట్‌ సంస్థ చేతిలో పెట్టడం తీవ్రమైన నేరం. ఇది తెలిసీ జగన్‌ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.  ఇప్పుడు ఇదే సమాచారంతో ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు ఎమ్మెల్వోలు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల వెంట తిరుగుతున్నారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ముగిసినా వాలంటీర్లను గుప్పిట పెట్టుకుని పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడిపిస్తున్నారు. వైకాపాకు ఓటేయించాలనే ప్రచారాన్ని వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి పంపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇది విశృంఖలంగా కొనసాగుతున్నా ఎన్నికల సంఘం అధికారులు, కలెక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని చూస్తున్నారు.

ప్రభుత్వానికి సమాంతరంగా ఎమ్మెల్వో వ్యవస్థ

జగన్‌ ప్రజాపాలకునిగా ఉండి పార్టీకి వ్యక్తిగత లబ్ధి చేకూర్చుకునేందుకు ప్రభుత్వానికి సమాంతరంగా ఒక కరడుగట్టిన వ్యవస్థను నడిపారు. అదీ ప్రజాధనంతో. ఈ నియామకం వెనుక పెద్ద కుట్రే ఉంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహాన్ని పన్ని.... వైకాపాకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పెట్టుకునేందుకు, వాలంటీర్ల ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎఫ్‌ఓఏ అనే సంస్థను నియమించుకున్నారనే విషయం ఇప్పుడు బట్టబయలైంది. ఈ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1000 మందికిపైగా ఎమ్మెల్వోలను 2019 డిసెంబరులో నియమించారు. మండల/పురపాలక స్థాయిలో ఒకరు చొప్పున 1000 మందికి పైగానే ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున 50 మంది వీరిని పర్యవేక్షిస్తున్నారు. మండల, జిల్లా స్థాయుల్లోని ఎమ్మెల్వోలను సమన్వయం చేసుకునేందుకు రాష్ట్రస్థాయిలో మరో 5 మందిని నియమించారు. నాలుగేళ్లుగా వీరికి ఏడాదికి రూ.65 కోట్ల చొప్పున సుమారు రూ.260 కోట్లు ప్రజాధనాన్ని జీతంగా చెల్లించారు. ఇప్పుడు వీరి ద్వారానే వాలంటీర్లతో వైకాపా అనుకూల ప్రచారాన్ని చేయిస్తున్నారు.

అంతా గోప్యమే..

మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎమ్మెల్వోలు నాలుగున్నరేళ్ల పాటు విధుల్లో ఉన్నా ఎంపీడీవో నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు ఏ అధికారికీ వీరిపై అజమాయిషీ లేదు. వీరు సేకరిస్తున్న వివరాలు ఎక్కడి వెళుతున్నాయో? వాటితో ఏం చేస్తున్నారో అంతా గోప్యమే. దర్జాగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నా అధికార యంత్రాంగం నిద్ర నటించింది.

ఎమ్మెల్వోలు ఇన్నాళ్లూ ఏం చేశారంటే..

  • వాలంటీర్ల పరిధిలోని కుటుంబాల సమాచార సేకరణ
  • క్లస్టర్ల వారీగా పార్టీల బలాబలాలు
  • పథకాలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ   సేకరణ
  • ఎవరు ఏ పార్టీకి ఓటేసే అవకాశముందో ఆరా తీయడం
  • వాలంటీర్ల వాట్సప్‌ గ్రూపుల్లో వైకాపా అనుకూల ప్రచారం

పోలింగ్‌ బూత్‌ల వారీగా వాట్సప్‌ గ్రూప్‌లు

ఇప్పటివరకు వాలంటీర్లకు ప్రభుత్వమిచ్చిన నంబరు ఆధారంగా ఎమ్మెల్వోలు వాట్సప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం వాలంటీర్లపై చర్యలకు దిగుతుండటం.. వారి అధికారిక ఫోన్‌ను, నంబరును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో వైకాపా వ్యూహం మార్చింది. అధికారుల కంటపడకుండా ఉండేందుకు ఎమ్మెల్వోలు వాలంటీర్ల వ్యక్తిగత మొబైల్‌ నంబర్లు తీసుకుని వాటితో ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో వైకాపా అనుకూల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ పోస్టులను పెడుతున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాలంటీర్లు వారి పరిధిలోని 50 కుటుంబాలతో ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.  ఇప్పటికే చాలాచోట్ల వాటిని ఏర్పాటు చేయించారు కూడా. ఈ గ్రూప్‌ల నుంచి ఏ వాలంటీర్‌ కూడా బయటికి వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. నూజివీడు నియోజకవర్గంలో ప్రతి బీఎల్వో పరిధిలో ముగ్గురు వాలంటీర్లను నియమించారు. వారు పోలింగ్‌ వరకు వైకాపా నిర్దేశించే అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని ఆదేశించారు.

పింఛన్ల పంపిణీపై దుష్ప్రచారం

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సరిపడా ఉన్నా.. ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్న వైకాపా ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేలా దుష్ప్రచారం చేయిస్తోంది. దీనికీ ఎమ్మెల్వోలనే రంగంలోకి దింపింది. వైకాపా పెట్టిన పోస్టులను వారు వాలంటీర్ల గ్రూపుల్లో విస్తృతంగా పోస్ట్‌ చేశారు. వారి పరిధిలో ఉండే పింఛనుదార్లకు ఈ విషయం చెప్పాలని ఉసిగొల్పారు. ‘జగనన్న సందేశాలు, మ్యానిఫెస్టోను ప్రతి ఒక్కరికీ వాట్సప్‌ ద్వారా పంపాలి. వీలుంటే ప్రత్యక్షంగా కలిసి తెలియజేయాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని విధుల్లోంచి తీసేసినా.. వైకాపా మళ్లీ అధికారంలోకి రాగానే తీసుకుంటాం. వైకాపా అభ్యర్థులకు మీ పరిధిలోని ఓటర్లతో ఓటేయించాలి’ వంటి సందేశాలను ఎమ్మెల్వోలు వాలంటీర్లకు పంపిస్తున్నారు.


కోడ్‌ అమల్లోకి వచ్చినా అదే బరితెగింపు

ఎమ్మెల్వోల విధుల గడువు ఫిబ్రవరితోనే ముగిసింది. వారు వాలంటీర్లతో సమావేశాలు పెట్టేందుకు, సమాచారం సేకరించేందుకు వీల్లేదు. కానీ క్షేత్రస్థాయిలో వాలంటీర్లతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల పరిధిలోని ఓటర్ల వివరాలు సేకరించారు. వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, విజయనగరం తదితర చోట్ల ఇలా వివరాలు తీసుకున్నారు. పలు నియోజకవర్గాల పరిధిలో క్లస్టర్ల వారీగా వైకాపాకు అనుకూలంగా ఓటేసేవారు ఎంతమంది? తటస్థులు ఎవరు? తెదేపా, ఇతర పార్టీలకు ఓటేసే వారెవరనే వివరాలు సేకరించారు. ఎన్నికల్లో వైకాపాకు ప్రచారాన్ని నిర్వహించేందుకు వీలుగా రాజీనామాలు చేయాలని కొన్నిచోట్ల వాలంటీర్లను బెదిరిస్తున్నారు.


గ్రూప్‌ నుంచి వైదొలిగే వారిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది

నెల రోజులే కదా అంటూ వాలంటీర్లకు ఎమ్మెల్వో మెసేజ్‌

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: ‘మీకు ఇదే చివరి ఛాన్స్‌. ఇకపై గ్రూపు నుంచి ఎవరు వైదొలిగినా వారి పేర్లను ప్రభుత్వానికి నివేదిస్తాం. తర్వాత విషయం సీరియస్‌గా ఉంటుంద’ంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని వాలంటీర్లకు ఎమ్మెల్వో (మండల స్థాయి అధికారి) మురళీరెడ్డి మంగళవారం గ్రూపులో మెసేజ్‌ చేశారు. వాలంటీర్లకు వైకాపా తరఫున ఎన్నికల ప్రచార మెసేజ్‌లు పెడుతున్న ఎమ్మెల్వోపై కేసు పెట్టి, విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ‘మేం ప్రభుత్వం పంపే మెసేజ్‌లు షేర్‌ చేసేందుకు గ్రూపులో ఎవరూ ఉండటం లేదని చెప్పాం. అందుకు వాళ్లు గ్రూపు నుంచి ఎగ్జిట్‌ అవుతున్న వారి పేర్లు మాకు పంపండని చెప్పారు. విషయం సీరియస్‌గా ఉంది. ఉండేవే 2 గ్రూపులు. ఒకటి బూత్‌ వైజ్‌ గ్రూపు, రెండోది వార్డు సచివాలయం వాలంటీర్ల గ్రూపు. అంతే కదా! గ్రూపు నుంచి వైదొలగవద్దు. ఇంకా 30 రోజులే ఉంది. ఫీల్డ్‌ వర్క్‌ ఏమీ చెప్పడం లేదు కదా?’ అంటూ వాలంటీర్లకు ఎమ్మెల్వో మంగళవారం మెసేజ్‌ పంపారు. వాలంటీర్లను పర్యవేక్షించే ఎమ్మెల్వో గతంలోనూ ఇలాంటి మెసేజ్‌లు పంపగా, పలువురు గిద్దలూరు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చర్యలు తీసుకోలేదు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని